పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త్రీ సాధికారికత, శిశు సంక్షేమం

డాక్టర్ బాబా సాహెబ్ బీం రావ్ అంబేడ్కర్ ఒక మాట అన్నారు.

'ఒక సమాజం ఎంత పురోగమించింది అనే దానికి ఆ సమాజంలో స్త్రీల పురోగతినే నేను కొలమానంగా తీసుకుంటాను'

45. ప్రభుత్వ విధాన లక్ష్యాల్లో అత్యంత ముఖ్యమైన వాటిలో స్త్రీ అభ్యున్నతి కూడా ఒకటి. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టే చర్యల్లో, మాతా శిశు మరణాల తగ్గింపు, తొలి శైశవ సంరక్షణ, విద్యాభివృద్ధికి ప్రోత్సాహకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఋణ సదుపాయం అందుబాటు, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రయోజనం ఉన్నాయి.

46. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 257 ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టులను నిర్వహిస్తున్నది. వీటి పర్యవేక్షణలో పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 48,770 అంగన్ వాడీలు, 6,837 మినీ అంగన్‌వాడీలు పనిచేస్తున్నాయి. పిల్లల్లో పోషణ లోపం, పెరుగుదల ఆగిపోవటం, తక్కువ బరువు ఉండటం, అలాగే స్త్రీలలో రక్తహీనత రాష్ట్రంలో, కొన్ని ప్రాంతాల్లో మరీ ప్రత్యేకంగా ప్రబలి ఉంది. పేదరికం, నిరక్షరాస్యత, వైద్య ఆరోగ్య పద్ధతుల పట్ల పరిజ్ఞానం లేకపోవటం, పోషక ఆహారం గురించి జాగ్రత్తలు తెలియకపోవటం, పరిసరాల అపరిశుభ్రత మొదలైనవి ఇందుకు కారణాలు.

47. ఈ పరిస్థితులను మెరుగు పరచడం కోసం ప్రభుత్వం వై.యస్.ఆర్. సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 7 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో విస్తరించిన 77 గిరిజన ఉషప్రణాళిక, షెడ్యూల్డు మండలాలలోని 0.66 లక్షల గర్భిణీ బాలింత స్త్రీలు, 6 నుండి 72 నెలలలోపు వయసు కలిగిన 3.18 లక్షల మంది చిన్నారులు లబ్ది పొందుతున్నారు. వై.యస్.ఆర్. సంపూర్ణ పోషణ కార్యక్రమానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. అలాగే స్త్రీలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,456 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

19