పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/114

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

       సదమలాచారప్రశస్తి గాంచియు వర్ణ
                          ములు సంకరంబుగాఁ గలఁపఁ డేని
       ఖలజనసంశిక్ష గావింపుచుండియుఁ
                         బతితుల నెపుడుఁ జేపట్టఁ డేని
       యురుపుణ్యవర్తి యయ్యును బాడబాశ్రయ
                         సీమ నిల్లుగను వసింపఁ డేని.
గీ. యల జగన్నాయకుఁడు సాటి యనఁగఁబోలు
       భోగమున నిర్మలాచారమున విశిష్ట
       రక్షణంబునఁ బుణ్యమార్గమున నరయ
       గంగనామాత్యు జగ్గయ ఘనునితోడ.

ఈ పద్యములు రచియింపఁబడిన కాలమునకు జగ్గకవి కించుమించుగా నిరువదియైదు సంవత్సరముల ప్రాయమై యుండును. ఇరువదియైదు సంవత్సరముల ప్రాయమునాఁటి కన్నిదేశములు దిరిగి రాజసభలలో బ్రఖ్యాతి గాంచఁగల్గుటకు కవి యిరువదియేండ్ల వయస్సునకు ముందే పండితుండయి కవనచాతురి గలవాఁడయి యుండవలెను. అందువలన జగ్గకవి యిరువదిసంవత్సరముల ప్రాయము వచ్చువఱకును నక్షరజ్ఞానములేనివాఁ డని చెప్పెడిమాటలు నమ్మందగినవి కావు. ఈ జగ్గకవి తనయన్న యగు తిమ్మకవి జీవించినంతకాలము జీవించియున్నటుల కనఁబడుచున్నది గా 1700 సంవత్సరప్రాంతముమొదలు 1760వ సంవత్సరమువఱకును జీవించియుండెనని తేలుచున్నది.

మఱియు నీ జగ్గకవి చంద్రరేఖావిలాపపీఠికయందు “రచయించితిని” అను పద్యమునందు తాను రచించిన గ్రంథములను బేర్కొనియుండెను. అవిగాక మఱికొన్ని గ్రంథములనుగూడ రచియించినటు లతని మనుమనిమనుమఁ డగు వేంకటరాయకవి రచితమైన నీ సీసమువలనఁ దెలియుచున్నది.

సీ. ప్రతిభ మై జానకీపరిణయంబున నర్మ
                          దాపరిణయము రాధాకథాసు