304
కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము
లతోఁ గూడ నా పట్టణమంతయు వెండియు నూరేగింపఁజేసి పొలిమేరవఱకు వేలుపులతోఁ గూడ సాగనంపి యంపించెను.
మహేంద్రుఁడైన నేమి హరిహరాదులైన నేమి? యతఁడు చేసిన సుకృతంబునకు దాసులై వెనువెంటఁ దిరుగవలసిదేకదా? మదనమంజరియు మాణిభద్రుండు నవ్విమాన మెక్కి యుజ్జయినీపురమువరకు వచ్చి యతని నింటఁ బ్రవేశపెట్టి తదనుజ్ఞ గైకొని నిజనివాసంబున కరిగిరి.
విక్రమార్కుండు తాను దేవలోకంబున కరిగి వచ్చిన వృత్తాంత మంతయు మంత్రుల కెఱింగించి వారి నానందింపఁ జేయుచు నా దేవతాయువతులతోఁ గొన్నిదినంబులు క్రీడాశైలముల యందుఁ గేళికోద్యానవనములందు నదీసైకతప్రదేశములయందు విహరింపుచు శ్రీకృష్ణుండవోలె దక్షిణనాయకుండై యందఱ గందర్పక్రీడల నానందపరవశలం గావింపుచు మఱియు దన్నువరించిన కళింగసేనాది రాజకన్యలఁ గొందఱం బెండ్లియాడి స్వర్గలోకంబు పాకశాసనుండువోలె ధరణీరాజ్యంబు పాలింపుచుండెను. అని యెఱింగించి మణిసిద్ధుండు,
సీ. స్తంభన మోహనోచ్చాట నాకర్షణ
మారణోద్వేజ నో న్మాననములు
వాదవయస్థంభ వశ్యపురక్షోభ
గజకరణాదృశ్య కరణములు
పశుపక్షి మృగ ముఖ్య బహురూపధారణా
విధి పరకాయ ప్రవేశములు
సర్వాంజన మహేంద్రజాల మాయోపాయ
మణిమంత్ర తంత్ర సామర్థ్యములును
గీ. ద్వీప దుర్గాది మర్గ ప్రదీపనములు
నమృతకర భాస్కరోదయ వ్యత్యయములు
సకల జంతు భాషా పరిజ్ఞానములును
నాదిగాఁగల విద్యల నాతఁ డెఱుఁగు.
తత్ప్రతిపాదకంబులగు కథలు కొన్ని గలిగియున్నవి. వానిలో నీకిప్పు డొక్కటియుం జెప్పలేదు. వేరొకప్పుడు వక్కాణించెదం గాక యని మఱియు,
క. ఈ విక్రమార్కచరితము
బావనమతి వినిన వ్రాయఁ బఠియించిన ను
శ్రీ వెలయుఁ బెరుగు నాయువు
నేవేళన్ శుభము నొప్ప నింటం జంటన్ .
అని యెఱింగించిన విని యగ్గోపాలుండు మూపు లెగర వైచుచు మహాత్మా