వారసు రాలిగా పేర్గాంచిన గాంధీ దంపతు ల ఇష్టపుత్రిక బీబి అమతుస్సలాం ఈ గ్రంథంలో కన్పిస్తారు.
భర్తతో కలసి విభజన వ్యతిరేకోద్యమాన్ని సాగించిన పంజాబుకు చెందిన షపాతున్నీసా బీబి, అకుంఠిత దీక్షతో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గాను మహాత్ముని నుండి ప్రత్యేకంగా వందనాలు అందుకున్న షంషున్నీసా అన్సారి, జుగాంతర్ విప్లవదళ యోధురాలైన రజియా ఖాతూన్, వితంతువులు పైజామా కుర్తా ధరించరాదన్న సంప్రదాయవాదుల నిషేదాజ్ఞలను ఉల్లంఫిుంచి ఖద్దరు బట్టలు ధరించి ఉద్యమించిన సుగరా ఖాతూన్, ఉమ్మడి ప్రయోజనాల ముందు వ్యక్తిగత జీవితాలు ఏమాత్రం ప్రధానం కావంటూ ' మా మాతృభూమి స్వేచ్ఛాస్వాతంత్య్రాల నిమిత్తం పోరాడుతున్న నా భర్త జీవితం తొలుత ఈ జాతి సొత్తు; ఆ తరువాత మాత్రమే నాది, మరెవరిదైనా' అని ప్రకటించి సంచలనం సృష్టించిన బేగం ఆలం తారసపడతారు. అపూర్వ దైర్య సాహసాలతో పోరాటాలలో పాల్గొన్న మహిళల వివరాలు చాల మంది దృష్టికి రాని అంశాలే !
మనరాష్ట్రానికి సంబంధించి కూడా చాలా అమూల్యమైన సమాచారాన్ని రచయిత అందించారు. 1885లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడగానే నిజాం ఆదేశాలను ఖాతరు చేయకుండా హైద్రాబాదు రాష్ట్రం నుండి సభ్యత్వంస్వీకరించిన ప్రప్రథమ ముస్లింగా ఖ్యాతిగాంచిన ముల్లా అబ్దుల్ ఖయ్యూం ఖాన్, డాక్టర్ సరోజిని నాయుడు తండ్రి అఘోరనాధ్ చ్టోపాధ్యాయతో కలసి హిందూ-ముస్లింల ఐక్యతకు కృషిచేశారు. మన్యం పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజుకు పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన బ్రిటిష్ ప్రబుత్వాధికారి ఫజులుల్లా ఖాన్, ఖద్దరు విక్రయశాలను ఆరంభించి 'ఖద్దర్ ఇస్మాయిల్' గా పేర్గాంచిన ముహమ్మద్ ఇస్మాయిల్, నేతాజి సుభాష్ చంద్రబోస్కు వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అబిద్ హసన్ సఫ్రాని లాంటి యోధుల గురించి, స్వాతంత్య్రం లభించాక నిజాం సంస్థానం నుండి వేరుపడి స్వతంత్ర రిపబ్లిక్ను ప్రకటించిన 'పరిటాల రిపబ్లిక్' స్థాపనలో తనదైన ఉత్తేజకర పాత్రవహించిన షేక్ మౌలా సాహెబ్ జీవిత విశేషాలు సమకూర్చడంలో రచయిత శ్రమ అర్థమవుతుంది. జాతీయోద్యమంలో పురుషులతోపాటుగా పరోక్షంగా పాల్గొన్న హజరా బీబి లాంటి మహిళల జీవిత విశేషాలను రచయిత ఈ గ్రంథంలో పొందుపర్చారు.