158
బసవపురాణము
గలివెన్న వుచ్చఁ గొండలు దొంతిఁబేర్ప
నిల మంచు గుంచానఁ గొలువ రేఁబవలు
సేయ నాకసమునఁ జిత్రరూపములు
వ్రాయ వాయువుఁ బట్ట వడగళ్ల గుళ్లు
గట్ట వెన్నెల గుంపుగాఁజేయ వచ్చి
పుట్టినప్పుడె నేర్చు బుద్ధులప్రోఁక
-పండితారాధ్యచరిత్రము.
ఇట్టి వింక నొండు రెండు పట్టులందుఁ గలవు. మల్లికార్జున పండితారాధ్యుల శివతత్త్వసారపుఁబద్యములు పెక్కులు పండితారాధ్యచరిత్రమున ద్విపద రూపమున దాల్చినవి. అది యసంగతముగాదు. మఱియు నాగమగ్రంథములలోని శ్లోకములు పెక్కులు బసవపురాణ పండితారాధ్యచరిత్రములందుఁ దెలిఁగింపఁ బడినవి. ద్రవిడభాషలో 'తిరుతొండర్తొఘై' యను పేరఁగల లఘుస్తుతి కిందనువాదము గలదు.
“పరగు మహాభక్తచరితలు నాద
భరితమై చనఁ దిరుపాటలు సేసి
పాడుచు నొక్కొక్క భక్తుని చరిత
వేడుకఁ బొగడునవ్విధమెట్టులనిన. పు. 133
ఇది దాని యుపక్రమము. కర్ణాటభాషలో బసవేశ్వరుఁడు మొదలగు వారు రచించిన గేయ వచన రూపగ్రంథములనుండి కూడ నీతఁడు గొన్ని పట్టులను దెలిఁగించి యుండవచ్చును. ఆ గ్రంథములప్రఖ్యాతములగుటచే వానిని గుర్తింపఁ గాదు.
ఇఁక మన సోమనాథుని రచనములను బలువురనుకరించిరి. శివకవులెల్లరుననుకరించినవారే. బమ్మెరపోతరాజు, శ్రీనాథుఁడు మొదలగువారి గ్రంథములలోఁగూడ నప్రయత్నముగా సోమనాథుని రచనములు దొరలినవి.