పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

ముద్రణము.

తంజావూరు సరస్వతీమహలులోఁ దప్పులమయముగాఁ దాటాకుప్రతి యొకటియే కలదు. దానికి ప్రతి వ్రాయించి తత్పుస్తకశాలాధికారులు మాకుఁ బంపిరి. మక్కికి మక్కిగావ్రాసిన వ్రాత యగుటచే దానిని దిద్ది ముద్రణమున కిచ్చుటకు సాధ్యము కాదయ్యెను. అందుకై ముద్రణార్హముగా అధికపరిశ్రమమున నవీనముద్రణపులిపిరీతిచొప్పున ఛందోగణయతిభ్రంశరహితముగా వేఱొకప్రతి వ్రాయింపవలసె. ఎట్లో ప్రతి వ్రాయించి సందిగ్ధస్థలములను తంజావూరికిఁ బోయి మాతృకతో సరిచూచి దిద్ది యింకను దిద్దఁ గుదురని స్థలములను సంస్కృతమూలమును జూచి పూరించియును, అందును గుదురనిదాని నుచితరీతిని గ్రొత్తగా రచనము చేసియును గ్రంథమును బూరించితిని. తంజావూరినుండి పుస్తకము నాకు వచ్చినదాదిగా నిట్లు ముద్రిత మగునంతదాఁక జరిగిన నిర్వాహములో నాకుఁ గుడిభుజమై నాసహోద్యోగి విద్వాన్. సాహిత్యశిరోమణి, చిరంజీవి పంగనామాల బాలకృష్ణమూర్తి M. A. B. O. L. కడచిన వేసంగిసెలవులలో నా కెంతేని తోడ్పడెను. తంజావూరి సరస్వతీమహల్ పుస్తకాలయకార్యదర్శి శ్రీ యస్. గోపాలన్ B. A. B. L. గారును, నీముద్రణమును తిరుపతి రత్నాప్రెస్‌లోనే సాగించుటచే నాప్రెస్‌వారును మాకుఁ జాలఁగా ననుకూలించి యెంతేని తోడ్పడిరి. పైవారికి నే నెంతయుఁ గృతజ్ఞుఁడను.

ఈ కామందకకృతి యాంధ్రులయాదరము పడయఁగల దని, తంజావూరి సరస్వతీమహల్ లైబ్రరీలోని యముద్రితాంధ్రగ్రంథము లెల్ల సుముద్రితములై వెలయఁగల వని యాశించుచున్నాను.

తిరుపతి

1-8-50.

వేటూరి ప్రభాకరశాస్త్రి.