పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త్రీ, శిశు సంక్షేమం

46. ఒక జాతి సాధించిన ప్రగతిని ఆ జాతికి చెందిన స్త్రీల ప్రగతిని బట్టి అంచనా వేయవచ్చునని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారని గుర్తు చేసుకుంటున్నాను. ఆదిశగా మా ప్రభుత్వం మహిళా సాధికారికతకు కట్టుబడి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో గ్రామీణప్రాంతాల్లో 41,982 అంగన్ వాడీ కేంద్రాలు, పట్టణప్రాంతాల్లో 4,248 కేంద్రాలు, గిరిజనప్రాంతాల్లో 2,169 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇవికాక 6,625 మినీ అంగనవాడీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయి. 254 ప్రాజెక్టుల ద్వారా ఐసిడిఎస్ పథకం సార్వత్రీకరించబడింది. పౌష్టికాహార పథకం కింద దాదాపు 27 లక్షల మంది శిశువులు, 8 లక్షలమంది గర్భిణీస్త్రీలు, బాలింతలు లబ్ది పొందుతున్నారు. ఇవికాక మరెన్నో పథకాలు అమలవుతున్నాయి.

47. స్త్రీ శిశు సంక్షేమానికి 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ. 1,049 కోట్లు ప్రతిపాదించడమైనది.

వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమం

48. వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ విభిన్న సామర్థ్యాలు కలిగిన బాలబాలికల కోసం 20 హాస్టళ్లు, 2 నిలయాలు, 6 గురుకుల పాఠశాలలు మరియు ఒక గురుకుల జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నది. అటువంటి బాలబాలికలకు ప్రీ-మెట్రిక్ మరియు పోస్ట్-మెట్రిక్ ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నది. దృష్టి సమస్య కలిగిన బాలబాలికలు కంప్యూటర్ శిక్షణ, ఆర్థిక పునరావాసం, వివాహాలకు ప్రత్యేక అవార్డులతో పాటు, విద్యార్థులకు ప్రత్యేక బోధనసామగ్రి పంపిణీ కూడా ఈశాఖ చేపడుతున్నది.

19