పుట:కాశీమజిలీకథలు-06.pdf/109

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

స్థూలజంఘుఁడు దాపునకు వచ్చి కమలా ! చిదంబరయోగి గోపురము దాపుననున్న శూన్య శివాలయములో నున్నట్లు నాకుఁ గలవచ్చినదిసుమీ ? యని చెప్పిన నప్పడఁతి వానితో నేమియు మాటాడినది కాదు. వాఁ డరిగిన వెనుక యా కనకగాత్రి యాలయ ప్రాకారములోని భూమియంతయు వెదకుచు దక్షిణగోపురము దాపుననున్న శూన్యాలయము నొద్దకుఁజని స్వామీ ! చిదంబరయోగింద్రా? యెందున్నావని పిలుచుటయు నా చప్పుడువిని అమ్మా ! కమలా ! యిందున్నాను. తలుపులు తీయుము అని యరచెను. అప్పుడా పడఁతి గొణ్ణెముతీసి తలుపులు తెరచి యందు మంచము నడుమం గూరుచున్న యా యోగిం గాంచి దాపునకుఁ బోయి స్వామీ! మీ రిక్కడి కెట్లువచ్చితిరి? చిత్ర మయ్యెఁడు చెప్పుఁడని యడిగిన నతం డమ్మా ! ఇది దైవ మాయ. మంచముక్రింద నేదియో యున్నది. ఊరక యరచుచు నన్ను వెఱపించుచున్నది. అని సంజ్ఞజేయుచుండగనే తామ్రకేశుఁడు తటాలునఁ బ్రాకి గుడి బైటికి వచ్చి తలుపులు బిగించి యవ్వలికిఁ బారిపోయి స్థూలజంఘుం గలసికొనియెను.

వానింజూచి వాఁడు నవ్వుచు నోరీ ! యెట్లు వచ్చితివిరా ? యని యడిగిన ఛీ ! ఛీ ! నీవు మిత్రద్రోహుఁవు నీతో మాటాడరాదు. నే నందుఁ జిక్కి పడియుండఁ దలుపులు బిగించి వచ్చెదవా ? పాప మా కమలవచ్చి తీయకున్న నే నెంత చిక్కుపడిపోవుదును. అని నిందించిన వాఁ డిట్లనియె.

నీ కుపకారము చేసినను నిట్లే పలుకుచుందువు. కమలతోఁజెప్పి యచ్చటికిఁ బంపినవారెవ్వరో తెలిసికొనలేవు. అది వచ్చి తలుపులు తీసినతోడనే యా ముసలివాని నీవలకుఁ ద్రోసి దాని లోపలకు లాగికొనియుందువని యప్పని చేసితిని. అట్లు చేయక దొరకిన యర్ధము పారఁజిమ్ముకొనివచ్చి నన్నేమో దూరెదవు చాలులే. ఏమిజరిగినదని యడిగిన నవ్వుచు నిట్లనియె.

తెలిసినది తెలిసినది. అదియా ! నిన్ను నిందించినందులకు క్షమింపుము. మనము లేచినవేళ మంచిది. ఇంతపొరపాటు చేసితిమేల? నాకా ! రాత్రి నేను పడిన పాట్లు దయ్యమెరుంగు నేను దయ్యమని యతండూరక వెరచినకొలఁది యరచు చుంటిని. ఆ కమలవచ్చి తలుపుఁదెరచి యతని బరామర్శింపుచుండఁగ లేడివలె నెగిరి యీవలఁబడి తలపులు బిగించి వచ్చితిని. వింటివా యని చెప్పిన వాఁడుజూచి వీపు చరచుచు నిట్లనియె. బళి బళి. బాగుబాగు. మంచిపని చేసితివిగదా ? మరల రాత్రిపడనిమ్ము అని వారు మాటాడుకొనుచుండగా రాజదూత వేత్రహస్తుఁ డొకడు వచ్చి మంత్రులతోఁగూడి శశాంక మహారాజుగారిందు వచ్చుచున్నవారు. సద్దు చేయ వలదని యాజ్ఞాపించెను. ఆ మాటనిని యందుఁ గల సన్యాసులెల్ల యెక్కడివారక్కడ గూర్చుండి జపమాలికలు త్రిప్ప మొదలుపెట్టిరి.

అప్పుడు ప్రధానులతోఁ గూడికొని యా భూభర్త యుచ్చటికి వచ్చి యోగి బృందమునెల్లఁ బరామర్శింపుచు భోజనభాజనాది సత్కారములన్నియు మీ కనుకూల