పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్నత విద్య

దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనంబురా
లలిత సుగుణజాల తెలుగుబాల.


కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు చెప్పినట్లుగా విద్య అనే సంపదను దొరలు దోచుకోలేరు. దొంగలు దొంగిలించలేరు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వచ్చి దాన్ని పంచుకోలేరు. ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది విద్య మాత్రమే.

56. జాతీయ విద్యా విధానం-2020 కి అనుగుణంగా, 2020-21 విద్యా సంవత్సరం నుండి సవరించిన యు.జి. ప్రోగ్రామ్ పాఠ్యాంశాలను ఇంజనీరింగ్, బి.ఎ., బి.ఎస్.సి., బి.కామ్. మరియు ఇతర పట్టభద్రుల కోర్సులలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సవరించిన పాఠ్యప్రణాళిక, 'ఫలితం ఆధారితమైనదే కాకుండా జీవిత నైపుణ్యం, నైపుణ్య అభివృద్ధి మరియు నైపుణ్య మెరుగుదల అంశాలను కలిగి ఉంటుంది. విస్తృతమైన ఎంపికలతో కూడిన 'ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్' మరియు విద్యార్థుల ఉపాధిని పెంచడానికి పది నెలల తప్పనిసరి ఇంటర్న్‌షిప్ అనేది సవరించిన పాఠ్యాంశాల యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇదే కాకుండా, మన రాష్ట్రంలో 2018-19 సం॥లో 32.4% గా ఉన్న ఉన్నత విద్యలో గల స్థూల నమోదు నిష్పత్తిని, 2024-25 నాటికి 70% మరియు 2035 నాటికి 90% వరకు పెంచే వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఉన్నత విద్య యొక్క నాణ్యతను నిర్ధారించడానికి, రాబోయే 5 సంవత్సరాలలో అన్ని విశ్వవిద్యాలయాలు మరియు 50% కళాశాలలు నేషనల్ అసెస్మెంట్ మరియు అక్రిడిటేషన్ కౌన్సిల్ (N.A.A.C.) చేత గుర్తింపు పొందాలనే ఉద్దేశ్యంతో 'క్వాలిటీ అస్యూరెన్స్ సెల్' ను స్థాపించడం జరిగింది. 2021-22 సం॥లో ఉన్నత విద్య కోసం 1,973 కోట్ల 16 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడమైనది.

28