పుట:కాశీమజిలీకథలు-06.pdf/214

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుమేధుని కథ

219

సుము -- నాబుద్ధి ప్రసరించుటచేతనే యది పతిపత్ని కాదని దలంచుచున్నాను. తత్సౌందర్య మనన్య సామాన్యమని నిరూపించి చూచినంగాని తెలియదు.

పద్మ -- అట్లయిన మనము వెనుకకుమరలి వారివృత్తాంతమడిగి తెలిసి కొందముగాక.

అందుల కందరును సమ్మతించి గుర్రముల మరలించుచుఁ బట్టణాభిముఖులై యతివేగముగాఁ బోయిరికాని వారజాడ యేమియుం గనంబడినది కాదు. వారంతకుమున్ను యొకవిప్రగృహంబునం బ్రవేశించిరి. ఆ యింట భుజించునప్పుడు బ్రాహ్మణులు మంత్రి వృత్తాంతమేదియో చెప్పుకొనుటయు ఘటదత్తుఁడు శంకాకుల స్వాంతుఁడై యది యెట్టిదని యడిగిన నాయింటి యజమానుం డిట్లనియె.

అయ్యా ! మా రాజునకు నలుగురు కుమారులు కలరు. వారు నాలుగుదేశములను బాలింప సమర్దులై యుండిరి. రాజు వారిలో బుద్ధిమంతుఁ డెవ్వఁడో వానికే రాజ్య మిత్తునని వారిం బరీక్షించి తారతమ్యముఁ దెలిసికొనం జాలక మంత్రిని వారి హెచ్చు కుందులు చెప్పుమని యడిగెను. అయ్యమాత్యుఁడు తెలిసియో తలియకయో పెద్దవాఁడు సుముఖుఁడే బుద్దిమంతుడు. వానికే రాజ్య మిమ్మని రాజుతోఁజెప్పెను. ఆ మాట విని తక్కిన రాజపుత్రులు మువ్వురు కోపించుచు వానికి రాజ్యమిచ్చిన నిచ్చును గాఁక. అర్హుండనిన ననుఁగాక నలువురలో బుద్ధితారతమ్యమేమి గ్రహించి మంత్రి యట్లు చెప్పెను? అవ్విషయము పరీక్షించి దెలుపవలయునని తలంచుచు నతనియొద్దఁ దగవు పెట్టిరి.

మంత్రి -- కారణ మేమియుం జెప్పక మీలో నాతండే బుద్ధిమంతుఁడని వారితో వాదించెను. అప్పుడు వారలీర్ష్యాకషాయిత చిత్తులై మంత్రిని వంచించు నుపాయ మరయుచు కనకమణి దాపితమగు తండ్రిగారి ముద్రాయంత్రము వారిలో నెవఁడోహరించెను. వారు నలువురుంగాక యారహస్య మందిరములోని కితరులెవ్వరును బోవరు. మరునాఁడు రాజపేటికలో మణిముద్రికం గానక పరితపించుచుఁ బుత్రునింజీరి నా రత్నముద్రిక యెవ్వరు తీసిరని యడిగెను. అ మాట మేము చెప్పఁజాలము. ఎవ్వరు తీసిరో సర్వజ్ఞశిఖామణియగు మీ మంత్రి నడిగి తెలిసికొనుఁడు. అతండతీంద్రియ విషయంబుల గ్రహించుంగదా? ఈ వస్తుచోరుంజెప్ప నేరఁడేని వాని నీ యుద్యోగము నుండి తొలఁగించవలయును ముందు వెనుకలు విమర్శింప నోటికి వచ్చినట్లెల్ల సంభాషించువాఁడు మంత్రిపదవి కర్హుఁడుకాడని పలికినరాజు బాలవాక్యములని వాని నిరసింపక మన్నించుచు నప్పుడే మంత్రిని రప్పించి యావార్త యెరింగించి నీ కిందుల కొకనెల గడువిచ్చితిని. ఈ లోపల నాముద్రికం దీసికొనిన వానిఁ బేర్కొన లేకపోయితివేని నీ యధికారము విడిచి మెందేనిం బోవలయు నిదియే ముమ్మాటికి యాజ్ఞయని పలికి యతం డంతఃపురమునకుఁ బోయెను.

ఢా ముద్రిక నెవ్వఁడుతీసెనో మంత్రియెట్లు చెప్పగలడు ? అధార మేమి