పుట:కాశీమజిలీకథలు-06.pdf/226

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభావతి కథ

231

నాహృదయము నుడికింపుచున్న యవి. నా యెడ మొదటంజూపిన కనికరము కర మభివృద్ధి సేయఁ గోరుచున్న దాననని దీనవదనయై ప్రార్దించుటయు నతం డక్కలికిం గౌఁగలించుకొని ప్రేయసీ ! నీవు చింతవిడువుము. నీ వెను వెంటఁ దిరిగి నీ శీలముఁ బరీక్షించితిని. నీవు గడు సత్యసంధురాలవు. అరుంధతి మెదలగు పతివ్రతలు నీ కెన యగుదురా ? నిన్నుఁ బెండ్లియాడి నేను ధన్యుఁడ నైతిని మావంశం బెల్ల బావనమైనది. నీవంటి భార్యను బడయ ననేక జననకృతసుకృతమునఁ గాక శక్య మగునా ? యని బహువిధంబుల నగ్గంచుచు నగ్గజగామినింగూడి‌ పెద్దకాల మీభూతలంబున సుఖియించెను.

అని యెరింగించి సరోజిని రాజపుత్రులారా ? ఈకథ యంతయును వింటిరి గదా. ప్రభావతియు భర్తయు నుపాధ్యాయుండును దొంగలును వీరిలో నెవ్వరుత్తములో గుణదోషములు విమర్శించి మీరిప్పుడు నాకుఁ జెప్పవలయును. మీ బుద్దికౌశల్య మెరింగెదగాక‌ యని యడిగినది.

అప్పుడు సుముఖుఁడు వారిలోఁ ప్రభావతియే కడు నుత్తమురాలు. ఆమె వంటి గుణవంతురాలీ జగములో లేదు. సత్యమున హరిశ్చంద్రాదుల మించినదని పొగడెను. ఆ మాట విని రెండవయతండు ప్రభావతి శీలవతియని యొప్పుకొనఁ దగినదే. అట్టి పతివ్రతలైన యువతులు పుడమిఁ బెక్కండ్రుకలరు. కాని దానిభర్తవంటి శాంతము గల మగవాఁడెందును గలుగ నేరడు. తొలికూటమినాడు తన్నుఁ బొందక యెవ్వనికోమాట యిచ్చితినని భార్య చెప్పినంతనే పోయి రమ్మని పలుకుట కతనికాతడే సాటి. భానుమంతుఁడు పరమోత్తముఁడని బద్మనాభుండు వాదించెను.

ఆ మాటలు విని మూడవ రాజపుత్రుడు కాదు కాదు. నామాట వినుండు. తెరగంటి మచ్చకంటివంటి వాల్గంటివచ్చి మచ్చికలు సూపుచుఁ బచ్చవిల్తుకేళికిఁ జేరిన వలదని విడిచిన నుపాధ్యాయుండు ప్రవరుని కన్న నుత్తముఁడని నా యభిప్రాయము. మగవాని కట్టితరి ధర్మబుద్ధి నిలుచుట దుస్తరముగదా యని పలికిన నాక్షేపించుచు నాలుగవరాజ కుమారుండు పింగళాక్షుం డిట్లనియె.

అన్న లారా ! మీరించుకయు విమర్శింపక పలుకుచుంటిరి. రాజపుత్రికయు భర్తయు నుపాధ్యాయుండును సర్వశాస్త్ర పురాణాదుల నెరింగిన వారగుట వారినీతివర్తనము లోకమున కంత వింతఁగలుగఁ జేయనేరదు. వినుండు. ధర్మాధర్మవివక్షతలేక‌ క్రూరమృగంబుల భాతి యెదురఁ బడిన మునులనైన దలలు వ్రక్కలు చేసి వస్తువులు దోచికొనెడు దొంగ లయ్యంగన పలుకులు నమ్మి కనికరించి కానుకలిచ్చి యంపిరి. వాండ్రకన్న నుత్తము లెందైనఁ గలరా? చోరులే గుణవంతులని యతండు సంవాదముఁ గావించెను. ప్రస్తుతాంశములు మరచి యా విషయము నలువురు పెద్దతడవు ప్రసంగించిరి.

ఆ ప్రసంగ మంతయును విని సరోజిని వారిని వారించుచు బింగలాక్షు