పుట:ప్రబోధచంద్రోదయము.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

నందిమల్లయ చెల్లెలు — అమ్మలాంబ ఘంటసింగయ తల్లి యగుటచేత, నందిమల్లయకు ఘంటసింగయ మేనల్లుడు.

పారిజాతపహరణమును రచించిన నంది తిమ్మన తను మలయమారుతకవీంద్రునకు అనగా ఘంట సింగయ్యకు మేనల్లుడనని యిట్లు చెప్పుకొన్నాడు.

సీ.

కౌశికగోత్ర విఖ్యాతుఁ డాపస్తంబ
                          సూత్రుఁ డార్వేల పవిత్రకులుఁడు
నంది సింగామాత్యునకు దిమ్మాంబకుఁ
                          దనయుండు సకలవిద్యావివేక
చతురుఁడు మలయమారుతకవీంద్రునకు మే
                          నల్లుండు కృష్ణరాయక్షితీశ
కరుణాసమాలబ్ధఘనచతురంతయా
                          నమహాగ్రహారసన్మానయుతుఁడు


గీ.

తిమ్మయార్యుండు శివపరాధీనమతి య
ఘోర గురువరు శిష్యుండు పారిజాత
హరణమను కావ్య మొనరించె నాంధ్రభాష
నాదివాకరతారాసుధాకరముగ.

(5-108)

పైపద్యమున నందితిమ్మన ఘంటసింగయ్య మేనల్లుడని స్పష్టపడినది. నందిమల్లయ్యకు ఘంటసింగయకు - మేనల్లుడుకాగా, ఆతనిమేనల్లుడు నందితిమ్మన యని మనకు విశదమైనది. అప్పుడు సంపూర్ణవంశవృక్ష మిట్లుండును—