పీఠిక

ఈకువలయాశ్వచరిత్రము సవరము చిననారాయణనాయకునిచే రచియింపఁబడి నారాయణభూపాలున కంకితమీయఁబడినది. కృతికర్త కీకృతిపతి పెంపుడుతండ్రి. ఇతఁడు తనవంశమునకుఁ గూటస్థునిగా సూర్యుని వర్ణించుటచేత కు క్షత్రియుఁ డనియే తోఁచుచున్నది. కాని నాయకపద మేల వచ్చెనో తెలియకున్నది. మనదేశమం దీనాయకపదము తఱచు శూద్రులయందుఁ గలదు. మఱియును మనదేశమున నచ్చటచ్చట బొబ్బిలిపాటగాండ్రు పాడు పాటలలో తిమ్మరాజుపాటలో "సవరము నారప్ప" యనువానిచరిత కొంత గలదు. ఆనారప్పడు యీకృతిపతి యేమో యని శంక వొడముచున్నది. ఈ కృతిపతితండ్రిపేరు తిమ్మరాజు. ఈతిమ్మరాజు మిక్కిలిప్రసిద్ధుఁడు. ఎంతవఱకు నిజమో తెలియదు. మఱియు నీకవి కాశ్యపగోత్రజుఁడౌట కూడ నాయకపదపక్షమునే రూఢిపఱచుచున్నది. ఏది యెట్లున్నను గంఠోక్తముగా క్షత్రియులక్రింద వర్ణించుకొనినప్పుడు మనమును క్షత్రియులనక తీరదు . ఈకవి తనపూర్వులను వర్ణించినపద్యములు చూడఁగా వీ రనేకయుద్ధములలోఁ దురుస్కరాజుల నోడించినట్లును విస్తారదేశము పరిపాలించినట్లును గనఁబడుచున్నది. తనకన్నతండ్రికి సవతితమ్ముండును తనకుఁ బెంపుడుతండ్రియునగు కృతిపతిని వర్ణించు నప్పుడొకచో "శ్రీరంగరాజకుమార వీరవేంకటరాయభుజాబలసహాయ వివిధోపాయధురీణుం" డను నొకవిశేషణము కలదు. దానింబట్టి చూడ నీయిరువురును మిత్రులని తోఁచినను "గర్ణాటాధీశ్వరదయాసాంద్రుండగు నారాయణేంద్రుం" డనియు "వీరవేంకటరాయభూవిభుకరుణ నెలమిఁ బాలించె నిల నారనేశ్వరుండు” అనియుఁ జెప్పుటచే నావీరవేంకటరాయల కీకృతికర్త సామంతరాజని విస్పష్టమగుచున్నది. ఈవీరవేంకటరాయలు కర్ణాటరాజనుట చేతను రంగరాజకుమారు డనుటచేతను గృష్ణదేవరాయుల యల్లుఁడగు అళియరామరాజు తమ్ముఁడనియే యూహింపవలయును. వసుచరిత్రకృతిపతియగు తిరుమలదేవరాయని తండ్రి రంగరాజనియు నన్న రామరాజనియు వసుచరిత్రమే చెప్పుచున్నది. కావున నీవీరవేంకటరాయులు తిరుమలదేవరాయలకును దమ్ముఁడే. ఈవీరవేంకటరాయలు (1580 సం॥ న) జంద్రగిరిలోఁ బట్టాభిషిక్తుఁ డగుటవలన మనకృతిపతియు నాతనికి సమకాలికుఁడు. కావున నితఁడును 16 శతాబ్దము చివర నున్నవాఁడు. కాఁబట్టి యతనికి దత్తకుమారుఁ డగుకృతికర్త 17వ శతాబ్దము మొదటివాఁడని విశ్చయింపవలయును. 'తనదానగుణము గోదావరీతీరభూనిర్జరేశ్వరులు వర్ణించు నొనరఁగ' ననుటవలన నీకృతిపతి కృతికర్తలు గోదావరిరిమండల మేలినవారేమోయని భ్రమ కలుగుచున్నది. కృతికర్త రాయభూపాలకుమారుఁ డని కవులచరిత్ర చెప్పుచున్నది గాని రంగరాజకుమారుఁడుగాని రాయభూపాలకుమారుఁడు కాఁడు. కృతిపతితాత యగు తిమ్మరాజునకు తిరుమలాంబ మూర్తిమాంబ రంగమాంబ లక్ష్మమాంబ కొండమాంబ గురవమాంబ యను నార్గురు జీవత్కళత్రములు కలరనియు నందుఁ దిరుమలాంబకు మారుఁడు రంగరాజనియు మూర్తిమాంబకుమారుఁడు నారాయణరాజనియు రంగరాజుకుమారుఁ డగు కృతికర్తను రంగరాజు సోదరునికుమారుఁడగు వేంకటరాజును మూర్తిమాంబ కుమారుఁడగు కృతిపతి నారాయణరాజు పెంచుకొనెనని పీఠిక చెప్పుచున్నది.

ఇతని కవిత్వమతిప్రౌఢమై సలక్షణమై నవరసభరితమై వినువారిచెవులకుఁ జవులుగొల్పుచున్నయది. ఇతనికిఁ గల యపూర్వవస్తుకల్పనాచాతుర్యము మనకవికుటుంబములో నలుగురైదుగురికిఁ దప్ప నెవ్వరికిని లేదని నొక్కి చెప్పవచ్చును. ఒక్కొకచో నితఁడు వర్ణించిన విషయముం జూచిన నితనికి సముఁడగు కవి లేఁడనియే తోఁపించుచుండును. ఇందుఁ గావ్యలక్షణములగు సమస్తవర్ణనలు వర్ణింపఁబడినవి. ఇందలికథ పింగలి సూరనార్యని కళాపూర్ణోదయమువలె నాటకశైలిగా నున్నది. దీనిమూలకథ మార్కండేయపురాణములో నున్నది. దానికిని దీనికినిఁ గొన్నివిషయములలో వ్యత్యాసము కలదు. అందు మదాలస చచ్చిపోయిన పిదప నశ్వతరుఁడను నాగరాజు తపము చేసి మదాలసవంటి కన్యకను తనమధ్యఫణమునుండి పుట్టించి మరలఁ గువలయాశ్వున కిచ్చినట్లున్నది. చచ్చిపోయినదానిని మరలఁబుట్టించునా యనుసందేహముచేఁ గాఁబోలు నీకవి యట్లు చెప్పక మఱియొకవిధముగా మార్చినాఁడు. ఇత్యాదిభేదములు కొన్ని కలవు. ఈకథ విచిత్రరామాయణములోఁ గూడ నున్నది. ఎందెట్లున్నను నీకవి కథాకల్పనయం దద్బుతశక్తి కలవాఁడు. ఈకథనే నాటకముగా వ్రాయఁబూనినచో వేఱ యితివృత్తము గల్పింప నవసరమే లేదు. తినఁబోవువారికి రుచిఁ జూపింపనేల యని యిందలి యత్యుత్తమవర్ణనలు కలపద్యముల నిం దుదాహరింపమైతిమి.

ఈగ్రంథమును దంజావూరు సరస్వతీభాండాగారమునుండి యక్కడి యఱవవారిచే వ్రాయించి తెచ్చుటచేతఁ గొన్నివ్రాఁతతప్పులును గొన్ని గ్రంథమందలి లుప్తభాగములును గల యొక్కప్రతియె మాకు దొరకుటచే దాని ననుసరించి యథామతి లుప్తభాగములను వ్రాఁతతప్పులను శతావధానులు తిరుపతివేంకటేశ్వరకవుల సహాయమున బరిష్కరించి మాసరస్వతీపత్రికయందుఁ బ్రచురించితిమి. బొత్తిగా సవరించుటకు వీలు లేనివి సవరించినఁ గవియభిప్రాయమునకు భిన్న మగునేమోయని విడిచితిమి. ఎవ్వరియొద్దఁ గాని మఱియొకప్రతి యున్నచో దయయుంచి మాకుఁ బంపినయెడల భేదములు సరస్వతిలోనుండి పునర్ముద్రితము లగుప్రతులలోఁ జేర్చెదము.

ఇది సవరించుటలో నిజముగాఁ కొత్తగ్రంథము వ్రాయఁదగినంత పరిశ్రమపడితి మనుటకు సందేహము లేదు. అట్టిదైనను నెచ్చటనోయున్న దతికష్టముచే సంపాదించినదైనను నుత్కృష్టమగు రసవత్ప్రబంధమైనను నావ్యయప్రయాసలు మేమే భరించి పాఠకులకుఁ దక్కువవెలకే యిచ్చుచున్నాము.

ఇట్లు, ఆంధ్రభాషాభిమాని,
శ్రీ కొ. రా. వెం. కృష్ణరావు.
సరస్వతీపత్రికాధిపతి.