మనవి

తెలుగులో అన్నమయ్య తరువాత రాశిలోనూ, వానిలోనూ విష్ణుసాహిత్యాన్ని విరివిగా అందించిన మహాకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. వెంగమాంబ 'తెలుగు మీరా'గా సుప్రసిద్ధురాలై, పోతనతో సాటియైన భక్తకవయిత్రిగా ప్రస్తుతింపబడింది.

శ్రీనివాసుణ్ణి రసరమ్యములైన కావ్యకుసుమాలతో పూజించి తరించిన సుమధుర సారస్వతమూర్తి తరిగొండ వెంగమాంబ. ఈ కవయిత్రీ రచనలు శ్రీవేంకటేశ్వరుని సాహితీ మందిరంలో వెలిగించిన అఖండ దీపాలు. ఆ దీప కళికల కాంతులు ఈనాటికీ నిరంతరం ఆ తిరుమలేశుని దివ్య వైభవాన్ని అక్షరంగా ప్రకాశింపజేస్తున్నాయి.

తిరుపతికి పశ్చిమాన 100 కి.మీ. దూరంలో తరిగొండ గ్రామంలో ప్రభవించి, మధురకవితా సుధాధారలతో శ్రీ వేంకటేశుని అభిషేకించి తరించిన తెలుగు కవయిత్రి, అఖిలాంధ్ర జనయిత్రి తరిగొండ వెంగమాంబ.

సాంఘిక దురాచారాలపై సమరం ప్రకటించి, బాల వితంతువులపై ఆనాడు జరిగే అన్యాయాలను ప్రతిఘటించి- తనకోసం కాదు- తనవంటి అభాగినులపై సంప్రదాయం పేరిట జరిగే అమానుష కృత్యాలను ఎదిరించి, తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విప్లవవనిత వెంగమాంబ.

అనేకానేక ప్రక్రియలలో శతకాలు, యక్షగానాలు, ద్విపదలు, తత్త్వసంబంధమయిన రచనలు, శ్రుతి, లయ సమన్వితములైన వేదాంతగీతాలు వెలయించటమేగాక, శ్రీ వేంకటాచలమాహాత్మ్యంవంటి బృహత్కావ్యములను రచించిన విదుషీమణి వెంగమాంబ, శ్రీతరిగొండ వెంగమాంబ విశిష్ట వ్యక్తిత్వాన్ని పసిగట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, గౌరవనీయులు, సంస్కారి శ్రీ ఏ.పి.వి.యన్.శర్మ గారు ఈ కవయిత్రి రచనలను పరిష్కరించి, ప్రచురించుటకుగాను 'తరిగొండ వెంగమాంబ వాఙ్మయప్రాజెక్టు'ను ఏర్పరచి అందుకు పరిష్కర్తగా శ్రీ కె.జె. కృష్ణమూర్తిగారిని నియమించినారు. ఆ ప్రాజెక్టు "శ్వేత" ఆధ్వర్యంలో పనిచేసేట్టుగా ఆదేశించినారు. స్వయాన సాహితీప్రియుణ్ణి అయిన నాకు తరిగొండ వెంగమాంబను గురించి తెలుసుకునే అవకాశం ఈ రకంగా కలిగింది. వెంటనే ఆమె సాహిత్యంమీద రెండు రోజులు జాతీయ సాహితీసదస్సు నిర్వహించటం, అనంతరం పుస్తకముద్రణతో పాటు, ఆమె పాటలకు బాణీలు కూర్పించి, ఆడియో సి.డి.లుగా విడుదల చేయటానికి పూనుకున్నాను. తిరుమల-తిరుపతి దేవస్థానముల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆమె జన్మదినం సందర్భంగా రెండు రోజులపాటు సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించతలపెట్టినాను. అతి త్వరలో అన్ని పుస్తకాల ముద్రణ, పాటల ఆడియో సి.డి.ల విడుదల పూర్తి చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాము.

ఈ బృహత్ కార్యక్రమము సఫలీకృతం కావటానికి పూర్తి కారకులు శ్రీ ఏ.పి.వి.యన్.శర్మగారు; మా ప్రియతమ కార్యనిర్వహణాధికారి. వారికి తెలుగు సాహితీ, సంగీత ప్రియుల పక్షాన ధన్యవాదాలు.

బి.యస్. రెడ్డి

సంచాలకులు

"శ్వేత"