పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/140

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

133


క.

ఈమానిని యాగర్భ
శ్రీమతి యై సత్కళావిశేషాత్మక యై
సీమంతవతీమణి యై
సీమంతిని యనగఁ ధరఁ బ్రసిద్ధి వహించున్.

23


సీ.

శరధికన్యకరీతి సౌభాగ్యవతి యగు
        భారతిగతిఁ గళాప్రౌఢి మెఱయు
మదనారిసతిమాడ్కి మాంగల్యవతి యగుఁ
        బౌలోమికరణి సంపదలు చెందుఁ
దమయంతిలీల సౌందర్యంబు వహియించు
        రోహిణివలె మించు రుచిరకాంతి
నయ్యరుంధతిపోల్కి నాచారవతి యగు
        సావిత్రికైవడి సాధ్వి యగును


తే.

విభునితోఁ గూడి తాఁ బదివేలయేండ్లు
నఖిలసామ్రాజ్యభోగంబు లనుభవించి
యష్టపుత్త్రుల నొక్కకన్యకను గాంచు
పుణ్యచారిత్రి నీపుత్రి భూవరేంద్ర.

24


వ.

అని యివ్విధంబున నిజపుత్త్రికాజాతకఫలంబులు చెప్పిన
సైద్ధాంతికజనంబుల సుధారసోపమానంబు లైనభాషణంబు
లాకర్ణించి పరమానందకందళితాంతరంగుండై యాభూ
పాలుండు వారల ననేకమణిమయభూషణాంబరంబులం
బూజించియున్న సమయంబున.

25


తే.

అంత నొకధూర్తభూసురుం డద్భుతముగ
దైవగతిని జతుర్దశాబ్దంబునందు
పతివియోగంబుఁ జెందు నీబాలిక యని
రాజునకుఁ దెల్ప మది విచారంబు దోఁప.

26