పుట:కాశీమజిలీకథలు-06.pdf/142

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామగ్రీవుని కథ

147

నశించును. తపంబున సార్వభౌముడు కావచ్చును. నీ వట్టితప౦బుఁ గావింపుమని యుపదేశించుటయు స్వామీ! తపంబెట్టుఁ జేయవలయును. విధాన మెట్టిదని యడిగిన నతం డిట్లనియె.

కాశి కవ్వల హిమవత్పర్వతము కలదు. అక్కడకిఁ బోయిన మహాత్ములు పెక్కుండ్రు కనంబడుదురు వారి నాశ్రయించి మంత్రోపదేశముఁ బొందుము. తపోవిధానము వారే యెరింగింతురని బోధించిన విని సంతసించుచు నేను నాఁడే బయలుదేరి పయనములు సేయుచుఁ గడు నిడుములు పడి యారునెలలకుఁ గాశీపురంబుఁ జేరితిని. అందున్న మహాత్ముల సేవించి భాగ్యముఁ గలుగు తెఱ వుపదేశింపుడని యడిగిన నొక్కరుఁడును దగిన సమాధానముఁ జెప్పినవాఁడు లేఁడు.

విశ్వేశ్వరుని యాలయము వెనుక జ్ఞానవాపిచెంతఁ దపంబుఁజేసి కొనుచున్న యొక మహాయోగి నారుమాసము లాశ్రయించితిని. అతండు నా శుశ్రూషకుమెచ్చి నా కోరికవిని పూర్వపుణ్య పరిపాకంబునంగాని భాగ్యము లభింపదు. తపంబు ముక్తికిఁ గారణమని యుత్తరము జెప్పెను. వారి మాటలయెడ విశ్వాసము లేకనేనటఁ గదలి రెండు నెలలకు గంగోత్తర కరిగితిని. అది గంగానది జనించిన తావు. కడు పుణ్యక్షేత్రము. సంతతము మంచువర్షము కురియుచుండును. అక్కడి చలిబాధ యమలోకమునసైతము లేదు. ఆ స్థలమందనేకులు దిగంబరుల్జై తపముఁ జేసికొనుచున్నారు. వారి‌ నందర నాశ్రయించితిని. ఎవ్వరికి నాయం దనుగ్రహము వచ్చినదికాదు. సీ? ఇఁక నీ జన్మముఁబాసి యుత్తరజన్మములో నుత్త ముండనై యుండెదను. ఇప్పుడు నా కామ్యము తీరదు. అని చావ నిశ్చయించి యొకనాఁడు రెండు క్రోశములదూరములోనున్న శ్రీకూటమను‌ పర్వతమెక్కి నలుచక్కిఁ దిరిగి మరణకృత నిశ్చయుండనై తత్సాధన మరయుచుండ నాదండ నొక విశాలసాలవృక్షము కనంబడినది. ఆ మ్రానెక్కి చేతులు జోడించి యిట్లుఁ బార్దించితిని. వేల్పులారా? నేను సంపదలనిమిత్తము చాలకష్టములఁ బడితిని. కాసంతయుఁ బ్రయోజనములేక పోయినది. ఇట్టి నికృష్టపుఁ జీవనము సహించుటకంటె సకలబాధా విస్మరణ కారణంబగు మరణంబు శ్రేయము. ముందుజన్మమునందైన నన్ను భాగ్యవంతునిగాఁ జేయుఁడని కోరుచుఁ గన్నులు మూసికొని నేల కుఱయబోవు సమయంబున, ఓహో! వలదు. వలదు. సాహసము సేయకుము. నీ వెవ్వండవు? అని యా పాదపము మొదటినుండి యొకధ్వని బయలు వెడలినది.

ఆ నినాదమువిని‌ నే నదరిపడుచు నా కామిత మీడేర్ప భగవంతుండరుదెంచి యిట్టిమాటఁ బలికెనని యుబ్బుచు నేలవంకఁ జూడ్కులు నెఱయఁ జేసితిని ఆ చెట్టు మొదట డొంకలలో జడలచే నావరింపఁబడిన శిరము కలిగిన యొక తపస్వి నా కన్నులం బడియెను.


జూచి మురియుచు మెల్లన నత్త రువు దిగి తదీయ చరణంబుల