పుట:కాశీమజిలీకథలు -09.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమహాగణాధిపతయేనమః

శ్రీరస్తు.

కాశీమజిలీ కథలు

తొమ్మిదవ భాగము

171 వ మజిలీ.

దుందుభి కథ

క. శ్రీవిశ్వనాధ హైమవ
   తీవల్లభ భావజిత రతిప్రియ మేరు
    గ్రావాధిప కార్ముక కా
    శీవాస ప్రమదప్రమథ సేవితచరణా !

దేవా : అవధరింపుము. మణిసిద్ధ సిద్ధప్రవరుండు క్రమప్రవర్థమానబుద్ధిశీలుండగు గోపబాలునితోఁ గూడ నూటడెబ్బదియొకటవ మజిలీ చేరి యందుఁ గాలకరణీయంబుఁ దీర్చికొని వింతలం జూడంబోయినశిష్యునిజాడ నరయుచున్నంత వాఁడును,

గీ. హర్షవికసితవదనుడై యరుగుదెంచి
   యతిపదంబుల వ్రాలి యిట్లనియె సామి :
   ఇల్లు విడచిన తరువాత నిట్టి వింత
   చూచి యెఱుఁగ మఱిచ్చోటఁ జోద్య మయ్యె.

అని తాను జూచిన విచిత్రవిషయంబా తాపసశిఖామణి కెఱిగించుటయు మణిసహాయంబున నయ్యుదంత మంతయు నంతఃకరణగోచరముఁ గావించుకొని సంతోషవిస్మయాదేశితచేతస్కుండై యమ్మహర్షి యిట్లనియె.

గీ. బాపురే! వత్స! సేబాసు! భళిర! గోప!
   నీవడిగినట్టి ప్రశ్నలన్నియును వింత
   కథలుగానుండు నవి యెప్డు వృథలు గావు
   కలుగదే! యిందులకు నొక్క కారణంబు.

నీవడిగిన ప్రశ్నయం దంత విచిత్రంబు లేకున్నను యేతత్కధా ప్రవరణంబున నద్భుతవిషయంబులు బొడగట్టుచున్నవి. అవహితుఁడవై యాకర్ణింపుము.