పుట:కాశీమజిలీకథలు -09.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

22

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

క్షణకాల మామె యవయవములన్నియు విడిపోయెనట్లు కదలలేక నిలువంబడియుండెను. అంతలో హృదయమున మన్యుదేవత యావేశించినది. మేనఁ జమ్మటలు గ్రమ్మినవి. ఓరీ! దురాత్మా! ఆసన్నమృత్యుండ వగు నీకు నా మాటలు చెవి కెక్కునా! నీ విట్టి బొంకరివని యెఱుంగక నీ మాట నమ్మి యింతకాల ముపేక్షించితిని. నాఁడే నీ పని పట్టవలసినది. నీ యాయుశ్శేష మిన్నదినము లీడ్చుకొను వచ్చినది సీ! సీ! నీవు వట్టి నిర్భాగ్యుడవు. నీ శీల మెఱుంగక నిన్ను గామించుట నాదే తప్పు అని నోటికి వచ్చినట్లుగా వానిం దిట్టుచు నొడలు చీరుకొన తొడవులు దీసి తల విరియఁ బోసికొని కోపగృహంబునఁ బండుకొనియుండెను.

రాజు వాడుకప్రకార మంతఃపురమునకు వచ్చి యందు భార్యం గానక నలుమూలలు వెదికి కోపగృహంబున నున్నదని తెలిసికొని యచ్చటికిఁ బోయి తద్వికారమును బరిశీలించి గ్రుచ్చి యెత్తికూర్చుండఁబెట్టి ప్రేయసీ! యిది యేమి కర్మము? ఇట్టి వికార వేషమేమిటికిఁ బూనితివి? నీ న్నెవ్వ రవమాన పరచిరి? నిజము చెప్పుమని గ్రుచ్చి గ్రుచ్చి యడుగుటయు, నక్కుటిలకుంతల కుంతలముల నెగఁద్రోసికొని కన్నీరుఁ దుడుచుకొనుచు నిట్లనియె.

రాజా! సుమతి మహాగుణవంతుఁడనియు నీతిమంతుఁడనియుఁ బలుమారు నా యొద్దఁ బొగడుటం జేసి నిజమని సంగీతము నేర్పింపుమని మిమ్ముఁ గోరికొంటిని. పిన్నవాఁడు రూపవంతుఁడగు పరపురుషుని నా యొద్దకుఁ బంపమనుట నాదే తప్పు. వాని టక్కరితన మంతయు యధార్థమని నమ్మి మీరందుల కంగీకరించిరి. వాఁడు వట్టి ద్రోహుఁడు ఒకటి రెండు దివసంబులు నేర్పినట్లే నేర్పి పరిహాసమాడ మొదలుపెట్టెను. ఎరుగునట్లుగాఁ గొన్ని దినములు వినిపించుకొనక సంగీతము ధోరణినే యుంటిని. వాఁ డదేపనిగా శృంగారలీలలు వెలయింపుచు నాకు మనస్సంకటమగలుగ జేసెను. వీణగానమందుఁగల నభిరుచిచే నితరాంతరాయములఁ బరిగణింపక యెట్లో విద్య నేర్చుకొనుచుంటిని. సిగ్గు, సిగ్గు, నిన్న వాఁడు చేయఁబూనిన పని చెప్ప సిగ్గు. పెక్కేల ? నా పాతివ్రత్యభంగము కాకుండ వానిచేతినుండి తప్పించుకొని యీవలఁ బడుట మదీయపురాకృతముకాక వేరు కాదు. అగ్ని నొడిగట్టు కొనినట్లు వానిందెచ్చి యింటఁ బెట్టితిరి నా వ్రతమునకే కాక రాజ్యమునకుఁ గూడ భంగము చేయదలంచు కొనినట్లు తెలియవచ్చినది. వానిచేతికీలుబొమ్మవలె నెట్లు త్రిప్పిన నట్లాడుచుంటిరి. వాఁడు శత్రుపక్షపాతి. సూదకారునిచే విషముఁ బెట్టించుటయు శత్రువులచే నగరము ముట్టడింపఁ జేయుటయు నంతయువాఁడు చేయించినదేనఁట. భయము గలుగఁజేసి దానిం బోగొట్టినట్ల భినయించుచు నమ్మకము గలుగఁ జేసి యెప్పుడో రాజ్యము పరాధీనముఁ జేయింపఁదలంచుకొనియెను. ఇది యంతయు నా కొకపరదేశి మూలమునం దెలిసినదని వానిపైఁ జెప్పవలసిన మాటలన్నియుఁ జెప్పి రాజునకు హృదయంబునఁ గ్రోధాగ్ని రవులుకొనఁజేసినది.