పుట:కాశీమజిలీకథలు-06.pdf/129

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

సీ. ఇదిమూల మిదియగ్ర మివి శాఖలని నిరూ
              పింప నించుకయుఁ గాన్పించదయ్యె
    నివిమ్రాకు లివిమోక లివివాకలని నిరూ
              పింప నించుకయుఁ గాన్పించదయ్యె
    నిదిపురం --దివసంబని నిరూ
              పింప నించుకయుఁ గాన్పించదయ్యె
    నిదిపల్ల మిదిమెట్ట యని నిరూ
             పింప నించుకయుఁ గాన్పించదయ్యె.

గీ. దరులు గిరులును నదులు గాంతారములును
    భూమి యాకస మొక్కటైపోయె నాకు
    నెట్లు నిలిచితినోకాని యెరుఁగ నందు
    నతిరయంబున నాహయం బరుఁగునపుడు.

అట్లా రాత్రియెల్లఁ బరుగిడి ప్రొద్దుపొడుచువరకు సౌగంధిక నగర బాహ్యోద్యానవనంబుఁ జేరి యా వారువంబు నిలిచినది. దాని మేనంతయుఁ బ్రావాహంబుగాఁ జెమ్మటలు కారుచుండెను. అప్పుడు నన్నుఁ బునర్జీవితుఁగాఁ దలంచికొని దానికడుపున నంటికొనియున్న పాదంబులెట్టకే లాగికొని మెల్లఁగాఁ బుడమికిదిగి కన్నులు తిరుగుచుండ నిలువలేక నేలం బండుకొంటిని.

పెద్దతడవున కలయిక తీరుటయు లేచిచూడ నా బాడబమందు గనంబడ లేదు. అప్పుడు శ్రీరాముని భంగపరచిన తురంగము తెరంగున నీ తురంగము నన్నిక్కడికీడ్చుకొనివచ్చి మిత్రవియోగముఁ గావించినది. ఇది కపట ఘోటకము. అని నిశ్చయించి యటఁగదలి పురములోనికింబోయి వింతలు చూచుచుండఁ బౌరులు గుంపులుగుంపులుగాఁ గూడికొని యెక్కడికో బోవుచుండ వారివెంట నేనుం బోయితిని. అప్పు డప్పురమునకుఁ దూరుపుగానున్న తోటలోని చ్యితశాలలో సౌగంధికయను రాజపుత్రిక స్వయంవర మహోత్సవము జరుగుచున్నది. పిలువం బడిన పౌరులెల్ల నా శాలలోనికిం జని యుచితస్థానములం గూర్చుండిరి. కావలివారలు నన్ను లోనికిం బోవనిచ్చిరికారు. ఆ ప్రాంతమందున్న యశోకపాదపమునీడ నిలువంబడి యా వింత జూచుచుంటిని.

ఆ రాజపుత్రిక యందున్న రాజకుమారుల నెవ్వరిని వరింపక పుష్పదామంబు హస్తంబున వ్రేలాడుచుండ మరల నింటికిం బోవుచు దారిలో నన్ను సవిస్తరముగాఁజూచి తలయూచుచు నా చెంత కరుదెంచి యా పుష్పదండ నా మెడలో వైచినది. అప్పుడే పరిచారికలు వచ్చి నన్నందల మెక్కించి రాజోపరివారములతో రాజభవనమునకుఁ దీసుకొనిబోయిరి.

అందులకేకదా యీసుంబూని రా కొమరులెల్ల నట్టహాసముతోఁ గోట