ఆంధ్ర రచయితలు/వేలూరి శివరామశాస్త్రి

వేలూరి శివరామశాస్త్రి

1892

తల్లి: శ్రీవిశాలాక్షి. తండ్రి: వేంకటేశ్వరావధానులు. గ్రామము: చిరివాడ (కృష్ణామండలము). జననము: 1892 సంవత్సర ప్రాంతము. కృతులు: ముద్రితములు- 1. సోముడు లేక ఉత్తరహరివంశ విమర్శము (1919లో విరచితము) 2. ముక్తాలత ప్రబంధము. (1910 లో విరచితము) 3. తాలుకుట్టనము (విమర్శనము 1913 విర) 4. తెనాలి శతావధానము, కొవ్వూరు, చట్రాయి, తెనాలి, బెజవాడ, గుంటూరు కాలేజీ శతావధానములు. 5. కృతకసూత్రము (ఖండకావ్యము, 1910) 6. మాధవవర్మ (నాటకము) - 1920 ముద్రితము. 7. ఉపగుప్త. 8. బిడాలోపాఖ్యానము (పద్యకథ, 1911 ముద్రి.) 9. ఆత్మకథ (మహాత్మా గాంధీ జీవితము. వచనానువాదము 2 సంపుటములు) 10. కథలు - గాథలు (రవీంద్రుని వంగభాషలోని ' కథా ' యను గ్రంథమున కనువాదము 1940 ముద్రి.) 11. ఏకావళి (ఖండకావ్య సంపుటి. 1940 ముద్రి.) 12. రాముని బుద్ధి మంతనం. 13. సర్వేసు వీలునామా. 14. తీరనికోరికలు. 15. బాపనపిల్ల. (ఈ నాలుగును శ్రీ శరచ్చంద్రుని నవలల కనువాదములు.) 16. కథాషట్కము. 17. కథాసప్తకము.

శివరామశాస్త్రిగారు కావ్యరచనలో గథారచనలో గ్రొత్తవాటములు తీసిన గొప్ప రచయితలు. ఆంగ్ల వాజ్మయమున, సంగవాజ్మయమున, పరాసు వాజ్మయమున వా రెక్కడలేని గ్రంథములును జూచిరి. సంస్కృతమున జెప్పనేల ! వ్యాకరణము, న్యాయము, వేదాంతము గురుకుల క్లిష్టులై యధ్యయనముచేసిరి. ఆంధ్రవిషయమున వారి కృషి గూర్చి వేఱే వ్రాయను. శతావధానములు పలుచోటుల బోటీగా జేసిరి. ఆశుకవిత్వములు 'నీవా ? నేనా ? యని ప్రదర్శించిరి. ప్రబంధములు, ఖండకావ్యములు నవీన రీతులలో సంతరించిరి. సంగీ తము గురుముఖమున నేర్చికొని, రాగధోరణిని పద్యములు చదువుచు మధువు లొలికించిరి. నేడును శివరామశాస్త్రిగారు సూరవరపు దోటలో నిల్లు కట్టుకొని యున్నారు. అపుడపుడు పత్త్రికలలో బద్యములు, కథలు, సాహిత్య విమర్శములు వెలువరించుచున్నారు. నడుమ నడుమ సభలలో బాల్గొని, తీయని గొంతెత్తి విసరుచున్నారు. కాని, మానసికముగాను, కాయికముగాను పూర్వోత్సాహము, పూర్వదార్డ్యము తఱగి "తేహినో దివసా గతా:" అనుకొనుచు గాలక్షేపము చేయుచున్నారు. శాస్త్రిగారి జననము 1892 లో. అనగా నీరచన నాటికి వారి కేబది యేడవయేడు సాగుచున్నది. 1926 వ. సంవత్సరము శాస్త్రిగారి జీవికలో నొక పెద్ద మార్పు తెచ్చినది. ముప్పది నాల్గేండ్ల వయస్సు దాటిన తరువాత నున్న శివరామశాస్త్రిగారు వేఱు. దానికి గారణము క్రమముగా ముందు దెలిసికొందము.


శివరామశాస్త్రిగారు కలిగిన కుటంబములోని వారు. వీరి పూర్వులెల్ల మంచి శిష్టులు. వీరి తండ్రిగారు వేంకటేశ్వరావధానులుగారు. తగిన గురువులతో గావ్యనాటకాదులు పఠించి, సిద్ధాంత కౌముది నధ్యయనించి శ్రీ జయంతి భగీరథ శాస్త్రిగారి సన్నిధిని 'వ్యాకరణ మహాభాష్యము' పాఠము చేసికొనిరి. ఈలోపుననే తర్క వేదాంత గ్రంథములు కొన్ని సందర్భము ననుసరించి యాయా పండితులకడ జదివిరి. శ్రీ భగీరథశాస్త్రిగారి గురుత్వమే శివరామ కవికి బేర్కొనదగినదైనది. భార్యతో గాపుర ముండి 'యింజరము' లో భగీరథ పండితునికడ మహాభాష్యము చదువుకొనుట, శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి గురుత్వమున సాహిత్యపు బొలుపులు, శతావధానపు మెలకువలు తెలిసికొనుట, శివరామశాస్త్రిగారి విద్యార్థి దశలలోని విశేషములు. పేరునకు విద్యార్థి యన్నమాట గాని, యప్పటి కప్పుడే శివరామశాస్త్రి మంచిపండితుడై, మంచి కవియై చాలగ్రంథములు రచించెను, రచించుచుండెను. వేంకటశాస్త్రిగారి వెనుక సభలకు, సంస్థానములకు, శతావధానములకు దిరుగుచు ముందునకు వచ్చెను. వచ్చి 'గుంటూరు కళాశాల' లో బ్రతిజ్ఞజేసి 'నహిప్రతి' యన్నట్లు శతావధానము గావించెను. అప్పటికి శివరామకవి కిరువదియేండ్లు దరిలో నుండును. 1911 సంవత్సర ప్రాంతము. తిరుపతివేంకటకవులకు, కొప్పరపు సోదరకవులకు వాగ్యుద్ధములు జరుగుచున్న సమయ మది. తిరుపతి కవులకు శిష్యుడగుట శివరామకవ్ గురువిరోధుల నెదురుకొని యిట్లు సింహగర్జనము గావించెను-


మ. అనిమిత్తంబుగ గాలుద్రవ్విన త్వదీయా హంత నాపుం దలం

పున నీ నీరస నిర్గుణాశుకవనంబుంజెప్పి నిన్గెల్వ నెం

చిన యస్మద్గురువర్యులన్ సుకవితా శ్రీ ధుర్యులన్ మానిపిం

చి నినున్ గెల్వగ వచ్చినా నిదె సభం జేయింతువో ? వత్తువో ?


గుంటూరు కళాశాలలో నేర్పాటు చేయబడిన యవధాన మప్పటి పరీక్షార్థమే. నిరాక్షేపముగ శతావధానము కొనసాగినది. సభాసదులు సెబాసనిరి. గురువులు తిరుపతికవులు శిష్యుని శివరామకవి ని మెచ్చి యిటులు దీవన లిచ్చిరి-


మ. జగతీనాథులు పెక్కుమంది ముదితస్వాంతంబునం గాన్కలం

పగ సాంగంబు సలక్షణంబుగ శరద్ద్వావింశతిం బేర్మి హె

చ్చగ మాయేలిన యీవధాన కవితాసామ్రాజ్య భారంబు మో

యగ బూసంగదవయ్య! తండ్రి! శివరామయ్యా! చిరంజీవియై


శా. బాల్యోద్రేకముమై నెదిర్చితివి కొప్రంపుంగవిన్ గ్రంథసా

కల్యంబుం బొనరింతో లేదొయని నీకై కొంకు నస్మ న్మన

శ్శల్యం బిప్పటి కూడదీసితిని వత్సా! సత్సభాశోభివై

కళ్యాణంబుల బొందుమయ్య! యికవీకన్ శిష్యచూడామణి! దానితో వేలూరికవి తెలుగువారికి బహుధా ప్రశంసనీయుడయ్యెను. క్రమముగ దెనాలి, బెజవాడ, కొవ్వూరు, చట్రాయి మున్నగు పలుతావుల నవధానములు గావించెను. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి ప్రధాన శిష్యులలో నొకరుగ బ్రకటకీర్తి నందెను. 1915 లో వ్యాకరణము ముగించి యింజరనుండి చిరివాడ చేరికొనెను. ఇంజరములో నున్నప్పటి వీరిచరిత్రము వినదగినది కలదు.


సదాచారసంపన్నుడగు నొకబ్రాహ్మణ కుమారుడు పెండ్లి చేసికొనుటకు డబ్బులేక తంటాలు పడుచుండెను. అప్పుడతనికి దమయింటగల బంగారునగ నమ్మివైచి వివాహమునకు వలసినంతసొమ్ము నొసగెను. అట్టియుదార హృదయ మాయనది. శతావధానము నభ్యాసము చేయుట కింజరములో నూఱుగురు పృచ్ఛకులు దొరకుదురా ? పెద్ద మామిడితోటలోనికి బోయి, యొకమిత్రునిచే బ్రశ్నము లన్నియు గాగితపుముక్కలపై వ్రాయించి కొమ్మలకు గట్టించి పద్యములు చెప్పుచుండు వారు. అట్టి ధారణాబల మాయనది.


చిరివాడ చేరికొని వ్యాకరణము గ్రంథములు పాఠము చెప్పుచు బద్మపురాణము నాంధ్రీకరించు కొనుచు, నాంగ్లము పఠించుచు శాస్త్రిగారు రెండేండ్లు గడపిరి. ఆంగ్ల, పరాసు భాషాగ్రంథములు చదువ జదువ సాధారణమైన తెలుగు కవితపై మన శాస్త్రిగారి కొకవిధమగు నేవము కలిగినది. అపుడు యతిప్రాసములు విడిచిపెట్టి మహాభారతములో నాది సభాపర్వములు, షేక్‌స్పియరు ననుకరించి, పదినాటకములు ఋగ్వేద ఋక్కులు కొన్నియు దెనుగులో వ్రాసి వెనుదిరిగి చూచుకొనిరి. ఆవిప్లవ మాయన యంతరాత్మకే నచ్చలేదు. అప్పుడ నిబంధనములు విడువక 'మణిమేఖల' యను నే డాశ్వాసముల ప్రబంధము రసభావ బంధురముగ రచించిరి. అందలి కవిత్వపు సొగసున గూర్చి, నాడు విన్న వారివలన వినుకలియేగాని యా గ్రంథ మిపు డుత్సన్నమై పోయినది. 'మణిమేఖల' రచించుకాలముననే 'సాహిత్య దర్పణము' సగము, 'రసగంగాధరము' 1 ఆననము, 'ధ్వన్యాలోకము' సంపూర్ణముగను దెనిగించియుంచిరి. పై గ్రంథములెల్ల 'మణిమేఖల' తో పాటు పెట్టెలో బెట్టుకొని యేలూరు శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రులవారి స్మృతి సభకువెళ్ళి యటనున్నపుడు, మకాములో గల యాపెట్టె ధనాశచే రాత్రి దొంగలెత్తుకొని పోయిరట. అది మొదలు శివరామకవికి గొంతరోత కలిగినది. ధైర్యముతో గానీ యనుకొని పిదప వంగ వాజ్మయము చదివెను. పరాసు గద్యవాజ్మయము చూచెను. చదివి చూచి యప్పుడే యించుమించు నూఱుకథలు, ఆఱు చిన్ననాటకములు సంఘటించెను. సాంఖ్య, న్యాయ, వై శేషిక దర్శనములు చదివి భాష్యములతో దెనిగించెను. యోగవాశిష్టము నిర్వాణప్రకరణము వఱకు ననువదించెను. వేదాంతమునకు సంబంధించిన వేవేవో చిన్నచిన్న పుస్తకములు వ్రాసెను. పద్మపురాణమున గొన్ని ఖండ లపుడు వ్రాతలో నున్నవి. ఆసమయములో గ్రంథభాండారముతో నిండిన వీరి యింటిపై నలిగి యగ్ని మండిపడినది. సంస్కృతాంధ్రాంగ్లాది భాషలకు సంబంధించిన గ్రంథము లెన్నో వీరి భాండారమున నున్నవి. శివరామశాస్త్రిగారు నిత్యమక్కడనే కూర్చుండి ప్రతిగ్రంథము చదువుచు జదివిన గ్రంథముపై దమ యభిప్రాయము వ్రాసి యా గ్రంథములోనే పెట్టి యుంవ్హువారట. ఆయా గ్రంథములు తాము రచించి, యచ్చు వేయింత మనుకొనుచున్న గ్రంథములు సమస్తము 1926 సంవత్సరములో నగ్ని కాహుతియై క్షయించినవి.


ఈ పద్యము చదువుడు:

క. క్షయ వత్సరమున నాతప

భయమగు వైశాఖ కృష్ణపక్షంబున మా రయ దినమునన్ ద్వితీయో

దయమున జిరివాడ యెల్ల దగ్ధంబాయెన్.

శివరామకవి నెత్తురుజుక్కలైన తన గ్రంథము లట్లు భస్మమైనపుడిటులు వగచెను:


ఉ. పెంచితి బెద్దచేసితిని : ప్రీతియుతంబుగ రాణివాసమం

దుంచితి రాజయోగ్యకును మోపవనంబులు క్రుమ్మరిల్ల ని

ర్మించితి విస్మరించితిని మేదిని మింటిని నొక్కపెట్ట న

ర్పించితి నిన్ను నగ్గికిని బెన్‌బలిగా గవితాసరస్వతీ!


ఉ. కాల్చితి విల్లు సర్వమును గాల్చితి పాత్రము లూచుముట్టుగా

గాల్చితి వెల్లయున్ ధనము కాల్చితి వెల్లయు ధాన్యరాసులన్

గాల్చితి వున్న వెల్లయును గాల్చిన గాల్చితికాక గ్రంథముల్

కాల్చిననీకు నోజ్వలన ! కడ్పది నిండెనొ ? కాలునిండెనో ?


సీ. ఋగ్వేదమా ! యష్టదిగ్వీథులను నన్ను

గన నెంతయడలితో కాలు నపుడు

వేదాంతమా ! నన్ను వీక్షింప యోగదృ

జ్మతి నెంతపూనితో మాడు నపుడు

వ్యాకృతీ ! యలయజ్ణుగంతమౌ 'దృశి' నెంత

వఱపితో నాకయి చరమవేళ

కవితాకుమారి ! నన్ గనుపొంటె నెన్నిము

ఖాల్‌దు:ఖించితో క్రాగుతఱిని


గీ. కట్ట ! సాహితిరో నన్ను గౌగిలింప

నెంత చేతులు చాపితో యేమనందు

నన్ను గంకాళమును జేసి చన్న వారె

పుస్తకములార ! విజ్ఞానపుటములార ! అంతనుంది శివరామకవి యుత్సాహము సన్నగిల్లెను. అగ్నిప్రమాదమున కొకసంవత్సరము వెనుకనే యేకాంతవాసము కోరి మనశాస్త్రిగారు సూరవరమున నొకతోటకొని యం దిల్లుగట్టి నాలుగేండ్లం దొంటరిగ నుండిరి. మొదటియింటిపై నగ్ని కోపించినతరువాత భార్యతో దోటయందే కాపురము స్థిరపడెను. ఏకాంతవాసమున కీకవి యిటులు పలవరించును:


ఉ. ఏయొకరుండు లేని యొక యేటినమీపతలంబునం దర

ణ్యాయతనంబునందును దటాకతటంబున యందు దోటయం

దా యతశైలశృంగమునయందు జనించు మహావనీజమం

దూయెల యొండు నాసనము నొండును దప్పక నాకుగావలెన్.


శివరామ శాస్త్రిగారు వ్యుత్పత్తియు ప్రతిభావమునుగల కవి. భావనలో వారికి దీటు వచ్చువారు నేటివారిలో దక్కువగనున్నారు. "ఒక్కభాషగాదు తక్కినభాషల నన్నిగూడ నేర్వుమయ్య యాంధ్ర" యని ప్రబోధించి యన్యవాజ్మయము లెన్నిటి తోడనో పరిచయము గలిగించుకొన్న కవివరుడాయన. రవీంద్రుడు వంగభాషలో రచించిన 'కథా' యను గ్రంథమును 'కథలు, గాథలు' అనుపేరు పెట్టి తెనిగించెను. శ్రీ శరచ్చంద్రుని నవల లెన్నో తెలుగులోనికి మార్చెను. పరాసు వాజ్మయపు బోకడలతో గథలు వచనమున వందలు వ్రాసెను. అన్నిరచనలయందు దెలుగు స్వతంత్రతను ముద్రించుకొనెను గాని, యనువాదము లనిపించునట్లు రచింపలేదు. తెలుగు పలుకు చదువని యాంధ్రు నీ కవిగారు సహింపక యీ విధముగ నిలువదీయుచున్నారు.


క. తెలివికి సంస్కృతమున్ మఱి

కలిమికి నాంగ్లేయమో యింకం దురకంబో విలువ యిడి నేర్చి యీ నీ

తెలుగెవ్వరి పాలు చేసి తిరిగెద వాంధ్రా !


శివరామ కవిగారు 'పురాణ మిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవ మిత్యవద్యమ్‌' అను సిధాంతము కలవారు. వేదఋక్కుల నుండి, యుపనిషత్తులనుండి వాక్యము లెత్తిచూపి, నేటి 'భావకవిత్వ' మనబడు నుత్తమజాతి కవితతో వాణికి సామరస్యము చూపుదురు. ప్రాచీనాలంకారికులు పేర్కొనిన భావధ్వని - రసధ్వని యను వానికి నేటి భావకవితకు సాజాత్యము సప్రమాణముగ జూపి, యట్టి కవిత యిప్పటి వారిలో దక్కువమంది కలవడినదని వీ రందురు. ఆంధ్ర భాషలో నేడు పొడముచున్న విప్లవము లన్నియు శివరామశాస్త్రి గారికి గ్రొత్త లనిపించవు. వీరి మనస్సులో నాంధ్ర కవిత్వముపై నెన్నో తడవలు విప్లవభావములు పుట్టినవి. అవి కార్యరూపమును గూడదాల్చినవి. యతి ప్రాస బంధములతో కవిత్వము వ్రాయుటయే గాక, ప్రాచీన ధోరణితో అష్టాదశ వర్ణనములతో బ్రబంధము వ్రాయుటయు నీయన మనస్సునకు నచ్చినది కాదు. "ముక్తాలత" కల్పిత కావ్యము 1910 లో రచించెను. "అందు వచ్చు పాత్రలు ముగ్గురు. శమజయంతు లిరువురు సహాధ్యాయులు, చెలికాండ్రు. వారిలో శముడను వానిని 'ముక్తాలత' యను వారకామిని కామించెను. అదియెఱిగి ముక్తాలతపై మనసుంచుకొని జయంతుడు శమునిజంపెను. మనమెందులకని ముక్తాలత మడిసెను. దానితొ జయంతుడును బ్రాణములు విడిచెను." ఈ కల్పనము మన పూర్వ కావ్యసంప్రాదాయమునకు విరుద్ధము. 'మాధవవర్మ' యను నాటకమును వీరు విషాదాంతముగా రచించిరి. ఈరకముగ బాశ్చాత్య సంప్రదాయములు మన తెలుగులో నెన్నియో జొనిపి 'శివరామశాస్త్రి కూడ విప్లవకారు' డన్న పేరు కొన్నారు. శాస్త్రిగారికి గల యీ సంస్కృతిభావములకు గురువు లొకరు లేరు. ఆంగ్ల, వంగాది భాషా గ్రమ్య్హావలోకనమే యక్కడ ముఖ్యకారణము. అది యటుండె, ఈయనకు జాలకళలలో జక్కని యెఱుక యున్నది. సంగీత మెఱుగుదురని వ్రాసియుంటిని. అభినయ కళలో బ్రవేశ మున్నది. నాటకము లన్నను, చలన చిత్రములన్నను మక్కువ చూపుదురు. 'జయాపిల్ముస్‌' వారి 'జరాసంధ' కు కథాసంవిధానము గావించినది వీరేగదా ? ఇంక కథారచనములో జెప్పవలసినపుడు వీరు సిద్ధహస్తు లనవలయును. ధ్వని ప్రాయము నున్న వారి పలుకుబళ్ళు కథలలోసైతము కావ్యత్వమును స్ఫురింప జేయుచుండును. సాధారణముగ వీరి కథలెల్ల సలక్షణ భాషలోనే వడచినవి. ప్రతి కథ యందును; సాహిత్య వాసన యుండును. భావగంభీరత యుండును. కథా కల్పనము విషయమున నీయనను మించినవారు నేడు కొందఱున్నారుగాని, వచన రచనా విషయమున నీయనను---వారు నా దృష్టిలో మిక్కిలి తక్కువ. భాష సలక్షణ మగుటయు, భావము గంబీర మగుటయు, బలుకుబడి మితముగా నుండుటయు, ధ్వనికి బ్రాధాన్య మిచ్చుటయు, వీరి వచనములోని ప్రచురగుణము మచ్చున కొక కథలోని పంక్తులు పది తీసి చూపెదను.


. ............. ................ ................... ................... .................... ................... .................... ..................... (పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) చెను. నాలో నేనే దహించుకొని పోయితిని. నా కీ జగతి యంతయు నిస్సారముగా దోచెను. ధర్మారెడ్డి చిత్తరువేని లేనియెడల నామేడ చవుటిదిబ్బగా నుండెడిది. ఒక రేయి యంతయు నేనాచిత్తరువు నెదుట నుంచుకొని కూరుచుంటిని. కొంతసేపు దానితో వినోదించితిని. క్రమక్రమముగా నాకనులవెంట బాష్పములు స్రవించినవి. తెల్లవారు లటులే కూరుచుంటిని. అపుడు మయూరము లొకటొకటి లేచి స్తంభమెక్కి కూయదొడగెను...నేను స్వప్నమున ధర్మారెడ్డి కొక ఉత్తరమును వ్రాసితిని. వ్రాతకుపకరణము కలముకాదు. వ్రాత కుపయోగించినది కాగితమును గాదు. ఇచ్చ నా మానసముమీద నన్ను కరగించి కరగించి కరకకాయ సిరాచేసి అక్షరములుగా పోసినది. అపుడు ధర్మారెడ్డి నాలో ఒకభాగముగా నుండెను. గాన దానిని పఠించెను....'క్షమాపణ' కథ 'భారతి' ప్రభృతులగు పత్త్రికలలో వెలువరింపబడిన వీరి కథానికలు కుప్పనగూరలు. వానినెల్ల సంపుటీకరించి ప్రచురించుట తెలుగుబాసకు గడు మేలుసేత.

వ్యావహారికముకూడ శాస్త్రిగారు తఱచు వ్రాయుచుందురు. శ్రీ శరచ్చంద్రుని చిన్ననవలలు వాడుకభాషలోనే వ్రాసినారు. ఏమివ్రాయనిండు, ఏభాషలో వ్రాయనిండు, తీరుతియ్యములు గల నిండు దెలుగులో రసవిలసితముగ వ్రాసి పాఠక హృదయముల వలవైచి లాగుదురు.

గాంధిమహాత్ముని


................. ................. .................... ...................... .................... (పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) నెక్కడలేని యెఱుకయు నున్నది. కాని, వానికన్నిటికి ననురూపమైన--కాదు వారి సాహిత్యసేవ. యౌవనము ధారవోసి వ్రాసినగ్రంథములెన్నో మసియైపోవుటయు దొంగలెత్తుకొని పోవుటయు జరిగి శాస్త్రిగారి యుత్సాహ మాడనిబాడెను. ఇప్పటికి బది పండ్రెండేండ్లనుండియు హృదయ దౌర్బల్యముపొడమి మఱింత దిగాలుగనున్నారు. అయినను, ఓపిక వచ్చినపుడెల్ల గథయో, కావ్యమో, వ్యాసమో వ్రాసి తెలుగు వారికి విందు లొనర్చుచునే యున్నారు.


శ్రీ శాస్త్రిగారి ఖండకావ్యసంపుటము 'ఏకావళి' లోని పదములు అను శీర్షికతో నున్న పద్యములలో నొకపద్యము చిట్టచివర స్మరణకు దెచ్చుకొని చాలించెదను.


సీ. వీణియపై జేయి వేయదు వాగ్దేవి

మానైజ సంగీతమహిమ వించు

వలినాననుని నాల్గువగుమోము లెక్కడె

క్కడసంచుమాకు స్వాగత మొసంగు

మౌనవర్యులు మనోమందిరంబుల యందు

నలరింత్రు మాకు సింహాసనంబు

కవిరాజ లమృతంబు కడగాల బెట్టి మ

మ్మాదరింతు- భావమేదురముగ

................................... ........................ ....................... .................. .................... (పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)