పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/282

ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ఆత్రివిక్రముని పాదాంభోరుహంబు పం
                       కజసంభవుఁడు మున్ను గడిగినట్టి
తద్వారిధార యంధకవైరి వరమౌళి
                       మాలికయై నేల వ్రాలకున్న
వైకుంఠనగరాధివాసులు కృష్ణతీ
                       ర్థాభిలాషం బాత్మయందుఁ బొడమ
విరజాజలముఁ దెచ్చి తిరుగఁ దత్పాదాంబు
                       జాతంబునకును సంక్షాళనంబు


తే. గీ.

సేయఁ దత్తీర్థమెల్ల నీశిఖరరాజ
పార్శ్వమునఁ బ్రవహించి సుపర్వపర్వ
కల్పనాశక్తి వైకుంఠగంగ యనఁగ
సిద్ధసంకల్పు లెంచఁ బ్రసిద్ధి గాంచె.

499


తే. గీ.

భక్తిసార మహాయోగి భర్త మత్ప
దాంబుజస్తోత్రపాత్రుఁ డత్యంతనియతిఁ
దత్తటంబున నన్నుఁ జిత్తమున నిలిపి
ధ్యాన మొనరించి వైకుంఠధామ మందె.

500


వ.

మఱియు నావైకుంఠగంగాతీర్థంబు పైఁ బ్రోక్షించుకొనినన్ గామాది
దోషంబులు దొలంగి శమదమాదిసద్గుణంబులు సంభవింప నపవర్గంబు
నొందించుటం జేసి యది యుత్తమస్థానంబు గదా! ఆనయన
స్థానంబున నారాయణహ్రదంబను పుణ్యతీర్థంబు గలదు. తత్తీరంబునం
బునశ్చరణం బొనర్చిన వేగంబె మంత్రసిద్ధి యగు. తద్దర్శనమాత్రం
బునం గ్లేశంబు లడంగు. తద్ధ్యానంబు జేసిన విముక్తుం డగు. విష్ణు
చిత్తుండు నారాయణపదద్వయశరణాగతుండై యచ్చట పరమ
ధామంబు చేరె. నారాయణహ్రదస్నానంబున నరకాంగారకనాశన
మండ్రు. అందున నంత్యంబున హరిస్మరణంబు సేయ బుద్ది వొడమించు.
ఈనారాయణహ్రదంబునకు దక్షిణంబునఁ గల్యాణతీర్థంబునకు
నుత్తరంబునఁ బారాశరతీర్థంబు గలదు. మన్నియోగంబుచే మద్భక్తుం
డగు పారాశర్యుండు విష్ణుపురాణంబుఁ దత్తటంబున రచియించె. దాని
దక్షిణదేశస్థులు మైత్రేయకుండం బండ్రు. తచ్ఛైలోత్తరభాగంబున
యజ్ఞవృక్షపరీతంబై యాదవమహానది ప్రవహించినయది. ఇందు