పుట:కాశీమజిలీకథలు -02.pdf/59

ఈ పుట ఆమోదించబడ్డది

64

కాశీమజిలీకథలు - రెండవభాగము

వాండ్రందరు నుత్సవము సందడిలోనుండిరి. ఆ పల్లెలో నెచ్చటను దీపము లేదు. ఆ చావడిలో మాత్రమున్నది! అప్పుడు నేను మెల్లన గుఱ్ఱముదిగి నాపొలములో నొకచోట గట్టివైచి, ఆ పల్లెలో వేరొక మూలకు బోయితిని. ఆ గుడిసెలకు నావరణములులేవు. అద్భుతములైన కుక్కలున్నవి. అవి క్రొత్తవారిని జూచిన వెంటనే కరచి చంపక మానవు. నా పుణ్యమువలన అవియు నాచావడియొద్దకే చేరినవి. గుడిసెలలో నెవ్వరును లేరు.

అంత నేనొక గుడిసెతిన్నెమీదకు బోయి మెల్లగా గూరుచుంటిని. అంత కొంత సేపటికి నాయుత్సవము నుండి యొకయాడుది యా గుడిసెలోనికి వచ్చి యరుగుమీదనున్న నన్ను జూచి కోయభాషతో నెవరువారని యడిగినది. నాకు నేబదియారు భాషలు వచ్చునుగాని కోయభాష రాదు. అదియు నాంధ్రభాష ననుసరించియే యుండెను గావున నూహనుబట్టి దాని యభిప్రాయము గ్రహించి అవ్వా ! నేను బరదేశిని దారితప్పి యిట్లు వచ్చితిని. ప్రొద్దున లేచి పోయెదనని చెప్పితిని.

అది నా మాటలర్ధము జేసికొనలేక అమ్మయ్యో! మన కొండదేవత మా యింటి అరుగుమీదికివచ్చి కూర్చున్నదిరోయని పెద్దయెలుంగున అరచుచు నాచావడి యొద్దకు బరుగెత్తినది. ఆ మాటలు విని వాండ్రందరు నాగందదీపముతో వాద్యములు మ్రోగించుచు నా యొద్దకు వచ్చిరి. అప్పుడు నామేన ప్రాణములులేవు. చచ్చితినేయని నిశ్చయించితిని. కాని అంతలో మరల నాకొక యూహతోచినది.

అది నన్ను గొండదేవతయని అరచిన అరపు వినబడినది. కొండదేవతకై వారట్లుత్సవము జేయుచున్నారని నిశ్చయించి వారు వచ్చులోపల నాపొడవుపాటి వెంట్రుకలన్ని విరజిమ్మి శివముపూనిన దానివలె నాడుచుంటిని. ప్రాణభీతి ఎన్ని పనులు చేయించునో చూచితివా? అంతలో వాండ్రు నన్ను జూచి అమ్మారో, యని యరచుచు వాద్యములు వాయింపదొడగిరి. నేను లేచి యానాదానుగుణ్యముగా నాట్యమాడ దొడంగితిని. నాతో గూడ వాండ్రందరు చిందులు ద్రొక్కుచుండిరి.

అట్లు కొంతసేపు గంతులు వైచిన తరువాత డప్పులు వాయించుట మానిపించి నాకు మ్రొక్కుచు అమ్మోరో! నీకు బలులిత్తుమో పానకాలిత్తుమో, మమ్మేలో, మాగుడిలోనికిరమ్మో! యని మాటిమాటికి డప్పుపై గొట్టుచు బదాలుపాడగా నేనును దలద్రిప్పుచు అప్పుడా చావడికే పరుగెత్తుకొని పోయితిని.

అప్పుడు నాతో గూడ అందరు, అమ్మోరుగుడికి బోవుచున్నదని యుపచారములు చెప్పుచు లెంపలువాయించుకొనుచు దండములు పెట్టుచు నాచావడియొద్దకు వచ్చిరి. అదివరకే యమర్చబడియున్న వెదురుబద్ధలగద్దెపై నేనుబోయి గూర్చుండి వాండ్రనందరను నాట్యమాడుడని వ్రేలితో సూచనజేసినంత అందరును దమయిష్టము వచ్చినట్లు అడవిపదాలు బాడుచు జిందులు ద్రొక్క దొడంగిరి. అట్టి సమయమున నావెనుకదెసనున్న యాడువాండ్రిట్లు సంభాషించుకొనిరి.