పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/421

ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

" ఈ యాలోచన దివ్యముగానున్నది. కాలుచున్న కాష్టములో నుండి యొక కఱ్ఱనుగొని ఇక్కడ నున్నట్టే వచ్చెదను."

ఈ మాటలు చెవినిబడగానే నేనావఱకును పెట్టెకుదుపు వలన ఁగలిగిన గాయముల బాధను మఱచిపోయి ప్రాణభీతి చేత మానసికమైన మరణవేదనను పొంద నారంభించినాను. ఈ మనోవేదన ముందఱ నా శరీర వేదన పర్వతములో పరమాణువంతగానైనను తోచలేదు. ఏమియూ పాలుపోక ఇట్లా రాటపడుచున్న సమయములో హిడింబి పెట్టెమూఁత తీసి నన్ను పైకి తీసినది. ఇంతలో నెవ్వరో దూరమునుండి " హిడింబీ! హిడింబీ!" అని పిలువ జొచ్చిరి. " అయ్యో! ఈ వాలఖల్యుని నా యొడిలోఁ బెట్టుకొని నా బట్ట సవరించుకొనుటకై న నవకాశము లేక పోయినది! కానీ! ఇతని నిప్పటి కీ పొదలో దాచి వారిని సాగనంపి మరల వచ్చి యొడిలో బెట్టుకొని పోయి నా చెలికి సమర్పించెదను. ఈ లో పల తాటక వచ్చి యడిన గినయెడల పెట్టె తీయఁగానే యెలుక పాఱిపోయి యేదో కలుగులోఁ దూరినదని బొంకెదను." అని తాననుకొనుచు నన్ను చేరువ పొదలోఁబెట్టి తానా వచ్చెడివారి కెదురుగాఁ బోయెను. నేను దూర ముగా నున్నను వారి మాటలు నాకు వినఁపడిచునే యుండెను.

ఆ వచ్చినపురుషులలో , నొక్కడు ఓ హిడింబి! రాత్రి వాల ఖల్యనహిషి౯ నెవ్వరో యెత్తుకొనిపోయినారఁట! ఆతనిని వెదకుటకై మహాకాయుడుగారు మమ్ముబంపినారు. ఆతనిజాడ నీకేమియు తెలియలేదుగా?

హిడిం  : తెలియలేదుగాని నేనొక్క మాట విన్నాను. ఎవ్వడో యంగుష్టమాత్ర శరీరుడైన పురుషుఁడొక్కఁడు జ్యోతిశ్శాస్త్ర ప్రతి పక్షులైన నవనాగరికుల సభలో నున్నాఁడని విన్నాను.

పురు : ఆసభయొక్కడనో మాకు కొంచె మానవాలు చెప్పఁ గలవా?