పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/149

ఈ పుట ఆమోదించబడ్డది

142

బ్రహ్మోత్తరఖండము


తే.

ఏమి చెప్పఁగ వచ్చు నయ్యింద్రసేన
నందనువియోగభవమును జెంది కుంది
చిత్రవర్మమహీపాలుసీమఁ గలుగు
సకలజనములు నవగతోత్సాహు లైరి.

59


వ.

అంత నచ్చట నిషధదేశాధ్యక్షుం డగు నాయింద్రసేన
మహీనాథుండును జారులవలనఁ గర్ణశూలాయమానం
బగునిజతనయవృత్తాంతం బాకర్ణించి యనేకప్రకారంబులం
బ్రలాపించుచుండె నంత నన్నగరంబునం గల సమస్తప్రజ
లును దద్వియోగదుఃఖంబు సహింపంజాలక మహాఘోషం
బుగాఁ బరిదేవనంబులు చేయువారును శిరోజబంధంబులు
వీడ శిరస్స్నానంబులు చేసికొనువారును వక్షస్తాడనములు
జేసికొనువారును పరమేశ్వరుం డింత దయ దప్పవలయునే
యనువారును జంద్రప్రియదర్శనుం డగుచంద్రాంగద
కుమారుముఖావలోకము లేని యిచ్చోట నుండవలయునే
యనువారును బ్రాగ్జన్మంబుల నెట్టితపములు చేసితిమో
యనువారును నై నిద్రాహారసుఖంబు లనుభవింపక యున్న
యెడ నప్పురముఁ జిత్రవర్మపురమునుం బోలె నత్యంత
కోలాహలసమన్వితం బై యుండె నంత.

60


తే.

సుతవియోగాభితప్తుఁ డై స్రుక్కి స్రుక్కి
యడలుచున్నఁ దదీయదాయాదు లొకట
నతని బాధించి తద్రాజ్య మపహరించి
తిగిచి యాయింద్రసేను బంధించి రంత.

61


వ.

అంత నిక్కడ.

62