పుట:కాశీమజిలీకథలు -02.pdf/34

ఈ పుట ఆమోదించబడ్డది

మదనుని కథ

39

మాతండ్రి నాకు బదియేనువత్సరములప్రాయము వచ్చువరకే తనకు వచ్చిన విద్యలన్నియుంజెప్పెను. నా బుద్ధి మిగుల సూక్ష్మమైనది. కావున నా విద్య లన్నియు చక్కగా గ్రహించితిని. అధర్వణవేద మొక్కటిమాత్రము మా తండ్రికి రాదు. మాతండ్రిగారు సహాధ్యాయుడు విశ్వనాధభట్టను నతండు మాతండ్రికంటె నెక్కుడుదినంబులు కాశిలోనుండి యావేదముకూడ గ్రహించెను. అతండును మా గ్రామమునకు సమీపములో నున్న కుక్కుటేశ్వరమను నగ్రహారంబున విద్యార్థులకు బాఠములుజెప్పుచు నివసించియుండెను. నేను మాతండ్రి యనుజ్ఞవడసి విద్యార్ధినై యాతనియొద్దకు బోయితిని. ఆయనయు మాతండ్రియందుండు గౌరవస్నేహములం బట్టి నన్ను దన యింటబెట్టుకొని యధర్వణవేదము మొదలుబెట్టెను.

అయనభార్య సురుచి యనునది మిగుల రూపవంతురాలు. విశ్వనాథభట్టు ప్రాయము మిగిలిన తరువాత గాశినుండివచ్చి పెండ్లియాడెను. కావున నా దాంపత్యము చూచువారికి హాస్యాస్పదముగా గనంబడకమానదు. సురుచి రూపవతియు విద్యావతియు నగుటచేత వృద్ధుండైనను మగని కనుకూలవర్తనమున మెలంగుచు గుణవతియనియే పేరుపొందినది. నన్నును భోజనభాజనములయందు మిగుల వాత్సల్యముతో జూచుచుండునది. ఇట్లుండ నంత నొక్కనాడు విశ్వనాధభట్టుగా రెద్దియో కార్యావసరమున గ్రామాంతర మరిగిరి. విద్యార్ధులును తలయొకపనికై మరియొకచోటునకు బోయిరి. తుదకు మేమిరువురము గాక యింటిలో మరియెవ్వరునులేరు. నాటియుదయము మొదలుకొని సురుచిబుద్ధి మారిపోయినది. మధ్యాహ్నము నేను భోజనముసేయుచుండ దాపునం గూరుచుండి విసనకర్రచే నన్నమువిసరి చల్లార్చుచు గురుతుపట్టరాని వంటకములు కొన్ని వడ్డించి నవ్వుచు నా కిట్లనియె.

మదనా! మీతండ్రి పండితుడుగనుక నీకుదగిన పేరుపెట్టెను సుమీ! నీ రూపమునకుదగిన విద్యకూడ నున్నది. పూపునందావియుంబోలె విద్యారూపములు గలిగిన నిన్ను జూచునప్పుడెల్ల నాయుల్లమున సంతోషము వెల్లివిరియుచుండును. ఈ వడ్డించిన భక్ష్యము లేవియో చెప్పుకొనుము. చూతము. నీ బుద్ధి యని నన్ను బరిహాసములో దింపినది. అప్పు డామెయభిప్రాయము పూర్ణముగా గ్రహింపనేరక నేను బూర్వపురీతియేయనుకొని యావంటకముల బరీక్షించియు దెలిసికొనలేక సాధ్వీ! యవి సురుచిగా నున్నవిగాని వీనిమర్మముమాత్రము నాకు దెలియలేదని చెప్పితిని. నా నోటనుండి యప్రయత్నముగా బయలు వెడలిన మాటలలో శ్లేషగ్రహించి యాయించుబోణి దృగంచలములు నాపైని బరగించుచు చిరునగవుమొగమునకు నగయైమెరయ నౌనౌను మదనగ్రహము సోకక యీగుట్టెట్లు తేటబడును ? నీవు చెప్పినమాట యదార్థమే యైనను జెప్పెద విను మివి మనోహరములు. చేటికలను నామముగల వంటకములు. సుస్నేహరితములని చెప్పనొప్పు. వీనిదినిన భారమేమియు నుండదని చెప్పినది.

అప్పుడామెయన్న మాటలకు నర్దమువిచారింప శ్లేషగనంబడినది. పిమ్మట