పుట:కాశీమజిలీకథలు -01.pdf/228

ఈ పుట ఆమోదించబడ్డది

మోహిని కథ

217

సింహదమనుండు తండ్రి కెదురేగి మంచిమర్యాదలతోఁ దోడితెచ్చి యుచిత ఠంబునం గూరుచుండబెట్టి తానును యజ్ఞదత్తుఁడు లోనుగాఁగల సామంతు లతని చుట్టును పీఠంబులఁ గూర్చుండి లోకపరిపాటిగాఁ గుశలప్రశ్నలఁ జేసికొనదొడంగిరి. అట్లు కొంతసేపు మాటలచే గాలము గడపిన వెనుక సింహదమనుండు శత్రుంజయుని నార్యా! నీకు సంతానము గలదా యని యడిగెను.

దాని కతఁడు తలవాల్చుకొని అయ్యా! నా చరిత్ర మేమని చెప్పుదును. నేను సంతానము బడయఁ నెక్కుడు ప్రయత్నముజేసి యొక వనిత మాట విని గర్భవతులై యున్న యేడ్గురు భార్యల నడవిపాలు చేసికొంటిని. ఆ దుర్మార్గురాలి మూలముగానే నాకీ ముప్పు వచ్చినది. దానిని దెచ్చినది మొదలు నా గ్రామంబున నరిష్టములే వచ్చినది. దానిని దెచ్చినది మొదలు నా గ్రామంబున నరిష్టములే సంభవించుచున్నవి. అదియు గొడ్రాలేయైయున్నది. దానంజేసి నాకు సంతానము లేదని సంతాపముతోఁ జెప్పెను.

సింహదమనుండు మొదటఁ దండ్రిని బెద్దతడవు చిక్కులు బెట్టదలంచుకొనెను. గాని యతనిఁ జూచినతోడనే దుఃఖము సహింపనేరక వెంటనే యతని నంతఃపురమునకుఁ దీసికొనిపోయి తల్లుల నేడ్వురను జూపి వీరెవ్వరో యెఱుంగుదువా యని యడిగెను.

శత్రుంజయుఁడు చిరకాలమైనసు వారిని గురుతుపట్టెను. కన్నులు కలిగి యుండుట శంకించుకొనుచు నతనితో నే నెఱుఁగనని యనుమానముగాఁ జెప్పెను. అప్పుడు సింహదమనుఁడు తండ్రికి నమస్కరించి తన్నెరింగించి తనకు జ్ఞానము వచ్చినది మొద లతనినిం జూచినదాక నడుమ జరిగిన కథయంతయుఁ జెప్పెను. అప్పుడు శత్రుంజయుఁడిది యొక కలగాఁ భావించి కొంతవరకు నమ్మలేదు. భార్యలును గొడుకును కోడండ్రు పౌత్రుఁడు మొదలగువారు తనకుఁ జేయు మన్ననలం జూచి నిజమేయని నమ్మెను.

శత్రుంజయుఁడు దైవఘటనము గుఱించి యాశ్చర్యపడుచుఁ దానెఱుగఁకుండ నిక్షేపంబు గృహంబునం గనంబడిన సంతసించు నిరుపేదయుంబోలె నానందపారావారకలోలమాలికం దేలియాడుచు భార్యలం గారవించి పుత్రుని మన్నించి పౌత్రుని ముద్దుగొని కోడండ్ర నాదరించి వారి వారికిఁ దగినట్లు మన్ననలం గావించెను.

పిమ్మటఁ దండ్రి యనుమతిచే సింహదమనుండు చిలుకయున్న పంజరమును దెచ్చి చిలకను పై కిదీసి ముందు కాళ్ళు విరుగఁదీసి వెనుక రెక్కలు ముక్కలుచేసి తర్వాత కంఠము నులిమి దూరముగా విసరి పారవైచెను.