8
శైలినిబట్టియు తెనాలి రామకృష్ణకవికి తరువాతివాడగు సూరనను పేర్కొనుటంబట్టియు నంత విశ్వసనీయముగ తోపదు" అని జ్ఞాపిక వ్రాసిపెట్టిరి. కాని ఈ పద్యమునందలి 'దానితల్లిగ' అన్నప్రయోగము రామకృష్ణునిదే కావలయు ననిపించుచున్నది. ఈ అర్థముననే ఘటికాచలమాహాత్మ్యమున "నిండుజాబిల్లి తల్లియై నిగ్గుదేరు మోము" (2-184) అని ప్రయోగించియున్నాడు. పాండురంగమాహాత్మ్యమునను "శైవాలవల్లికిం దల్లియై చెలువారు నూగారును" (3-179) అని ప్రయోగించినాడు. పుస్తకము లభింపలేదుగనుక చిక్కులున్న వనుకొనుచున్నాము. అది బయటపడినప్పుడు చిక్కు లెట్లో సవరింపబడును. మిగిలినకృతులతోపాటు ఈ పాండురంగవిజయప్రబంధరచనాకాలమును నిర్ణయింపబడును. అందుకు కాలము కలసిరావలయును.
మరికొన్నికృతులు రామకృష్ణుడు రచించినట్లుగా వినుకలియేగాని కనుకలి లేదు, అవి యివ్వి : (1) లింగపురాణము, (2) ఆదిపురాణము, (3) కందర్పకేతువిలాసము (4) హరలీలావిలాసము. ఈ చివరి రెండుగ్రంథములలోని వని కొన్నిపద్యములను రామప్రెగడ జగ్గన తాను సమకూర్చిన యుదాహరణగ్రంథములో ఉటంకించినాడు.[1]
ఉద్భటారాధ్యచరిత్రము, పాండురంగమాహాత్మ్యము, ఘటికాచలమాహాత్మ్యము మాత్రమే క్రమముగా రామకృష్ణుని ప్రస్తుత మున్న కృతులు.
5. రామకృష్ణుడు హాస్యగాడు కాడు :
తాను రచించినగ్రంథాలనుబట్టి అయినదానికంటె, తనకు సంబంధించిన సంబంధింపజేయబడిన, హాస్యప్రసంగకథావిశేషములచేత రామకృష్ణు డెక్కువగా నీ దేశమున ప్రసిద్ధుడు. హాస్యచతురుడుగా నయిదువందలసంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ ప్రజానీకమునకు సన్నిహితుడై ప్రవర్తించుచున్న రామకృష్ణుడు తానురచించిన గ్రంధములలో నెక్కడకూడ ఆ వాసనకలవాడుగానే కనిపించడు. నిత్యజీవితమున అలవోకతనమున కలవాటుపడిన ఈయన, కావ్యజీవితములో జాగృతుడు. మరియు గంభీరుడు. ఇందు కపవాదముగా, కవిస్వభావము కావ్యమున ప్రతిబింబించు ననుసిద్ధాంతమున కనుకూలముగా
కొందరు వాని కృతులనుండి ఒకటి రెండుపద్యములను, సన్నివేశములనుండి ఎత్తి చూపుదురు. అవి హాస్యా
- ↑ ఆంధ్రకవితరంగిణి సంపుటము 8. పుటలు. 27, 28.