పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/101

ఈ పుట ఆమోదించబడ్డది

94

బ్రహ్మోత్తరఖండము


క.

గోపికయు వెఱఁగు నొందుచు
భూపాలునికడకుఁ జేరి పురహరభవన
వ్యాపారము నిజతనయా
లాపంబులు విన్నవించె లాలితఫణితిన్.

229


సీ.

ఆవార్త విన్నంత యాశ్చర్యమును జెంది
         శంభుపూజామహోత్సవము విడిచి
శీఘ్రంబుగాఁ జంద్రసేనమహారాజు
         పరివారసహితుఁడై యరుగుదెంచి
దివ్యమాణిక్యదేదీప్యమానంబైన
        యంబికారమణుదేవాలయంబు
నందుఁ గాంచనమయం బగురత్నవేదికా
       స్థలమునఁ బీఠమధ్యమున వెలసి


తే.

బాలభానుస్ఫురత్కాంతి పరిఢవిల్ల
నఖిలజనచిత్తలోచనాహ్లాద మగుచుఁ
బూర్ణవిభవాభిరామ మపూర్వమైన
కనకమణిమయదివ్యలింగంబుఁ గాంచె.

230


క.

దాని విని పౌరులందఱు
మానుగఁ జనుదెంచి హర్షమగ్నాత్మకులై
యానూతనశివలింగము
నానిశి వీక్షించి రద్భుతాదృతమతులై.

231


తే.

ఇట్లు వీక్షించి సాష్టాంగ మెరఁగి భక్తి
పూర్వకంబుగ నభిషేకములను బిల్వ
పూజనంబులు కీర్తనంబులును జేయు
చుండి రారేయి భూపాలయుక్తముగను.

232