పుట:తెలుగు వాక్యం.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

32

తెలుగు వాక్యం


(79)

a. సుజాత రిక్షా ఎక్కి సినిమాకు వెళ్ళింది.
b. సుజాత బస్సెక్కి బెజవాడ వెళ్ళింది.

2.14 : ఈ క్త్వార్థక క్రియ ఒక్కొక్కప్పుడు ప్రధానక్రియకు హేత్వర్థక మవుతుంది. ఏ రకమయిన నియమాలున్నపుడు హేత్వర్థం వస్తుందో చెప్పటం కష్టం. ఈ కింది వాక్యాలని ముందుగా పరిశీలించండి.

(80)

a. సుబ్బారావు పాఠంచెప్పి అలిసిపోయాడు.
b. సుజాత భర్తతో పోట్లాడి బాధ పడుతున్నది.
c. సుబ్బారావు కోడిగుడ్లు తిని బలిశాడు.
d. సుబ్బారావుకు కోడిగుడ్లు తిని అజీర్తి చేసింది.

పై నాలుగు వాక్యాల్లోనూ కర్తచేసిన వ్యాపారానికి కర్తే అనుభోక్తగా (experiencer) ప్రధానవాక్యంలో సూచించబడింది. పై వాక్యాలవల్ల హేత్వర్థంలో వ్యక్త నిర్మాణపుకర్తలు ఒకటిగా ఉండాలనే నియమంలేదు కాని, ఒక వ్యాపా రానికి కర్త అయి ప్రాణి రెండోవ్యాపారానికి అనుభోక్తగా ఉండాలనే నియమం ఉంది. అందువల్లనే ఈ కింది వాక్యం వ్యాకరణ విరుద్ధమయింది

(81)

సుబ్బారావు పాఠం చెప్పి సుజాత అలసిపోయింది.

(80) లో సూచించిన వాక్యాలలో ప్రధానక్రియ దేహమనః పరిణామ బోధకం కావటం కూడా విశేషం. ఒక ప్రాణికి కలిగిన అనుభవం (experience) అదే ప్రాణి నిర్వహించే వ్యాపారానికి కాని, అదేప్రాణికి జరిగిన ఇంకో అనుభవానికి గాని హేతువు కావచ్చు. అప్పుడు అనుభవబోధకమైన మొదటిక్రియ క్త్వార్థక రూపంలో ఉంటుంది.

(82)

a. సుబ్బారావు కోపం వచ్చి పెళ్లాన్ని కొట్టాడు
b. సుజాతకు జలుబుచేసి జ్వరం వచ్చింది.

పై రెండు వాక్యాల్లోనూ క్త్వార్థకక్రియ బోధించే అనుభవాలకు ప్రాణి వాచకాలు అనుభోక్తలు. (82) a. లో ప్రదాన క్రియావ్యాపారానికి ప్రాణివాచక నామం కర్త. (82) b. లో ప్రధాన క్రియకు (కూడా) అనుభోక్త.

పై వాక్యాలను బట్టి ఈ కింది విశేషాలని గమనించవచ్చు. హేత్వర్థబోధ