పుట:కాశీమజిలీకథలు -02.pdf/247

ఈ పుట ఆమోదించబడ్డది

252

కాశీమజిలీకథలు - రెండవభాగము

ఆ తాపునకే నోపక నేలబడి మూర్చిల్లి యెట్టకే తెలిసి దైవకృత్యమునకు వగచుచుండ వెండియు వాడువచ్చి నిర్బంధించుచు నోటికిరాని కారు లరచెను. మరల బలాత్కారము సేయబోయినంత భీతస్వాంతనై యరచుచు నాప్రాంతమందున్న విప్రగృహమునకు బారిపోయితిని. అతడును నన్ను దరిమికొని వెంటవచ్చెను. నా మొరవిని యాయింటి బ్రాహ్మణుడు లేచి యేమి యేమి యని అడుగగా బాదంబుల బడి రక్షింపుమని వేడుకొంటిని. అతడును భయయులేదని చెప్పుచుండగా నా వెనువెంట నా వైదేశికుడువచ్చి బ్రాహ్మణుడా యారండ నిట్లు త్రోసివేయుమని పలికెను.

అతడును తొందరపడకుము ఇదియేమి తప్పుచేసినది? వైదేశికా! చెప్పుమని అడుగగా, నోహో! అదియంతయు నీకేల? నాస్థితి యెరుగుదువా? పంపకున్న నీపనిసైతము పట్టించెదజూడుమని చెప్పెను. అప్పుడా బ్రాహ్మణుడు వెరచుచు నన్ను విడువదలంచినంతలో నచ్చటనే అరుగుమీద బరుండియున్న రాజుకీయోద్యోగస్థుడొకడు నాయార్తి అంతయు నా వలనవిని జాలిపడి లేచి యావైదేశికునిమీద దిరుగబడి యెవ్వడ నీవు? అర్ధరాత్ర మిట్లు వచ్చి అల్లరిచేయుచున్నావని బెదరించెను. అతనిని జోరుల నరయుటకై ప్రచ్ఛన్నముగా భటులతో వచ్చిన దండనాయకుడని యెరుంగక సామాన్యుడని యూహించి యావైదేశికుడు ఓహో! నీవెవ్వడవు? కడుజులకనగా మాట్లాడుచున్నవాడవు. నా మర్యాద గురుతెరింగి పలుకుము. మీరందరు మా దాసిని యింటబెట్టుకొని యెదుర నన్నే బెదరింపుచున్నవారు. చూడుడు మిమ్మందర నిప్పుడు శిక్షింపజేసెదనని పలుకుచు దుడ్డుకర్రతో గొట్టవచ్చెను.

ఆ సమయమున నాయుద్యోగస్థుడు నోటితో నెద్దియో యూదిన యమకింకరులవంటి రాజభటులు పెక్కండ్రువచ్చిరి. వారింజూచి వైదేశికుడు జడిసి పారిపోవదలంచినంతలో వారతనిని బట్టుకొని పాదములకు నిగళములు దగిలించి వాడు చేసిన దుర్మార్గమును నావలన జెప్పించుకొని యాతని నగరికిం గొనిపోయి బందీగృహంబున వైచిరి. నేనును గొన్నిదినములా బ్రాహ్మణుని యింటనుండి వెండియు వేరొక రాజధాని జేరి యెవ్వరియింటనుండక వెర్రిదానివలె తలవిరియబోసి మేనంతయు ధూళిరాచికొని బిచ్చమెత్తుకొనచు నా యూరిలో నొకదేవాలయమున రాత్రులు శయనింపుచు మరికొన్ని దినములు దేశయాత్ర నడిపితిని.

ఒకనాడు సాయంకాలమున నేనా గుడిలో నుండగా గొందరు బ్రాహ్మణులు వచ్చి యొండొరు లిట్లు సంభాషించుకొనిరి వెంకటశాస్త్రి! యీ యూరిలో నేడు చాటిం