ఆబ్రహాము లింకను చరిత్ర/మూడవ ప్రకరణము

ఇట్టి యుదాహరణములచే గ్రంథంబుల నింపవచ్చును. అయిన నీరెండును నాకాలపు స్త్రీలకు గల ధైర్యస్థైర్యంబుల నిరూపింప లిఖింపబడియెను. వారిగుణములచే నలంకృత యగు ఆబ్రహాము తల్లి నిర్భయమానస యై యెల్ల గష్టంబులనెల్ల తొందరల నోర్చెను.

ఏడుదివసములు త్రోవ నడచిరని చెప్పితిమిగదా. అట్లు నడచి తమనిర్ణీతస్థానమునకు రెండుమైళ్లదూరమున నీలను పొరుగువారి గుడిసె చేరిరి. వారును లింకనుల మిక్కిలి యాదరించి మఱునాడు గృహనిర్మాణంబున దోడ్పడ బూనిరి.

ఈయనుభవవిషయములెల్ల బెంచివ్రాయుట కొకకారణ మున్నది. ఇ వెల్లయు నాబ్రహామునందు ధైర్యస్థైర్యసాహసాదిగుణంబుల వృద్ధికి హేతుభూతంబు లాయె ననుటకు సందియంబులేదు.

_______

మూడవ ప్రకరణము

నూతన నివాసస్థల నిర్మాణము.

ఆకాలమున 'దేశసంపాదన మార్గదర్శకు' లగు వారలకు ముఖ్యసాధనము గొడ్డలి. దాని నుపయోగించుటయందు బ్రావీణ్యము సంపాదింప బ్రారంభించుట యాబ్రహామునకు నూతననివాసస్థలము సేరినతరువాత దటస్థించెను. అతడు దనతండ్రికి సాయ మొనర్చుచు నెనిమిదిసంవత్సరములవాడైన దాదిగ మిక్కిలి దేహపరిశ్రమ చేయ దొడంగెను. తదను సరణముగ నతనికాయపుష్టి నానాటికి జెన్ను వహించెను. దేశాధ్యక్షత వహించినతరువాత నొకానొక యంతర్యుద్ధానంతరంబున నొకవైద్యశాలయం దుండిన మూడువేల యుద్ధభటులను జూచి వచ్చుట కతడు వెడలెను. అచట నందఱ క్షేమలాభము లడిగికొని వారికి జేయియిచ్చి గారవించుచుండెను. పరిజను లతనిహస్తము నొచ్చునేమో యని జడసిరి. దానికి బ్రత్యుత్తరముగ నతడు 'నాకష్టములు నను దిట్టడి జేసిన' వని నుడువుచు బని తీరినమీదట బార్శ్వమున బడియున్న గొడ్డలి నొకదాని నందుకొని పదిపదునైదునిమిషము లొక్కుమ్ముడి పెద్దమొద్దును దుత్తునియలుగ నఱకి యాగొడ్డలి నెత్తి కరముతో నొక్క రేఖగ నుండు తెఱంగున నిలిపెను. వణకుడు గొంచవేనియు లేక నెట్టన వ్యాపించిన చేయి బొడ గాంచి చూపరు అత్యద్భుతం బందిరి. ఎట్టి యనువభశాలి యగు వృక్షభేదికి గాని యిట్లొనర్చుట గష్టసాధ్యం బనిన నాబ్రహాము బలము వ్యక్తం బగును,

క్రొత్తయునికి చేరినతోడనే థామసునకు గృహనిర్మాణము గర్తవ్య మాయెను. అతడు తత్కాలమున కొక పందిరి వేసు కొని క్రమేణ యిల్లు గట్టుకొన నిశ్చయించుకొనెను. కావున గొంతకాలము వారు ముప్ప్రక్కలమాత్ర మావరణమును నాలవప్రక్క మార్తాండవాయువుల రాకపోకల కనుకూలంబగు బయలును గలగేహంబున నివసింపవలసి వచ్చెను. అతి శీతలదేశమున నిట్టిబ్రతు కెంతకష్టమో యూహింపవలసినదేగాని వర్ణింప నలవిగాదు. వర్షాతపములకు నోర్చుట వారి కంతటి దుస్సాధ్యములోనిది కాదు. వా రట్టికష్టములకు వెనుదీసి యుండినచో నభివృద్ధి యెచ్చటనో దాగియుండును.

ఆబ్రహాము దండ్రి 1817 వ సంవత్సరము శిశిరఋతువు నందు సామగ్రియంతయు సమకూర్చుకొని వసంతంబున విత్తునాటినపిదప నిల్లు కట్టుకొన మొదలిడెను. ఉపకరణముల నాయత్తపఱచుటయం దతనిపుత్రుండు రంపముపట్టుట కొయ్యల నఱకుట మొదలగుపనులు సేయుచు వచ్చెను. ఆకుటీరము నప్పుడప్పుడు చూచుచుండినవా రొకరు దాని నీప్రకారము వర్ణించి యున్నారు.

"అది 18 అడుగుల పొడవును 16 అడుగుల వెడలుపును గలది. నడునేల పూతలేమియు లేక యెక్కుడుదిగుడు లగు భూప్రదేశము. ఇంటిగోడలు సూచితిరే! ఒకటిపై నొకటిగ బంధింపబడిన దుక్కలు. వానిని మూలల జక్కగ జంటించి నెరయలమట్టితో గప్పివైచి యుందురు. దానికప్పు వసారా కప్పుంబోలి మ్రాకుపలకలచే నిర్మిత మై యుండు. ఇల్లంతయు నొక్కగదియ. కప్పునకును గోడలకును మధ్య పలకలువేసి యొక వెలిసెగట్టుకొని యాభవనంబు జేరుట కొక గోడమూలన గన్నములు మేకులు నిలిపియుందురు. ఆగది కొక్క ద్వారంబును మఱొండు కిటికీయు గలవు. ఈ రెండవదానివిషయము గొంచము ముచ్చటించుట యుక్తము. థామసు కిటికీదట్టము నొకదాని నాలుగద్దపుబిళ్లల నుంచులాగున పన్నెను. పన్ని దానినిండుగ నొక సూకరపు క్రొవ్వుపై నుండు పొర గప్పివేసెను. పొరయద్దమునకు దగిన ప్రత్యామ్నాయవస్తువయ్యె."" ఇట్టియూహావిశేషంబు గనుపఱచిన వానిబుద్ధియే బుద్ధిగదా!

తే.గీ. దేవు డిచ్చినదానిచే దృప్తినొంది
     యాత డిచ్చిన ధీశక్తి నలరజేసి
     తనదు కొంచమ సంపద యనుచు బొంగి
     బ్రతుకు మనుజునిదేపొమ్ము బ్రతుకుధరను.

గృహనిర్మాణం బైనమీదట గృహోపకరణనిర్మాణంబు గావలసి యుండెను. తద్విషయమున దండ్రికుమాళ్ల కిట్లు సంభాషణ జరిగెను.

"ఆబి ఆ పోగరకొల్త త్రాడును నిటు తీసికొనిరమ్ము. పరుండ మంచమొక్కటి నిర్మిపవలయు." ఆ రెండుసాధనముల దెచ్చుచు నాబి "నాయనా! నేన పోగరవట్టి రంధ్రములు సేయ గలుగదు."

"అబ్బీ! నీవాకార్య మొనర్ప జాలవు. ఈ పెద్దమొద్దుల రెండంగుళములు దొలుచుట గష్టము. నీవు వెడలి కోడునకుగా నొక్కకొయ్యయు దానిపై నుంచుటకు రెండుపట్టెలను సంపాదింపవలసినది."

"అంతమాత్రమ చాలునా?"

"అంతే అదిగొ! యామూలన దాని నిర్మించెదను. రెండుప్రక్కల గోడమొద్దులు పట్టెలవలె నుండనే యున్నవి. రెండురంధ్రములుమాత్రము వానియందు జేయవలసి యుండును. ఒకకోడుమాత్రమె నిలుపవలసి యుండును. మఱి రెండుపట్టె లారెండుకన్నముల నుండి యాకోడు పైకిదెచ్చి యద్దానిపై బిగించిన జాలును. ఈపనియంతయు నొక గంట కాలమునకంటె నెక్కుడు పట్టదు."

ఇంట నొకవైపున పరుండస్థానము నియమించుకొనుట జేసి పని యంత విశేష ముండదాయెను. పైన జెప్పినవిధమున గోడ మొద్దుల బొడవున నెనిమి దడుగులమీదను వెడలుపున నాలుగున్నర యడుగులమీదను రెండురంధ్రములు సేసి రెండు పట్టెల వానిలో దూర్చి యొకకోడు మీదికి దెచ్చి బంధించి వేసెను. ఇ ట్లిది ముగిసినతోడనె థామసు: "ఆబి! ఇక నవారున కేర్పాటు సేయవలయును శయ్య వేయుట కేదైన నొక యాధారము గావలయునే" యని హేళనముగ ననియెను.

తండ్రి యర్థము స్ఫురింపక యాబ్రహాము "మ్రానిపలకలు వేయుదు రని యెంచియుంటి" ననియెను.

"మఱేవిధమైన నవారును గానరాదు. ఆపలక నిటు లందిమ్ము."

ఇంటికప్పున కుపయోగింపబడిన జాతిపలకలన యుపయోగించి మంచ మేర్పఱచుకొనిరి. ఇదేవిధమున బుద్ధికౌశలము సూపి యొకబల్ల, కుర్చీ వీనిరెంటి జేసికొనిరి.

ఆకాలమున వారికి ధాన్యము విసరుకొని పిండి చేసు కొనక భుజించు మార్గములు దెలియవు. తిరుగలులు మన రాతితిరుగలివంటివి వా రెఱుగరు. పది పండ్రెండు మైళ్లదూరము వోయి వాయువే ముఖ్యాధారముగా గల యొక యంత్రమున దమ ధాన్యమును విసరుకొని వచ్చుచుందురు. దీనిచే గాలనష్ట మధిక మగుచుంటగాంచి థామసు బుద్ధి కౌశల్యము గలవాడు గనుక తన కుమారుని సాహాయ్యము దీసికొని పెద్దమొద్దు నొకదాని మద్యగాల్చి మనరోలుంబోలే నొకసాధనంబును నొక రోకలిని దాని నుపయోగింప మఱి యొక సాధనంబునుజేసి యాకొఱంత మాన్చుకొనియెను. ఈవిధమున గృహోపకరణముల నన్నిటిని రెండు దినములలోపల జేసికొనిరి. ఆబ్రహాము విద్యాభ్యసనంబునకును నిద్రకును స్థాన మింటియందలి వెలిసెయే. ఆస్థలమున రాత్రుల నొక గొంగళి పఱచుకొని సుఖనిద్ర యనుభవించుచు ననేకసంవత్సరములు గడపెను. అదియ యతనికి మహా హర్మ్యభవనంబులలోని హంసతూలికాతల్పంబునకు సమానంబుగ నుండెను. అంతకంటె సౌఖ్యకర మగువస్తు ప్రపంచ మత డప్పుడు కని యెఱుంగడు; తరువాత గందునను తలంపు నతనికి లేదు.

1817 వ సంవత్సరము ఆకురాలుకాలము వచ్చులోపల లింకనులు దమ నూతన నివాసస్థలమున స్థిరపడి యుండిరి. అప్పటికి ఆబి కర్తవ్యాంశముల నెల్ల జక్కగ గ్రహించి యుండెను. వాచక లేఖనములగూడ మిక్కిలి పరిశ్రమ చేసి యుండెను. వారి పుస్తకభాండాగరములోని మూడుగ్రంథములు నతనికి నుపయోగకారు లై యుండె.

ఆ దేశమున శిశిరఋతువునందు జలి దుర్భరము కావున నక్కడ నివసించువా రా దివసముల మంటలు వేసుకొని రాత్రులు పుచ్చుచుందురు. ఈ యగ్నుల వెలుగుదప్ప వారి గృహముల నితర వెలుంగులు గానరాకుండును. పేదరికమున కాలవాలమైన నా 'మార్గదర్శకు'లకు క్రొవ్వువత్తులు, కెరుసిను నూనెలు. విద్యుచ్ఛక్తి యేడినుండివచ్చు? దేహప్రాణముల గాపాడికొన నుపయుక్త మగు సామగ్రిదప్ప మఱొండు వారి కలవడ నలవిలేకుండెను. దేవు డిచ్చిన మహాటవి దమపొంతనె యుండ వారికి గట్టియలకు గరవుగాదు. ఎంత మంట గావలయు నంతమంట ప్రజ్వరిల్ల జేయ వారి కుపకరణము లుండును. కావున నీజ్వాలలప్రకాశంబె వారిపనులకెల్ల జాలియుండును.

ఇట్టి దీవియ ముంగల గూరుచుండి మన కథానాయక రత్నము చదువును. చెట్టపట్టలమీదను పలకబండలమీదను బొగ్గుతో వ్రాయుచుండును. శీతకాలమున మంచు గురియు వేళల దానిపై నొక కాష్టముతో దననామము లిఖించును. వేసవికాలమున దోటలోనికిబోయి యిసుకనేలన నభ్యసించును. ఈవిధమున శ్రద్ధజేసి వ్రాతపనియం దెంతో ప్రావీణ్యము నొందెను. గొప్పవారి కెంతటి కష్టతమము లగుస్థితిలును నాటంకములు గాజాలవు. చూచితిరే!

థామసు లింకను మంచి వేటకాడు. అతని నివాసస్థలమును వేటకు దగినదియే. చుట్టుప్రక్కల దట్ట మైన యడవియుండుట జేసి యత డనేక మృగముల బక్షులగొట్టి భోజనమునకు వస్తువుల జేర్చగల్గెను.

ఆతనిగృహ మొక్కవిషయమున దక్క నెల్లవిషయంబుల ననుకూలముగ నుండెను. జలశూన్యం బొండు వారిగష్టముల బెట్టు ఆబ్రహాము సారాలు ప్రతిదినము నొక మైలుదూరమున నుండు బుగ్గకుపోయి పానీయంబు గొనివచ్చుచుండిరి. ఈ లోపము దరువాత నేదో యొకతెఱంగున దీసివేయబడెను.

ఇక నా సీమయందలి జనులస్థితి జూచితిమేని యందనేకులు సురకుదాసులు. సుర యన నమృత మని యర్థము సేయువారును, సురాపానము పూర్వాచారమునకు వ్యతిరేకము గాదని వాదించువారును, ఔషధతుల్యముగ గొంచెము గ్రహించిన నేమిగాగల దనువారును, మన దౌర్భాగ్యమున కానవాలుగ నిప్పుడు దేలుచున్నారు. జీర్ణకోశము మాడ్చివేసి పలురోగములకు బాలుచేసి నడయాడు శవంబుల జేయు ద్రవాకారం బగు దుష్టభుజంగ మవిష మల్లనల్లన దేహమున బ్రసరించుట నెఱుంగ నేరని మతిభ్రమణుల నా కోలాహలహరణుండగు నీశ్వరుండ మరల్చుగాక. ఓ మహనీయులారా! ఆబ్రహాము తల్లి స్నేహితదోషము దన కుమారు నంటునేమోయను భయంబున నతని కప్పుడప్పుడు చెప్పిననీతి వినుడు. ఆఘనుడు లోకమున బేరుగాంచి వెలుగుతఱి మత్తు పదార్థముల దాకకూడ దను ప్రతిన నడపునెడ "మనుష్యులు దాగుట కారంభింతురు గాన ద్రాగుబోతు లగుదురు. ఎప్పటికిని ద్రాగకుండువా డెన్నటికిని ద్రాగుబోతు గాజాలడు" అని నాతల్లి నాకు బోధించెనని చెప్పును. బొత్తుగ ద్రాగనివారిని, ద్రాగకుండుట యను ప్రతిన వట్టినవారిని నామె యెన్నడు గనివిని యుండలేదు. అయినను నెద్ది యీరోగమునకు దివ్యౌషధంబొ యెద్ది యీరావణునకు రామాస్త్రంబొ నద్దాని నామె గుర్తించి కుమారునకు దెల్పుట యామె సూక్ష్మదృష్టియు నామె దోషాదోషవివేచనజ్ఞానంబును వేనోళ్ల వెల్లడి చేయుచున్నది.

ఈవిషయమును మఱియొక యంశము దెలుపుడు చేయుచున్నది. ఓహీయోలో నష్టమైన సారాయివిషయ మొకరోజు నాంసీ థామసులు చర్చించుచుండిరి. వారిచర్చ గొంచెము పరిశీలించిన జాలు. "కొంతసారాయి నా నదీగతంబు సేసి దైవము మనకు దోడ్పడియెను. ఎందరో పిల్ల లాదుష్టవస్తువు దగ్గరదీసి కుటుంబనాశన మొనరించి యున్నారు. ఎల్లరకు మేలుగోరు దైవము మనకెప్పుడు సాయమొనర్చు. అట్టి వస్తు వింట నుండుటయె హానికరంబు. ఉన్న కొంచెము నమ్మివేసితిమి. వగపిక పనిలేదు." అని సంతసించిరి.

1817 వ సంవత్సరపు వేసవి సనియె. లింకనుల యొంటరి తన ముదుప వారి స్నేహితులు స్పారోలు అచట నివసింప నేతెంచిరి. స్పారోగారి భార్య నాంసిపెంపుడుతల్లి. వారు వచ్చినతోడనె లింకనుల మొదటిగృహ మగు పందిలియందు బససేసిరి. స్పారోగారి భార్య బెట్సి డెన్నిస్ హాంక్సును బెంచు చుండెను. కావున నతడును వారివెంబడి వచ్చిచేరెను. అతనిరాక యాభ్రహామునకు మిక్కిలి యానందమియ్య నొకరి కొకరు మిత్రులయి యన్యోన్యముగ మెలగుచుండిరి.

నాల్గవ ప్రకరణము

దుఃఖ దినములు.

తమ మందిరమున నున్నపుస్తుక త్రయంబులును జదివి చదివి క్రొత్తపుస్తుకముల వాసన గానక ఆబ్రహాము వేసారెను. ఉన్న వాతనికి గంఠోక్తిగ వచ్చిపోయెను. నూతన గ్రంథములు చిక్కునా యను చింత యతని హత్తియుండెను. ఇట్టితరుణమున నాతని దృష్టి మరల్చు విషయ మొకటి కడుదు:ఖకరం బగునది సంభవించెను. ఇరుగుపొరుగుల 'స్తన్యరోగ' ఋజ యొండు ప్రబల నారంభించెను. మనుష్యులును పసువులును నద్దాని వాతబడి మరణ మొందిరి. సమీపించి సమీపించి స్పారోల భార్యాభర్తల నది తాకెను. లింకను లడలిపోయిరి. వైద్యు లనేకమైళ్లు గడచినంగాని కానవచ్చుటలేదు. కావున నీ 'మార్గదర్శకుల'యందు స్త్రీలు రోగుల మేలుకీళ్లరసి వారికి దగుసాయ మొనర్చుచుందురు. నాంసీకి దల్లిదండ్రులం బోలు స్పారోలు రోగపీడితులగుట చూచి యామె చాల దు:ఖించి వారిని దమ కుటీరమునకు దీసికొనివచ్చి పరిచర్య లొనర్చు