పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/149

ఈ పుట ఆమోదించబడ్డది

114

బసవపురాణము


పాండురాంగంబైన పడఁతిగర్భమునఁ
బోఁడిగా వెలుఁగుచుఁ బుత్త్రుఁడీ క్రియను.

- బసవపురాణము.

వర్గప్రాసమును, సమీపప్రాసమును నంగీకరించునప్పుడు పూర్ణార్ద బిందుప్రాసమునుగూడ నంగీకరించుట సంగతమే యగును. అయినను నన్నయాదులగు కవులీ ప్రాసము నంగీకరింపరయిరి. వారి గ్రంథములలో గానరాదు. ఇప్పు డర్ధబిందువులుగా నెఱుఁగఁబడుచున్న పదములు పోఁడి, మూఁడు మొదలగునవి యానాఁడు పూర్ణబిందువులుగనే యెన్నఁబడుచుండ వచ్చుననియు, నిది పూర్ణబిందుప్రాసమే కావచ్చుననియుఁ గొందఱందురు. అది యట్లుగాదు. పోఁడి, మూఁడు పదములను మరల నీ కవులే యర్దబిందు ప్రాసమునఁగూడఁ గూర్చిరి గావునను, నాకాలపుఁ గవులెల్లరు నా పదముల నర్దబిందువిశిష్టములఁగనే ప్రయోగించిరిగావునను, నది పూర్ణార్ధబిందుప్రాస మనియే తలంపవలెను.

నాఁడు నావిందిగెనాఁ బురవీథిఁ
బోఁడిగా గుడ్డవ్వ వోవభూసురులు

- పుట. 223

ఇత్యాదులు పెక్కులు ప్రయోగములర్దబిందు విశిష్టతానిర్ణాయకములు గలవు. మఱియు నన్నయ భారతకృతిపతియగు రాజరాజనరేంద్రుని కూఁతురు సోమలదేవి (ఇంచుమించుగా నన్నయకాలమున) చెక్కించిన దాక్షారామ శిలాశాసనమునఁగూడ నొక పద్యమం దీ ప్రాసము గానవచ్చు చున్నది.

సకలవసుమతీశ మకుటలసద్రత్న
కిరణరుచివిరాజి చరణుఁడయిన
నిజభుజప్రధాని బెజయితదేవని
కూఁతుసరియె పోల్పఁ గాంతలెందు.