పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/44

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంధనం

133. భారతప్రభుత్వ కార్యక్రమం 'అందరికీ విద్యుచ్ఛక్తి' అమలుకు గాను ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపిటకైంది. గృహోపయోగానికీ, వ్యాపారపారిశ్రామిక సంస్థలకు ఒక నిర్ణీత కాలవ్యవధిలో విశ్వసనీయమైన, న్యాయమైన మరియు సముచితమైన ధరకు 24x7 పాటు విద్యుచ్ఛక్తి సరఫరా చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

134. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎపిజెన్‌కో, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు మరియు స్వతంత్ర విద్యుచ్ఛక్తి ఉత్పత్తిదారుల ద్వారా అదనంగా మరొక 2925 మెగా వాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కానుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన 2000 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని కొనుగోలు చేయటానికి ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌లకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. అలాగే సౌర, పవన వనరుల ద్వారా విద్యుచ్ఛక్తి ఉత్పాదన చేసి, తద్వారా పెరుగుతున్న గిరాకీని తట్టుకోవాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నది. రాష్ట్రంలో సౌర, పవన విద్యుచ్ఛక్తి సామర్థ్యాలను ప్రోత్సహించడం కోసం ఒక సమగ్ర సౌర,పవన విద్యుత్ విధానాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

135. పారదర్శకంగానూ, పోటీపడగల వేలం ప్రక్రియద్వారానూ 1000 మెగావాట్ల సౌరవిద్యుత్తు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం డిస్కమ్‌లకు అనుమతి నిచ్చింది. 1000 మెగావాట్ల సామర్థ్యం కల్గిన 2 సౌరవిద్యుత్ పార్క్‌లను గుంటూరులోనూ, అనంతపురంలోనూ నెలకొల్పడానికి ప్రతిపాదించడం జరిగింది. రైతులకు సోలార్ పంపుసెట్లను ఇవ్వడం, ఇళ్ల పైకప్పుల మీద సోలార్ విద్యుత్ వ్యవస్థలను నెలకొల్పడం మీద ప్రభుత్వం దృష్టిపెట్టనున్నది.

42