పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/100

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

93


గావించి యత్యద్భుతకరం బయినయీవృత్తాంతంబు తమ
తల్లికిం దెలియ బలుకవలయు నని మనంబున నిశ్చయించి
యతిత్వరితంబుగా నిజగృహంబునకు జనుదెంచె నంత.

222


క.

నవరత్నహేమమయమై
యవిరళధనధాన్యయుక్త మై సాంబసదా
శివుకృపచే నాగోపీ
భవనము వెలసెను గుభేరభవనము మాడ్కిన్.

223


క.

రయమునఁ జని నిజమందిర
శయనస్థలముననుఁ జేరి జననీ లెమ్మా
జయము శుభంబులు వెలయఁగ
దయతో నీశ్వరుఁ డొసంగె దగువిభవంబుల్.

224


క.

అని నిదుర లేపి చెప్పిన
జననియు నిజమందిరంబు శయ్యాతలముం
గనుఁగొనఁగ రత్నకీలిత
కనకమయం బగుటఁ జేసి కడువెఱఁగందెన్.

225


తే.

మణివిభూషిత మగునిజతనువుఁ జూచి
మహితధనరాశిచే నొప్పు గృహముఁ జూచి
స్వర్ణమణిదీప్త మైన ఖట్వంబుఁ జూచి
యిది యపూర్వం బటంచు నెమ్మది దలంచె.

226


వ.

అప్పుడు.

227


శా.

మాతం దోడ్కొనివచ్చి తత్సుతుఁడు శుంభద్రత్నసౌధంబుపైఁ
జేతస్తోషదమై సువర్ణకలశశ్రీమంతమై కాంతమై
శీతాహార్యసమున్నతం బగుచు లక్ష్మీమందిరం బైనయా
భూతేశాలయ మొప్పఁ జూచె నచటన్‌ బూర్ణప్రమోదంబునన్.

228