పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

కావున నీవు స్వామికి నిట్టిదురవస్థ యుత్పాదించి తింక నన్యులు నీకుం దృణకణాయ
మానం బగుట నిశ్చయంబు విను మని యిట్లనియె.

536


ఉ.

వేయితులాలలోహమును వేడుకతో దినె మూషకంబు ల
త్యాయతశక్తి నంచు వ్యవహారి యొకం డన నొక్కరుండు పి
న్నాయన నొక్కగృధ్రము రయంబున నెత్తుకపోయె నంచు ము
న్నోయి విచిత్ర మైనకథ యొక్కటి వింటిమి నీవు వింటివే.

537


వ.

అనిన నక్కథ వినవలయు నాకుం జెప్పు మనినఁ గరటకుం డిట్లనియె.

538


చ.

లలి నొకపట్టణంబునఁ గలం డొకవైశ్యుఁడు లేమిచేత ని
మ్ముల వ్యవహారికంబునకుఁ బోవుచు లోహతులాసహస్ర మి
ట్టలముగ నొక్కచుట్టముకడం బదిలంబుగఁ బెట్టి సమ్మదం
బొలయఁగ నాత్మమందిరమునొద్దకుఁ గ్రమ్మఱ వచ్చి యత్తఱిన్.

539


వ.

లోహం బిడిన వైశ్యునికడకుం జని యతం డిట్లనియె.

540


క.

ఇన్నిదినంబులుఁ బోయితి, నన్నా పరదేశమునకు నచ్చట నాకుం
జిన్న ముఁ జిదరయుఁ బుట్టక, మిన్నక రావలసె మగిడి మీ రున్నెడకున్.

541


క.

మీయింట దాఁచఁబెట్టిన, నాయిను మిపు డొసఁగవలయు నని పలికిన వాఁ
డీయక మూషకములు తిని, పోయె ననుచు ద్రవ్యలోభమున నన నతఁడున్.

542


క.

ఈలాగున నాసొ మ్మీఁ, జాలక కేరడము లాడుచనవరి నెట్టున్
దూలించి మోసపుచ్చక, యేలా నాసొమ్ము వచ్చు నింతట ననుచున్.

543


ఉ.

ఆయెడ లోహహర్త యగు నాతనిసూనుఁడు వచ్చె నాడఁగాఁ
బోయి జలంబు లాడుటకుఁ బోదము రమ్మని వానిఁ గొంచు నా
త్మాయతనంబు చేరువగృహంబున బాలుని దాఁచి యుండఁగాఁ
బాయనిదుఃఖభారమున బాలునితండ్రియు వాని రోయుచున్.

544


గీ.

పురవరంబున నింటింట నరసియరసి, యడుగఁగా లోహ మిచ్చిన యతఁడె కొడుకు
నంత గొనిపోయె నని చెప్ప నతఁడు నించు, శీఘ్రగతితోడఁ జనుదెంచి సెట్టితోడ.

545


క.

పాపని నదికిం దోడుక, వే పోయితీ వాఁడు రాఁడు వెండియు సతి దా
వాపోవఁ దొడఁగెఁ జెప్పవు, పాపం బని తలఁచి దుఃఖపడ వింతైనన్.

546


వ.

అనిన నతం డిట్లనియె.

547


క.

ఇద్దఱమును నేటికిఁ జని, ప్రొద్దునఁ దీర్థంబులాడి బోరన రాఁగా
గ్ర ద్దెత్తుక చనె నీసుతు, బద్దురవలె నుండు ననుచుఁ బలుకఁగ వెఱతున్.

548