పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/157

ఈ పుట ఆమోదించబడ్డది

150

బ్రహ్మోత్తరఖండము


నిచ్చటినాగకన్యక లహీనవిలాసిను లట్లుగాన నీ
విచ్చట నుండి సౌఖ్యము లనేకము లందుము నిర్భయుండవై.

95


క.

అని పలికిన యాతక్షకుఁ
గనుఁగొని రాజన్యసుతుఁడు గ్రమ్మఱఁ బలికెన్
వనజాతాసనపత్నీ
ఘనమణిమంజీరనాదకలనార్భటులన్.

96


శా.

ఆకర్ణింపుము నాదువిన్నపము సర్వాధ్యక్షభోగాగ్రర
త్నాకల్పాంగ మదేకపుత్త్రకులునై నాతల్లియుం దండ్రియున్
శోకప్రాప్తిని గుందుచుండుదురు సంక్షోభించు మత్పత్నియున్
వీక న్వారలకు న్మనఃప్రియము నేఁ గావించెదన్ గ్రమ్మఱన్.

97


చ.

అదియును గాక నాహితులు నత్తయుమామయు బంధుకోటులున్
హృదయములందుఁ జింతిలుచు నెప్పుడు శోకభరంబుఁ జెంది యుం
డుదు రటుగాన బాలుఁడ జడుండను మి మ్మొక టేను వేఁడెదన్
సదయత నన్ను మీ రిపుడు చయ్యన వారలఁ జేర్పఁగాఁ దగున్.

98


క.

మావారలు న న్నపగత
జీవుం డని తలఁచి చింతఁ జేకురి యీలో
దైవవశంబున బ్రతికిరొ
చావునకుం దెగిరొ యేమిచందము తెలియన్.

99


వ.

అట్లు గాన బహుదినంబు లిచ్చట నుండుట నాకు ధర్మంబు
గాదు మర్త్యలోకంబునకుఁ బోవునట్లుగా ననుగ్రహింప
వలయు నని ప్రార్థింపుచున్న యన్నరదేవనందనువాక్యం
బులకు సంతసిల్లి తక్షకుం డట్ల సేయుదు నని కారుణ్య
కటాక్షవీక్షణంబుల నతని నాదరించి.

100