ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగం 2022-23

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్,

గౌరవనీయ ఆర్థిక శాఖామాత్యుల వారి ప్రసంగం

మార్చి 11, 2022

గౌరవనీయ అధ్యక్షా!

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదించబోతున్నాను.

1. ప్రప్రథమంగా నేను ప్రఖ్యాత కవి తిరువళ్ళువార్ సూక్తులను ఈ గౌరవ సభకు గుర్తు చేయదలచు చున్నాను.

“గొప్ప పాలకులు అనబడేవారు
అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా
ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు.
వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉంటూ
ఎన్ని అడ్డంకులు ఎదురైనా
ధర్మ పథం మరియు న్యాయ మార్గాల నుండి వైదొలగరు.
ఆత్మ గౌరవంతో, దయతో కూడిన ధైర్యంతో
ముందుకు సాగుతారు."

2. ఈ వాక్యాలు శతాబ్దాల అనంతరం ఒక్కసారిగా వచ్చిన విపత్తును ఎదుర్కొనే విషయంలో మన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కోవిడ్ మహమ్మారి అనంతర పరిణామాల నుండి బయటపడే క్రమంలో మన ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి మరియు శ్రేయస్సు మార్గంలో నడిపించడం ద్వారా మరింత విజ్ఞతను ప్రదర్శిస్తోంది.

అభివృద్ధి విధాన రూపకల్పనలలో మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఏర్పాటు, జీవనోపాధికి మద్దతు మరియు సామాజిక భద్రత అనే ఈ నాలుగు మూల స్తంభాలపై ఆర్థికశాస్త్ర ప్రామాణిక నమూనాలు దృష్టి సారిస్తాయి. ఈ నాలుగే అమలుపరచగలిగే విధానాలు. ఇవి సుపరిపాలనతో కలిపి, స్థిరమైన ఆర్థిక వృద్ధికి ఆధారం కల్పిస్తున్నాయి. ఇందులోని అంతర్లీన సూత్రం ఏమిటంటే, పౌరులు తమ అంతర్గత సామర్థ్యాన్ని గ్రహించే అవకాశాలను ఈ నాలుగు మూల స్తంభాలు కల్పిస్తున్నాయి.

3. ఈ నాలుగు మూల స్తంభాలు తూర్పు ఆసియాలోని అధిక పనితీరు గల ఆర్ధిక వ్యవస్థలతో సహా నేడు అన్ని అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి మార్గాలకు ఆధారం. అంటే, 2016 నాటి ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలే (ఎస్.డి.జి.లే) కాక ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ల వంటి సంస్థల యొక్క ఇతర నివేదికలు కూడా ఈ మూలస్తంభాలపైనే ఆధారపడి ఉంటాయి.

4. రాష్ట్ర అభివృద్ధి పునాదులను నిర్మించడానికి మన ప్రభుత్వం ఈ నాలుగు మూల స్తంభాల విధానాన్ని స్వీకరించింది. మనరాష్ట్ర ప్రజలందరికీ వారి జీవితాలను మరియు జీవనోపాధిని నిర్మించుకోవడానికి సమాన అవకాశాలను అందించడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి మన ప్రభుత్వం యొక్క అన్ని విధానాలు ఈ నమూనాను దృష్టిలో ఉంచుకునే తయారు చేయబడ్డాయి అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు నవరత్నాల ఏకీకరణ

5. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 ఎస్.డి.జి.లను దృష్టిలో ఉంచుకుని మన ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు మరియు మ్యానిఫెస్టోలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించబడ్డాయని తెలియజేసుకుంటున్నాను. ఇందుమూలంగా, మన రాష్ట్రం వివిధ అభివృద్ధి సూచికలలో స్థిరమైన పెరుగుదలను చూడగలిగింది. నీతి ఆయోగ్, ఎస్.డి.జి. ఇండియా 2020-21 నివేదిక ప్రకారం, 'పేదరిక నిర్మూలన', 'స్వచ్ఛమైన నీరు మరియు పారిశుధ్యాన్ని పెంపొందించడం', 'లింగ సమానత్వం', 'చౌకగా సుస్థిర శక్తి వనరులను అందించడం' మరియు 'సముద్ర, జలజీవుల పరిరక్షణ' వంటి ఎస్.డి.జి.లలో మన రాష్ట్రం మొదటి 5 స్థానాలలో ఉంది.

6. ఎస్.డి.జి.లు విస్తృతమైన నమూనాను కలిగి ఉన్నాయని మన ప్రభుత్వం గుర్తించింది. అంతేగాక అట్టడుగు వర్గాల భాగస్వామ్యం మరియు సమాజ వికాసం లేకుండా ఈ ఎస్.డి.జి.లను సాధించవచ్చని అనుకోవడం అసాధ్యం కూడా. గ్రామ మరియు వార్డు సచివాలయాలు, వాలంటీర్ నెట్ వర్క్ మరియు రైతు భరోసా కేంద్రాల వంటి బలమైన స్థానిక సంస్థలను నిర్మించడం, విద్య మరియు ఆరోగ్య వ్యవస్థల భారీ ఆధునీకరణ మరియు మహిళా స్వయం సహాయక సంఘాలను ఇంతకు ముందుకన్న అధికంగా బలోపేతం చేయడం ఈ పనితీరుకు గల కారణాలని తెలియజేస్తున్నాను. వికేంద్రీకృత పాలనపై సమగ్ర దృష్టిని సారిండం ద్వారా, క్లిష్టమైన ఎస్. డి.జి.ల సూచికలలో కూడా మన ప్రభుత్వం అద్భుతమైన పనితీరు సాధించగలిగింది.

7. నీతి ఆయోగ్ తన 'ఎస్. డి.జి. నివేదిక' లో ఎస్.డి.జి.లను అవుట్ కమ్ బడ్జెట్ స్టేట్ మెంట్ నమూనా (OBS) తో అనుసంధానం చేయాలని సిఫార్సు చేసింది. నిర్దిష్ట సమయంలో ఈ ప్రమాణాలను సిద్ధం చేసుకోవడం, పర్యవేక్షించడం మరియు మదింపు చేయడం కోసం ఎస్.డి.జి.లను అవుట్ కమ్ బడ్జెట్ స్టేట్ మెంట్ తో విజయవంతంగా ఏకీకృతం చేయడంలో మనదేశంలోని అన్ని రాష్ట్రాలలోను మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మానవ సామర్థ్య అభివృద్ధి

8. 'పేదరికం మరియు ఆకలి నిర్మూలన', 'మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును సాధించడం', 'నాణ్యమైన విద్య కలిగి ఉండడం మరియు లింగ సమానత్వాన్ని సాధించడం' అనే ఎస్.డి.జి.లను మొదటి అభివృద్ధి మూల స్తంభం అయిన 'మానవ సామర్థ్య అభివృద్ధి’ కలిగి ఉంటుంది.

9. విద్య మరియు ఆరోగ్యం మన ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యత. నాడు-నేడు వంటి మన ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ విద్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. జగనన్న అమ్మ ఒడి, గోరు ముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, మరియు వసతి దీవెన, వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ, వై.ఎస్.ఆర్. వైద్యశాలలు, వైద్య కళాశాలలు, ఆరోగ్యశ్రీ మరియు ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాలు, 'మానవ సామర్థ్యాల అభివృద్ధి' పై దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్ర మానవ వనరుల నాణ్యతను మెరుగుపరచడానికి మరియు అత్యున్నత నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్యం మరియు పోషకాహార సేవలను ప్రతి ఒక్కరికీ అందించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి.

10. ఈ కార్యక్రమాల విజయం ద్వారా నీతి ఆయోగ్ యొక్క 'బహుళ పేదరిక నివేదిక (MPI) లో మన రాష్ట్రం ఉన్నత స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ యొక్క 2021 ఎస్.డి.జి.ల నివేదిక ప్రకారం పేదరికం తగ్గింపులో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా, మన రాష్ట్రంలో ఇప్పుడు శిశు మరియు కౌమార దశలోని పిల్లల మరణాలు 2% కంటే తక్కువగా ఉన్నాయి. బాలింతల ఆరోగ్య రక్షణలో రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. విద్యలో కూడా మనం పాఠశాల హాజరును 98% కంటే ఎక్కువగా సాధించాము. స్థూల నమోదు నిష్పత్తి (GER) రేటు కూడ షెడ్యూల్డ్ కులాల విషయంలో 7.5% గాను, షెడ్యూల్డ్ తెగల విషయంలో 9.5% గాను, బాలికల విషయంలో 11.03% గాను పెరిగి, జాతీయ పెరుగుదల రేటును అధిగమించింది.


మౌలిక సదుపాయాల అభివృద్ధి

11. స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం, సరసమైన మరియు స్వచ్ఛమైన ఎనర్జీ (శక్తి) ని అందుబాటులో ఉంచడం, స్థిరమైన నగరాలు మరియు సంఘాలను ప్రోత్సహించడం మరియు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లాంటి ఎస్.డి.జి.లు రెండవ మూలస్తంభమైన 'మౌలిక సదుపాయాల అభివృద్ధి క్రిందకే వస్తాయి.

12. నాడు-నేడు కార్యక్రమాలు, కొత్త వైద్య కళాశాలల కల్పన, వై.ఎస్.ఆర్. జలయజ్ఞం, వై.ఎస్.ఆర్. జల కళ, రహదారుల అభివృద్ధి, కొత్త ఓడరేవులు మరియు నౌకాశ్రయాల ఏర్పాటు, వ్యవసాయం మరియు పాడిపరిశ్రమలో మార్కెట్ మౌలిక సదుపాయాల కల్పన, ఫైబర్‌నెట్ మరియు పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా సమాజ ఆస్తులు మరియు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నది. జగనన్న కాలనీలు, వై.ఎస్.ఆర్. హౌసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా అందరికీ ఇళ్లు అందించడంపై మన ప్రభుత్వం దృష్టి సారించింది. నీతి ఆయోగ్ యొక్క 2021 బహుళ పేదరిక నివేదిక ప్రకారం, గృహ సౌకర్యాలు కలిగిన జనాభా శాతం పరంగా మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని గౌరవ సభకు తెలియచేసుకుంటున్నాను.

13. నాడు-నేడు కార్యక్రమాలను భారీ స్థాయిలో అమలు జరపడం ద్వారా అంగన్ వాడీలు, ఆసుపత్రులు మరియు పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పనలో చారిత్రక నిర్లక్ష్యాన్ని మరియు తీవ్రమైన లోపాలను అధిగమించడానికి ఒక అవకాశం కల్పించబడింది. నీతి ఆయోగ్ యొక్క ఎస్.డి.జి.ల నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 100% కుటుంబాలకు విద్యుత్ అందించబడింది. అంతేగాక వీరంతా శుభ్రమైన వంట నూనెలను ఉపయోగిస్తున్నారు కూడా. మన రాష్ట్రంలో 91% కంటే ఎక్కువ పాఠశాలలలో గల భవన ప్రాంగణాలు, త్రాగునీరు మరియు విద్యుత్ తో కూడిన ప్రాథమిక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయని కూడా ఈ నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు కంటే ఇది 7% ఎక్కువ. ఆరోగ్యం విషయంలో, 99.5% కంటే ఎక్కువ కాన్పులు సంస్థాగతమైనవే, అనగా ప్రాథమిక లేదా జిల్లా వైద్య కేంద్రాలలో జరపబడినవే. అంతేగాక మన రాష్ట్రం వైద్యులు, నర్సులు మరియు ఇతర వైద్య సహాయ సిబ్బందితో కూడి 2వ అతిపెద్ద వైద్య సిబ్బందిని కలిగి ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది. ఇది మన ఆరోగ్య మౌలిక సదుపాయాల పటిష్టతను చూపుతుంది.

జీవనోపాధి

14. మూడవ మూల స్తంభం అయిన 'జీవనోపాధి కల్పన' అనేది 'సముచితమైన పని” మరియు “ఆర్థిక వృద్ధికి అవకాశం కల్పించడం' వంటి ఎస్. డి.జి.లను కలిగి ఉంటుంది.

15. జీవనోపాధిలో వ్యవసాయం మరియు పాడిపరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను మన ప్రభుత్వం గుర్తిస్తూ, వెనుకబడిన మరియు పురోగామి అనుసంధానాలను ప్రోత్సహించే సమగ్ర కార్యక్రమాలను ఆమోదించి అమలుపరుస్తోంది. వై.ఎస్.ఆర్. రైతు భరోసా, వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్. జల కళ, ధరల స్థిరీకరణ నిధి, గోదాములు, వై.ఎస్.ఆర్. అగ్రి-టెస్టింగ్ ల్యాబ్‌లు, ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ సౌకర్యాలు మరియు అధిక మొత్తంలో పాల శీతలీకరణ కేంద్రాలు మరియు ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ వంటి వివిధ పథకాల ద్వారా 62% జనాభాకు జీవనోపాధిని అందించే వ్యవసాయ రంగాన్ని మన ప్రభుత్వం సమగ్ర దృష్టితో అమలు చేస్తోంది. 'అమూల్ తో భాగస్వామ్యం' పాడి పరిశ్రమకు ప్రాధాన్యతనిచ్చి అనుబంధ గ్రామీణ ఆదాయాలకు ఒక ముఖ్యమైన వనరుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నది.

16. 5వ ఎస్.డి.జి. అయిన 'లింగ సమానత్వం' తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంతో కూడిన చారిత్రాత్మక లింగ అసమానతలను సరిదిద్దవలసిన ఆవశ్యకతను సూచిస్తుంది. ఈ రెండింటినీ అనగా మహిళల సామాజిక, ఆర్థిక సాధికారత మరియు వ్యక్తిగత గౌరవంతో కూడిన కుటుంబ ఉన్నతిని తీసుకు వస్తుందనే నమ్మకానికి మన ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉంది. మన ప్రభుత్వం యొక్క వై.ఎస్.ఆర్. ఆసరా మరియు వై.ఎస్.ఆర్. చేయూత కార్యక్రమాలు మరియు స్వయం సహాయక బృందాలలోని మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి మూలధనాన్ని సమకూర్చడంలో ముందుంటాయి. తద్వారా మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రస్తుతం ఉన్న 35.5% కంటే తప్పకుండా పెంచుతాయి కూడా. చివరగా, వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం, వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం, వై.ఎస్.ఆర్. వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు మరియు వై.ఎస్.ఆర్. లా నేస్తం కార్యక్రమాలు నిర్దిష్ట వృత్తి వర్గాలకు జీవనోపాధిని అందిస్తాయి.

17. డిజిటల్ మరియు రవాణా వ్యవస్థల అనుసంధానం అనేది ఆర్థిక వృద్ధికి పునాదిగా ఉంటుంది. భారత ప్రభుత్వ మద్దతుతో, రహదారుల నిర్మాణం మరియు గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను అందుబాటులోకి తీసుకు వెళ్లడం కోసం మన ప్రభుత్వం భారీ కార్యక్రమాలను ప్రారంభించింది.

సామాజిక భద్రత

18. నాల్గవ మరియు చివరి మూల స్తంభం - 'సామాజిక భద్రత'. ఇది 'అసమానతలను తగ్గించడం' మరియు 'ఆకలిని, పేదరికాన్ని నిర్మూలించడం' అనే ఎస్.డి.జి.లను కలిగి ఉంటుంది.

19. చివరి మూల స్తంభం అయిన 'సామాజిక భద్రత' లోని భాగమైన వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక క్రింద వివిధ అణగారిన మరియు బలహీన వర్గాలకు మన ప్రభుత్వం విస్తృతమైన సామాజిక భద్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దాదాపు 61.74 లక్షల మంది పింఛనుదారులకు నెలకు 2,500 రూపాయలు చొప్పున పింఛను అందిస్తోంది. ఇది వృద్ధాప్య పింఛనుదారులకు, వితంతువులకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, A.R.T. చికిత్స తీసుకునే HIV వ్యాధిగ్రస్తులకు మరియు సాంప్రదాయ చెప్పులు కుట్టేవారికి అందించే అత్యంత ప్రగతిశీల భద్రతా కార్యక్రమం. అంతేకాకుండా, వికలాంగుల, ట్రాన్స్ జెండర్ల, డప్పు కళాకారుల మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల గౌరవప్రదమైన జీవితానికి భరోసా ఇవ్వడానికి మెరుగైన పింఛన్లను కూడా మన ప్రభుత్వం అందిస్తోంది.

20. ప్రపంచ బ్యాంకు మరియు అభిజిత్ బెనర్జీ మరియు ఎస్తేర్ డుప్లో వంటి ప్రఖ్యాత ఆర్థికవేత్తలు సూచించిన విధంగానే, కరోనా మహమ్మారి సమయంలో కూడా మన ప్రభుత్వం రాష్ట్ర పేదలకు నగదు బదిలీలను అందించింది. ఈ నగదు బదిలీ విధానం అర్థవంతమైన ప్రభావాన్ని చూపే స్థాయిలో జరిగింది. అంతేగాక ప్రజలు వారి జీవనోపాధిని కోల్పోయే సమయంలో, మరింత పేదరికంలోకి వెళ్ళిపోకుండా ఈ పథకం నిరోధించగలిగింది.

రాష్ట్రంలో 4 మూల స్తంభాల అమలు

21. ఈ నాలుగు మూల స్తంభాల లక్ష్య సాధనకు, వివిధ పథకాలను అమలు చేయడం మరియు సుపరిపాలనను అందించడం ద్వారా మన ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. చాలా సంవత్సరాలుగా మానవ వనరుల కొరతను వివిధ శాఖలు ఎదుర్కొంటున్నాయి. మన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను విడుదల చేయడం మరియు పారదర్శక నియామక ప్రక్రియల ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నియామకం చేపట్టింది. గ్రామ మరియు వార్డు సచివాలయాలు మరియు ఇటీవల ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ 2.0 ద్వారా, పాలనను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రం ప్రత్యేక స్థానం పొందింది. మన ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వార్షిక క్యాలెండర్ ఆధారంగా ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీపై దృష్టి సారించి, వివిధ ప్రభుత్వ ప్రయోజనాలను సకాలంలో అందజేయడంలోని లోటుపాట్లను తొలగిస్తోంది. జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరిస్తూ, సామాజిక అభివృద్ధిలో మరియు ఇళ్లలో వారి కీలక పాత్రను దృష్టిలో ఉంచుకుని, మన ప్రభుత్వ కార్యక్రమాలు మరియు పథకాలను బాలికలు మరియు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించడం జరిగింది. చివరగా, నిబద్ధత, విశ్వసనీయత, పారదర్శకత మరియు విశ్వాసం అనే లక్షణాల ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మరియు సుస్థిరమైన అభివృద్ధి సాధిస్తూ అధిక ఆర్థిక వృద్ధి చెందే దిశగా మన ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

22. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన భారీ ప్రతికూలతతో కూడిన దిగ్ర్భాంతిని అధిగమించడానికి మన రాష్ట్రానికి ఈ విధానం అమలు ఎంతగానో సహాయపడింది. గౌరవనీయ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ధృఢమైన నాయకత్వంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి బడుగు బలహీన వర్గాల జీవితాలను మరియు జీవనోపాధిని రక్షించడానికి మన ప్రభుత్వం అనేక అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారి ఉన్న సమయంలో గౌరవనీయ ముఖ్యమంత్రిగారు తరచుగా సమీక్షలు జరిపారు. వారి నిర్విరామ కృషికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు, ప్రజారోగ్యం, రెవెన్యూ మరియు ఇతర శాఖల సిబ్బంది కృషి వలన మన రాష్ట్రం ఈ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోగలిగింది.

23. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, మన రాష్ట్రం దాదాపు 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రజలకు అందించింది. ఈ సంఖ్య రాష్ట్ర జనాభా కంటే దాదాపు రెట్టింపు అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. లాక్ డౌన్ మరియు ఇతర అంతరాయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్ర ప్రజలకు విస్తృతమైన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నగదు ప్రయోజనాలను అందించగలిగింది.

24. నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో సూచించిన ఇతర పథకాల అమలు ద్వారా ఎస్.డి.జి.లను సాధించాలనే తపన మరియు అలుపెరగని కృషి మన రాష్ట్రాన్ని శ్రేయస్సు మార్గంలో ఉంచాయి. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చూపుతున్న తపన, రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి జీవితాన్ని మెరుగుపరిచే దిశగా కొనసాగుతుంది. ఈ క్రింది పంక్తులు మన గౌరవనీయ ముఖ్యమంత్రిగారి స్వభావాన్ని తెలియజేస్తాయి.

నిశ్చిత్వాయః ప్రక్రమతే నాన్తర్వసతి కర్మణాః!
అవస్థ్యకాలో వశ్యాత్మా సా వై పాండితాచ్యతే॥


ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే,

ఎవరైతే ఒక సంకల్పానికి ముందు దృఢ నిబద్ధతను కలిగి ఉంటారో,
ఎవరైతే అవిశ్రాంతంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారో, ఎవరైతే తమ విలువైన సమయాన్ని వృధా
చేయరో, ఆ వ్యక్తి
మనసు మీద నియంత్రణ కలిగి ఉంటారు.

2022-23 ఆర్థిక సంవత్సరంగాను ప్రతిపాదించిన బడ్జెట్ కేటాయింపులను సభ అనుమతికై సమర్పిస్తున్నాను.

వ్యవసాయం

25. వ్యవసాయం కేవలం ఆహార ఉత్పత్తి చేసే కార్యకలాపం మాత్రమే కాదు, మన జనాభాలో 62% మంది జీవనోపాధి భద్రతకు వెన్నెముక మరియు పర్యావరణంతో మానవుని అనుబంధానికి నిదర్శనంగా నిలిచి ఉంది. అందువలన ఇది మూడవ మరియు నాల్గవ మూల స్తంభాలకు మరియు ఎస్.డి.జి.ల సాకారానికి ముఖ్యమయినది. మన సమాజంలోని రైతుల ప్రధాన పాత్రను తెలియజేయడానికి మహా కవి శ్రీశ్రీ వ్యాఖ్యలలో...

“పొలాల నన్నీ,
హలాల దున్నీ
ఇలా తలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ" -- మహా కవి శ్రీశ్రీ

రైతే దేశానికి వెన్నెముక. ఈ కారణంగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి రైతు పక్షపాత ధోరణిని వారసత్వంగా మన ప్రభుత్వం కొనసాగిస్తుంది.

డాక్టర్ వై.ఎస్.ఆర్. రైతు భరోసా - పి.ఎం. కిసాన్ యోజన

26. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి, ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా 20,117.59 కోట్ల రూపాయలు రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలో జమ చేయబడ్డాయి. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ పథకం ద్వారా అందించబడే 6,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుండి రైతుల బ్యాంకు ఖాతాలకు 7,500 రూపాయలు జమ చేయబడుతున్నాయి. అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలవారికి చెందిన ఒక లక్షా 67 వేల భూమిలేని కౌలుదారుల మరియు అటవీ హక్కుల గుర్తింపు చట్టం క్రిందకు వచ్చే (ROFR) కుటుంబాలకు 13,500 రూపాయల చొప్పున రాష్ట్ర బడ్జెట్ నుండి ప్రత్యేక బడ్జెట్ అందించబడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ, సకాలంలో ఆర్థిక సహాయం విడుదల చేయడం వలన రైతులు వ్యవసాయ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించడం జరిగింది. 52.40 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు డాక్టర్ వై.ఎస్.ఆర్. రైతు భరోసా-ప్రధాన మంత్రి కిసాన్ యోజన కోసం 2022-23 సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. ఉచిత పంట బీమా

27. మన ప్రభుత్వం 'ఇ-పంట నమోదు' అనగా ఇ-క్రాప్ రిజిస్ట్రేషన్ ఆధారంగా వై.ఎస్.ఆర్. ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఫలితంగా, ఇ-క్రాప్ కింద నమోదు చేసుకున్న రైతులందరూ స్వయంగా ఉచిత పంట బీమా పథకం క్రిందకు వస్తారు. నీతి ఆయోగ్ మన కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరించదగిన ఆదర్శ నమూనా కార్యక్రమంగా గుర్తించింది. 2019 ఖరీఫ్ సీజనులో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 29.05 లక్షల మంది రైతులకు 3,707.02 కోట్ల రూపాయల బీమా క్లెయిమ్ లను, గత ప్రభుత్వ బకాయిలతో సహా చెల్లించడం జరిగింది. వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకం కోసం 2022-23 లో 1,802 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాలు

28. 2019-20 రబీ కాలంలో మరియు 2020-21 ఖరీఫ్ కాలంలో తీసుకున్న ఒక లక్ష రూపాయల వరకు ఉ న్న పంట రుణాల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరములో 12 లక్షల 30 వేల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు 207.72 కోట్ల రూపాయల వడ్డీ రాయితీలను మన ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలలోకే జమ చేయడం జరిగింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండీ, గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన బకాయిలతో సహా 65.01 లక్షల మంది రైతుల ఖాతాలలో 1,185 కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేయడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు

29. గ్రామ సచివాలయాల విస్తరణలో భాగంగా మన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముందుగా పరీక్షించిన నాణ్యమైన మూల వనరులను సరఫరా చేయడం ద్వారా రైతు భరోసా కేంద్రాలు రైతులకు వివిధ సేవలను అందిస్తున్నాయి. అంతే కాకుండా ఇవి, 20 వేల రూపాయల వరకు నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతా తెరవడం, e-KYC ప్రక్రియను పూర్తి చేయడం, నగదు బదిలీల వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు, గ్రామ స్థాయిలో కొనుగోలు కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైతు భరోసా కేంద్రాల కోసం 18 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి

30. రైతులకు మద్దతు ధర అందించడంలో మార్కెటింగ్ శాఖకు కలిగే నష్టాలను పూడ్చేందుకు 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో విస్తృతంగా పండించే మిరపకాయలు, పసుపు, ఉల్లి, చిన్న మినుములు, అరటి, బత్తాయి వంటి మరో ఆరు రకాల పంటలకు మన ప్రభుత్వం కనీస మద్దతు ధరని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్ లో 1500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. వ్యవసాయ పరీక్షా కేంద్రాలు

31. రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందుల కొరతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, జూలై 8, 2021 న మొదటి దశలో 70 వ్యవసాయ పరీక్షా కేంద్రాలను స్థాపించడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలు రైతులకు మంచి నాణ్యమైన మూలవనరులను పొందడంలో సహాయపడుతున్నాయి. అలాగే, ఇవి పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి దోహదపడుతున్నాయి. మిగిలిన 177 పరీక్షా కేంద్రాలు నియోజకవర్గ స్థాయిలో 2022 ఖరీఫ్ కాలం నుండి పనిచేస్తాయి. వై.ఎస్.ఆర్. వ్యవసాయ పరీక్షా కేంద్రాల కోసం 2022-23లో 50 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

వ్యవసాయ యాంత్రీకరణ

32. మన ప్రభుత్వం ప్రతి వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రం వద్ద 10, 750 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను (CHC) ఏర్పాటు చేయడం ద్వారా, చిన్న మరియు సన్నకారు రైతులకు ఎటువంటి పెట్టుబడి మరియు నిర్వహణ భారం లేకుండా అద్దెకు వ్యవసాయ యంత్రాలను అందించడానికి, వరి పంట ప్రధానంగా ఉన్న ప్రాంతాలలో పంట కోతలో యాంత్రీకరణ సేవలను ప్రోత్సహించడానికి, 1615 క్లస్టర్ స్థాయి CHC లను పంటకోత యంత్రాలు అనగా కంబైన్డ్ హార్వెస్టర్లు, వరిగడ్డి బైలర్లు మొదలగు వాటితో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఉచిత మరియు రాయితీతో విద్యుత్ సరఫరా

33. మన ప్రభుత్వం వ్యవసాయ అవసరాల కోసం 19.64 లక్షల పంపుసెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తోంది. ఉద్యానవన మరియు నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్ ను మన ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇంతేగాకుండా ఆక్వా రైతులకు, యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నాము. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చేందుకు అయ్యే ఖర్చును కూడా మన ప్రభుత్వమే భరిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలను విద్యుత్ రాయితీ కొరకు ప్రతిపాదిస్తున్నాను.

పశు సంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమాభివృద్ధి

34. కోళ్ళ పరిశ్రమ, పాడిపరిశ్రమ, పశువుల పెంపకం మరియు మత్స్య పరిశ్రమలు వ్యవసాయ సమాజానికి అనుబంధ ఆదాయం అందిస్తూ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాథమిక జీవనోపాధిగా మారాయి. 2020-21 లో దేశంలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ మన రాష్ట్రం నిలిచింది. వై.ఎస్.ఆర్ పశు నష్ట పరిహార పథకం క్రింద 43,988 మంది రైతులకు ఆవు లేదా గేదె ఒక్కింటికి 30,000 రూపాయల చొప్పున మరియు గొర్రె లేదా మేక ఒక్కింటికి 6,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించడం కోసం 169.52 కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి. రైతుల యొక్క పశువుల వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడానికి, 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. అంతేకాకుండా, దేశంలోనే తొలిసారిగా 340 అంబులెన్లను కొనుగోలు చేయడం ద్వారా సంచార పశు అంబులేటరీ క్లినిక్లను ప్రారంభించడం జరిగింది.

35. మొత్తం చేపల ఉత్పత్తిలో 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి 29.40% వాటాతో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటూ, 16.5 లక్షల జనాభాకు జీవనోపాధిని కల్పిస్తోంది. భారత దేశ మత్స్య ఎగుమతులలో 36% వాటాను కలిగి మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా పథకం క్రింద చేపల వేట నిషేధ కాలంలో ఇచ్చే 4000 రూపాయల నష్ట పరిహారాన్ని 10,000 రూపాయలకు పెంచడం ద్వారా 97,619 మంది తీరప్రాంత మత్స్యకారులు లబ్ది పొందుతున్నారు. గ్రామ స్థాయిలో రైతులకు మూల వనరుల పరీక్ష సౌకర్యాలు కల్పించేందుకు మన ప్రభుత్వం 35 సమీకృత ఆక్వా ప్రయోగశాలను ఏర్పాటు చేస్తోంది. అదనంగా, సముద్రంలోని లోతైన ప్రదేశాలలో చేపల వేటను ప్రోత్సహించడానికి మరియు సురక్షితమైన బెర్తింగ్ సౌకర్యాలను అందించడానికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 8 చేపల వేట హార్బర్ నిర్మాణాన్ని మన ప్రభుత్వం చేపట్టింది. 2022-23 లో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖకు 1,568.83 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

ప్రజా పంపిణీ వ్యవస్థ

36. మన ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) క్రింద పౌరుల ఇంటి వద్దకే అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తోంది. 1.5 కోట్ల మంది రేషన్ కార్డ్ లబ్దిదారులందరికీ పారదర్శకమయిన, తిరిగి వేలం వేసే ప్రక్రియ ద్వారా కొనుగొలుచేయబడిన 9,260 సంచార పంపిణీ యూనిట్ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన యువత ఈ సంచార పంపిణీ యూనిట్లను నిర్వహిస్తున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద 'స్వర్ణ' మరియు 'సార్టెక్స్' రకాలకు చెందిన నాణ్యమైన బియ్యాన్ని అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది.

ఆరోగ్యం మరియు పోషకాహారం

“తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్” - మహాకవి గురజాడ అప్పారావు

37. మొదటి స్తంభమైన బలమైన 'మానవ సామర్థ్య అభివృద్ధి’ని సాధించడంలో మంచి ఆరోగ్య వ్యవస్థ కలిగిన సమాజం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. నీతి ఆయోగ్ వైద్య సూచిక 2021 నివేదికలో రెండేళ్ళ క్రితం 4వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం, నేడు దేశంలోనే 2వ స్థానానికి ఎదగడం ద్వారా మా ప్రభుత్వం యొక్క విశేష కృషి ప్రతిబింబించబడిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. నెట్ వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 919 నుండి 1,757కి పెంచడం, చికిత్సలను 1059 నుండి 2,446 కి పెంచడం ద్వారా, మరియు ఒక్కో కుటుంబానికి ఆదాయ పరిమితిని ఏడాదికి 5 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి 2019 లో వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించారు. 1,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చయ్యే అన్ని చికిత్సలు ఈ పథకం క్రిందకు చేర్చబడ్డాయి. QR కోడ్ తో కూడిన దాదాపు 1.4 కోట్ల వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కాలు పంపిణీ చేయబడ్డాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4వ విడత నివేదిక ప్రకారం 2019-20 లో 74.6% గా ఉన్న ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే కుటుంబాల శాతం 2021-22 నాటికి 91.27%కి పెరిగింది. 38. వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా పథకం క్రింద మా ప్రభుత్వం ఆపరేషన్ తరువాత రోగి కోలుకునే వ్యవధిలో రోజుకు 225 రూపాయల చొప్పున ఆపరేషన్ అనంతర జీవనోపాధి భత్యాన్ని రోగులకు అందిస్తుంది. డిసెంబర్ 2019 నుండి ఆరోగ్య ఆసరా కింద 8,83,961 కేసులకుగాను శస్త్రచికిత్స అనంతర జీవనోపాధి భత్యం కోసం 489.61 కోట్ల రూపాయలు అందించడం జరిగింది.

39. అదనంగా,కోవిడ్-19 బాధిత ప్రజలకు వారి ఆర్థికస్థితితో సంబంధం లేకుండా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవను అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. పది విడ్-19 చికిత్సలు మరియు కోవిడ్-19 అనంతర చికిత్సా విధానాలు వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం క్రింద చేర్చబడ్డాయి. కేవలం 2,09,765 మంది రోగుల చికిత్సకై ప్రభుత్వం 732.16 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం కోసం 2,000 కోట్ల రూపాయలను మరియు వై.ఎస్.ఆర్. ఆరోగ్య ఆసరా పథకానికి 300 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

40. 104 మరియు 108 సేవలు కూడా మన రాష్ట్రంలో పునరుద్ధరించబడ్డాయని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మండలానికి 1 చొప్పున 104 సంచార వైద్య వాహనాల యూనిట్ల సంఖ్య 292 నుండి 656 కి పెంచడం జరిగింది. వీటి ద్వారా ECG మరియు మందులతో సహా 29 రకాల పరికరాలతో అన్ని సాంక్రమిత మరియు అసాంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలతో సహా 20 రకాల సేవలను మన ప్రభుత్వం అందిస్తోంది. అదేవిధంగా, 108 అంబులెన్స్లో సంఖ్య 768 కి పెరిగింది. జనాభా పరంగా సంచార వాహనాల సంఖ్య నిష్పత్తి 1:1, 19,595 నుండి 1:74,609 కి మెరుగుపడింది. పట్టణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణా లోపాన్ని గుర్తించిన ప్రభుత్వం 120 పట్టణ స్థానిక సంస్థలలో 560 వై.ఎస్.ఆర్. పట్టణ క్లినిక్ లను మంజూరు చేసింది.

41. గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణా సౌకర్యాలను మెరుగుపరచడానికి, సీతమ్మపేట, పార్వతీపురం, ఆర్.సి.వరం, బుట్టాయిగూడెం మరియు డోర్నాలలో 5 మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులను మా ప్రభుత్వం మంజూరు చేసింది. పాడేరులో గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులను రెండేళ్లలోపు పూర్తి చేయాలనేది మా ప్రభుత్వం సంకల్పం.

42. పౌరుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంపై మన ప్రభుత్వం దృష్టి సారించిన ఫలితంగా, 2019 కి ముందు 108.25 కోట్ల రూపాయలుగా ఉన్న సగటు నెలవారీ వ్యయం జూన్ 2019 తర్వాత 203.68 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది 3వ ఎస్.డి.జి. అయిన 'మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు' సాధించడంలో మన ప్రభుత్వ పనితీరును మెరుగుపరిచింది.

వై.ఎస్.ఆర్. కంటి వెలుగు కార్యక్రమం

43. రాష్ట్రంలోని మొత్తం 5.6 కోట్ల జనాభాకు దశలవారీగా ఉచితంగా సమగ్ర నాణ్యమైన కంటి సంరక్షణా సేవలను అందించడానికి మన ప్రభుత్వం 'వై.ఎస్.ఆర్. కంటి వెలుగు' అనే సామూహిక కంటి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1వ మరియు 2వ దశలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలలోని విద్యార్థుల కంటి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆగస్టు 16, 2021 న 3వ దశలో “అవ్వ-తాత' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు కంటి పరీక్షలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నది. ఇప్పటి వరకు 16,64,919 మందికి కంటి పరీక్షల నిర్వహణ, 8,50,364 మందికి కళ్లద్దాలు అందజేత మరియు 1,55,473 మందికి కంటి శుక్లం శస్త్రచికిత్సలు చేయడం జరిగింది.

44. ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 15,384.26 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది 2021-22 సంవత్సర కేటాయింపుల కన్న 11.23% ఎక్కువ.

బాలల సంక్షేమం

“ఈ రోజు ప్రతి బిడ్డకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు,
ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రత హక్కు, గౌరవ హక్కు,
సమానత్వం మరియు శాంతి హక్కు కలిగి ఉండవలసిన సమయం ఇది.” - కైలాష్ సత్యార్థి


45. పోషకాహార నాణ్యతను పెంపొందించే దిశగా మన ప్రభుత్వం 77 గిరిజన ఉప ప్రణాళికా మండలాలలో వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ ప్లస్ ను, అదే విధంగా మైదాన ప్రాంతాలలో వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణను అమలు చేస్తోంది. ఈ పథకాల క్రింద అందించబడే గుడ్డు మరియు పాలు; గర్భిణీ స్త్రీలలో మరియు పాలిచ్చే తల్లులలోని రక్తహీనతను మరియు పిల్లలలోని పోషకాహార లోపాన్ని తగ్గించడానికి అవసరమైన ఐరన్, ప్రోటీన్లు మరియు ఖనిజ లవణాలను అందజేస్తాయి. ఈ సంపూర్ణ అనుబంధ పోషకాహార కార్యక్రమం ద్వారా, మొత్తం 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు, 6 నుండి 36 నెలల మధ్య వయస్సు గల 16 లక్షల మంది పిల్లలు మరియు 36-72 నెలల వయస్సు గల 13 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. మన ప్రభుత్వం ఈ పథకాలపై కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల కంటే 1,560 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చింది.

46. 3వ ఎస్.డి.జి. అయిన 'మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు' పై పురోగతికి సంబంధించి, 9 నుండి 11 నెలల మధ్య వయస్సు గల పిల్లలలో పూర్తి స్థాయి రోగ నిరోధక శక్తిని పొందే వారి శాతం 2014-15 లో 67% గా ఉన్నది. ఇది 2021-22 నాటికి 87% కి పెరిగింది. మాతా-శిశు మరణాల రేటు 2019-20 లో ఉన్న 74 నుండి 2021-22 లో ప్రతి లక్ష జననాలకు 59 కి తగ్గింది. 5 ఏళ్లలోపు మరణాల రేటు 2019-20 లో ఉన్న 41 నుండి 2021-22 లో ప్రతి 1000 సజీవ జననాలకు 14 కి తగ్గింది. నివేదించబడిన మొత్తం కాన్పులలో సంస్థాగత కాన్పుల శాతం అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా ఆరోగ్య కేంద్రాలలో జరిగిన కాన్పుల శాతం 2019-20 లో 67% ఉండగా, 2021-22 నాటికి 99.87%కి పెరిగింది.

47. 3-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల శారీరక, మానసిక విద్యాభివృద్ధికి పునాది వేయాలనే ఉద్దేశ్యంతో, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సవరించబడిన నర్సరీ విద్యా కరిక్యులమ్ తో మన ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలలను ప్రవేశపెట్టింది. ఆంగ్ల భాషపై దృష్టి సారించి అన్ని అంగన్ వాడీ కేంద్రాలలో ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2 తరగతులను ప్రవేశపెట్టారు. అంగన్ వాడీ కార్యకర్తలందరికీ కొత్త ప్రీ-స్కూల్ కరిక్యులమ్ లపై శిక్షణ అందించారు. మొత్తం 55,607 అంగన్‌వాడీ కేంద్రాలలో 27,620 అంగన్‌వాడీ కేంద్రాలు ఫౌండేషన్ పాఠశాలలుగానూ, 27,987 అంగన్‌వాడీ కేంద్రాలు ఉపగ్రహ ఆధారిత పాఠశాలలుగానూ పనిచేస్తున్నాయి.

48. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల బాధ్యతను కూడా మన ప్రభుత్వం స్వీకరించింది. ఒక్కో చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ పథకం క్రింద ఇప్పటివరకు 298 మంది పిల్లలు లబ్ది పొందడం జరిగింది.

49. కౌమార దశలో ఉన్న బాలికల మరియు స్త్రీల ఆరోగ్యం మరియు రుతుక్రమ కాలంలో వారి పరిశుభ్రతా అవసరాల కోసం, మన ప్రభుత్వం 'వై.ఎస్.ఆర్. స్వచ్ఛ' కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని క్రింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మంది కౌమార దశలోని బాలికలు లబ్ది పొందుతున్నారు. వీరికి నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ న్యాప్ కిన్లను మన ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతోంది.

మహిళా సాధికారత

“మహిళల సాధికారత అనేది ఉత్తమ కుటుంబమును,
ఉత్తమ సమాజమును, చివరికి ఉన్నతమైన దేశాన్ని తయారు చేస్తుంది" - డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం

50. అభివృద్ధి ఎజెండాలో మహిళలను కేంద్ర స్థానంలో ఉంచడం వలన సంస్థలు మరియు వాటి వనరుల నిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది. నీతి ఆయోగ్ సంస్థ ప్రకటించిన 5వ ఎస్.డి.జి.అయిన 'లింగ సమానత్వం' సూచీలో మన రాష్ట్రం కేవలం రెండేళ్ల కాలంలో 12 ర్యాంకులు మెరుగుపరుచుకుని 5వ ఉత్తమ స్థానాన్ని పొందింది. ఈ రెండేళ్ళలోనే ఈ సూచి 37 నుండి 58 కి పెరిగింది.

వై.ఎస్.ఆర్. ఆసరా

51. వై.ఎస్.ఆర్. ఆసరా పథకం క్రింద, 11.04.2019 నాటికి స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణ బకాయిలను సంక్షేమ శాఖల ద్వారా నాలుగు విడతలలో తిరిగి చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు 12,757.97 కోట్ల రూపాయలను విడుదల చేయడంవలన స్వయం సహాయక సంఘాలకు చెందిన 78,74,438 అర్హతగల సభ్యులు లబ్ది పొందారు. వై.ఎస్.ఆర్. ఆసరా పథకానికి 2022-23 సంవత్సరంలో 6,400 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ

52. స్వయం సహాయక సంఘాల మీద రుణాల వడ్డీ భారాన్ని పేదలకు తగ్గించేందుకు మన ప్రభుత్వం వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ చర్య గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని పేద స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసింది. 2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను 7,36,472 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు 1,789 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. 2022-23 సంవత్సరానికి వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకానికి 800 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. చేయూత

53. నవరత్నాల అమలులో భాగంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు అందించే 75,000 రూపాయల ఆర్థిక సహాయం కొనసాగించబడుతోంది. ఈ పథకాల క్రింద సుమారు 24.95 లక్షల మంది లబ్ధిదారులు వివిధ జీవనోపాధి కార్యకలాపాలను ఎంచుకోవడం జరిగింది. స్థిరమైన జీవనోపాధిని అందించడానికి హెచ్.సి.ఎల్., ఐ.టి.సి., పి అండ్ జి మరియు రిలయన్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా వివిధ దుకాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. 2022-23 లో, వై.ఎస్.ఆర్. చేయూత కోసం 4, 235.95 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను.

54. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 4,322.86 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. మన ప్రభుత్వం 2021-22 లో మొదటి సారి పిల్లలు మరియు జెండర్ బడ్జెట్ లను ప్రవేశపెట్టింది. 2022-23 కి సంబంధించిన చిల్డ్రన్ మరియు జెండర్ బడ్జెట్ యొక్క బుక్ లెట్లను గౌరవనీయుల సభ్యుల పరిశీలన కోసం ప్రవేశపెడుతున్నాను.

సంక్షేమం

55. మా నాల్గవ మూల స్తంభంలో పురోగతిని నమోదు చేయడానికి బలమైన సామాజిక భద్రతా వలయాన్ని నిర్మించడం అత్యవసరం. పేద, వెనుకబడిన మరియు బలహీన వర్గాల అవసరాలు మరియు ప్రాధాన్యతలను సమగ్ర వ్యూహంతో పరిష్కరించాలని ఇది పిలుపునిచ్చింది. నవరత్నాల క్రింద వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అల్ప సంఖ్యాక వర్గాల వారు మరియు సమాజంలోని ఇతర బలహీన వర్గాల వారి అభివృద్ధికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, జీవనోపాధి, నైపుణ్యం మరియు స్వయం ఉపాధి కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా గణించదగిన లక్ష్యాలను సాధించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

వై.ఎస్.ఆర్. పింఛన్ కానుక

56. సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకు, ముఖ్యంగా వృద్ధులు మరియు బలహీనులు, వితంతువులు మరియు వికలాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు మన ప్రభుత్వం సహాయం చేస్తోంది. వై.ఎస్.ఆర్. పింఛను కానుక క్రింద 61.74 లక్షల మంది పింఛనుదారులకు ప్రభుత్వం ప్రతినెలా పింఛన్లు అందజేస్తోంది. మన ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా, వృద్ధాప్య పింఛనుదారులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు మరియు A.R.T. చికిత్స పొందే HIV పింఛనుదారుల పింఛను మొత్తాన్ని 2,250 రూపాయల నుండి 2,500 రూపాయలకి పెంచింది. ఈ పెంపుదల డిసెంబర్ 2021 నుండే అమలులోనికి వచ్చింది. 2022-23 సంవత్సరానికి వై.ఎస్.ఆర్. పింఛను కానుక పథకం కోసం 18,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. బీమా

57. తమ కుటుంబ పెద్దను దురదృష్టవశాత్తు కోల్పోయే పేద కుటుంబాలను ఆదుకోవడానికి, మన ప్రభుత్వం వై.ఎస్.ఆర్. బీమా పథకం క్రింద 1.32 కోట్ల పేద కుటుంబాలకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. మన ప్రభుత్వం బ్యాంకుల ప్రమేయం లేకుండా జూలై 1, 2021 నుండి సొంత నిధులతో ఈ పథకం అమలును కొనసాగిస్తోంది. 2022-23 సంవత్సరానికి 372.12 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. వాహన మిత్ర

58. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం, సొంత యజమానులైన ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వై.ఎస్.ఆర్. వాహన మిత్ర మన ప్రభుత్వం అందిస్తోంది. ఈ కార్యక్రమం క్రింద 7.8 లక్షల మంది లబ్ది పొందారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 260 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం

59. చేనేత పరికరాలను ఆధునీకరించడానికి మరియు మర మగ్గాల రంగానికి పోటీగా స్వంత చేనేత మగ్గాలున్న ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం పథకం ద్వారా సంవత్సరానికి 24,000 రూపాయలు అందజేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం క్రింద 81,703 మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులు మరియు కాపు వర్గాలకు చెందిన నేత కార్మికులు లబ్ధి పొందారు. గత 3 సంవత్సరాలుగా మా ప్రభుత్వం అందించిన సహాయం ఫలితంగా, చేనేత కుటుంబాలవారు మర మగ్గాలు మరియు వస్త్ర పరిశ్రమకు పోటీగా కొత్త పద్ధతులలో నూతన నమూనాలతో నేయడానికి తమ మగ్గాలను ఆధునీకరించారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 200 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న తోడు

60. తోపుడు బండ్ల వారి ఆర్థిక కష్టాలను తీర్చడానికి మన ప్రభుత్వం, కేంద్రం పి.ఎం. స్వనిధి క్రింద ఇచ్చే సహకారంతో కలిపి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం జగనన్న తోడు పథకం క్రింద అందిస్తోంది. 2021-22 లో 86, 627 మంది షెడ్యూల్డ్ కులాల వారు మరియు 19,965 మంది షెడ్యూల్డ్ తెగల వారు ఈ పథకం క్రింద లబ్ధి పొందారు. ఈ కార్యక్రమం క్రింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో 14.16 లక్షల మంది ఆర్థిక సహాయం పొందారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 25 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న చేదోడు

61. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు మరియు కుట్టుపనివారికి సంవత్సరానికి 10,000 రూపాయలను జగనన్న చేదోడు పథకం ద్వారా మన ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇంతవరకూ 2,98,428 మంది లబ్ధిదారులకు 583.78 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 300 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం

62. అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులు కోసం 'ఇ.బి.సి. నేస్తం' క్రింద, 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సంవత్సరానికి రూ.15,000 చొప్పున సహాయం అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం క్రింద 3,92,674 మంది లబ్ధిదారులకు 589 కోట్ల రూపాయల విడుదల చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 590 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. లా నేస్తం

63. వై.ఎస్.ఆర్. లా నేస్తం క్రింద అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నాము. ఇప్పటి వరకు 23.7 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమం క్రింద పంపిణీ చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 15 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.ఎస్.ఆర్. కాపు నేస్తం

64. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా, మన ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు వై.ఎస్.ఆర్. కాపు నేస్తం క్రింద కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన 45- 60 సంవత్సరాల వయస్సు గల అర్హులైన మహిళలకు ఐదేళ్ల కాలవ్యవధిలో సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున మొత్తం 3,27,349 మంది లబ్ధిదారులకు గత రెండేళ్లలో రూ.982 కోట్ల ఆర్థిక సహాయాన్ని మన ప్రభుత్వం అందించింది. రాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వై.ఎస్.ఆర్. కాపు నేస్తం కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం

65. అల్పసంఖ్యాక వర్గాల వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలలో ఉపాధి అవకాశాల కోసం రుణ సదుపాయాలను కల్పించడం ద్వారా వారి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం జరుగుతోంది. స్వయం ఉపాధి కల్పన మరియు సాంకేతిక శిక్షణల ద్వారా నైపుణ్యాన్ని పెంచడానికి వారికి న్యాయమైన వాటా ఉండేలా మన ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మన ప్రభుత్వం నెలకు ఇమామ్ లకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయలు చొప్పున పెంచిన గౌరవ వేతనాన్ని అందజేస్తోంది.

66. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసం 18,518 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళికకు 6,145 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు 29,143 కోట్ల రూపాయలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 3,661 కోట్ల రూపాయల కేటాయింపులను నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా 2022-23 లో కాపు సంక్షేమానికి 3,537 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను.

విద్యారంగం

 
పరులకు సోదరులకు భూ
వరులకు గొనరాదు సర్వవశ్యము తానె
వ్వరి కిచ్చిన గోటి గుణా
త్తర వృద్ధి భజించు విద్య తన ధన మెపుడున్.

పంచిన కొద్దీ అనేక రెట్లు పెరిగేది ఒక్క విద్యాధనం మాత్రమే. చిన్నారుల చదువు కోసం పెట్టే ప్రతి రూపాయి రాష్ట్రాభివృద్ధికి తొలిమెట్టు అని మన ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.

67. మానవ సామర్థ్య వికాసానికి మొదటి మూలస్తంభం విద్య. నీతి ఆయోగ్ యొక్క 2021 బహు ముఖ పేదరిక సూచిక నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని జనాభాలో 2% కంటే తక్కువ మంది పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు.

జగనన్న అమ్మ ఒడి

అమ్మంటే అంతులేని సొమ్మురా...
అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా...
అమ్మ మనసున్న అమృతమే చూడరా...
అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా...

68. ఏ తల్లికీ బిడ్డలను చదివించేందుకు పేదరికం అడ్డుకాకూడదనే ఆలోచనతో మా ప్రభుత్వం జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మన ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున నేరుగా 44,48,865 మంది తల్లుల ఖాతాలలోకి చేర్చడం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తోంది. 2022-23 లో జగనన్న అమ్మఒడి పథకం కోసం 6,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను.

69. నాలుగు గోడలతో కూడిన భవనం రేపటి దేశ భవిష్యత్తును తనలో నింపుకుంటే దానిని పాఠశాల అని అంటారు. నాడు-నేడు కార్యక్రమం క్రింద, మొదటి దశలో 15,715 పాఠశాలలలో 10 మౌలిక సదుపాయాల ఆధునీకరణ పూర్తయింది. ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఫ్యాన్లు మరియు లైట్లు, త్రాగునీరు, పెయింటింగ్, అవసరమైన మరమ్మతులు, మంచి మరుగు దొడ్లు, ప్రహరీ గోడ, వంటగది మరియు ఇంగ్లీష్ ల్యాబ్ తో 10 రకాల మౌలిక సదుపాయాలను మా ప్రభుత్వం అందజేస్తోంది. రెండవ దశలో భాగంగా 16,368 పాఠశాలల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. మూడవ దశలో 24,620 పాఠశాలల ఆధునీకరణ చేపట్టనున్నాము. 2022-23 లో మన బడి, నాడు-నేడు కార్యక్రమాల కోసం 3,500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

70. పాఠశాల విద్యను మధ్యలోనే వదిలిపెట్టివేసే విద్యార్ధుల శాతానికి, విద్యార్ధులు ముఖ్యంగా బాలికల పాఠశాలలలో సరైన పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడానికి మధ్య సంబంధం ఉన్నదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం 15,000 రూపాయల అమ్మఒడి ఆర్థిక సహాయం నుండి 1,000 రూపాయిలను జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మరుగు దొడ్ల నిర్వహణ నిధికి కేటాయించడం జరిగింది. ఈ నగదు మొత్తం పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణ నిధికి బదిలీ చేయబడి, పాఠశాల అభివృద్ధి కమిటీల పర్యవేక్షణలో పాఠశాలలలో టాయిలెట్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది.

71. విజ్ఞాన సామర్థ్యాల అభివృద్ధిలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తూ, మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వం 45,484 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలలో చదువుతున్న సుమారు 37 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారమైన, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వేడి వేడి భోజనం అందిస్తోంది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా, స్వచ్ఛంద సేవకుల ద్వారా విద్యార్థుల ఇంటి వద్దకే పొడి రేషన్ పంపిణీ చేయబడింది.

72. జగనన్న విద్యా కానుక పథకం క్రింద 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పాఠశాలలలో మొట్టమొదటి రోజునే విద్యార్జన కిట్ లను అందజేస్తుంది. ఈ కిలో 3 జతల ఏకరీతి వస్త్రాలు, కుట్టు ఛార్జీలు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ సెట్, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్, 1 స్కూల్ బ్యాగ్, 1 బెల్ట్ మరియు 3 మాస్క్‌లు ఉన్నాయి.

73. విద్యారంగంలో మన ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల ప్రభావం నాణ్యమైన విద్య యొక్క 4వ ఎస్.డి.జి.లలో సాధించిన అద్భుతమైన పురోగతిలో ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక విద్యలో (1-8వ తరగతి) 2019-20లో 80.48% గా ఉన్న సర్దుబాటు చేయబడిన నికర నమోదు నిష్పత్తి 2021-22 లో 91.72% కి పెరిగింది. సెకండరీ స్థాయిలో (9-10వ తరగతి) 2019-20 నాటికి సగటు వార్షిక డ్రాపౌట్ రేటు 15.71% ఉండగా, 2021-22 లో 2.84% కి గణనీయంగా తగ్గింది. హయ్యర్ సెకండరీ విద్య (11-12వ తరగతి) లో 2014-15 లో 69% స్థూల నమోదు నిష్పత్తి (GER) ఉండగా ఇది 2021-22 లో 75.46% కి పెరిగింది. ఇంతేగాకుండా 94.56% పాఠశాలలలో విద్యుత్, త్రాగు నీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. సెకండరీ స్థాయి ఉపాధ్యాయులందరికీ 100% శిక్షణ ఇవ్వడం జరిగింది.

74. పాఠశాల విద్య కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 27,706.66 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సర కేటాయింపుల కన్నా 12.52% ఎక్కువగా ఉంది. జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన

75. ఉన్నత విద్యలో (18-23 సంవత్సరాలు) 2019-20 లో 32.4% ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (GER) 2021-22 లో 53.89% పెరిగింది. వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అందిస్తున్న మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ మరియు నిర్వహణ రుసుము స్థూల నమోదు నిష్పత్తిలోని ఈ పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న మొత్తం విద్యార్థులలో, 87% మందికి వారు కట్టిన ఫీజు 4,500 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. 2022-23 లో జగనన్న విద్యా దీవెనకు, 2,500 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెనకు 2,083.32 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

76. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారికి ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరచడానికి రాష్ట్రంలోని ఆశావహ జిల్లాలలో కొత్త మోడల్ డిగ్రీ కళాశాలలు స్థాపించబడుతున్నాయి. గిరిజన ప్రాంతంలోని బాలికలకు ఉన్నత విద్యనందించేందుకు అరకులో నూతన మోడల్ డిగ్రీ కళాశాలను నిర్మిస్తున్నాము.

77. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్య కోసం 2,014.30 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఈ కేటాయింపు జగనన్న విద్యాదీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాల క్రింద సంక్షేమ కార్పోరేషన్లకు కేటాయించిన మొత్తానికి అదనం.

గృహ నిర్మాణం

“పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టివిడుట కన్న పరగ చచ్చుట మేలు
విశ్వదాభిరామ వినురవేమ! -యోగి వేమన

అంటే అసాధ్యమైన పనికి సాధారణంగా పూనుకోకూడదు. ఒక వేళ పూనుకుంటే, ఎన్ని కష్టనష్టాలొచ్చినా మధ్యలో వదలక ఆ కార్యాన్ని నెరవేర్చాలి.

78. 2023 నాటికి రాష్ట్రంలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలకు సంతృప్త స్థాయిలో శాశ్వత గృహాలను అందించడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. రెండు దశలలో 28.3 లక్షల ఇళ్లను నిర్మించనున్నాము. 15.6 లక్షల ఇళ్లకు 28,084 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ మొదటి దశలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. వీటిలో వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలలో 11.44 లక్షల ఇళ్లు, సొంత స్థలాలలో మరో 4.16 లక్షల ఇళ్లు ఉన్నాయి. 15.6 లక్షల ఇళ్లలో, 10.88 లక్షల ఇళ్లు పునాది దశలో ఉండగా, 2.5 లక్షల ఇళ్లు కట్టుబడి దశలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్, మ్యాపింగ్ కు సంబంధించిన ప్రాథమిక కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. జియో ట్యాగింగ్ చివరి దశలో ఉంది. లబ్దిదారులకు మన ప్రభుత్వం 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తుంది. అదనంగా 3 శాతం వడ్డీ రేటుతో ఆర్థిక సంస్థల ద్వారా అదనంగా 35,000 రూపాయలను లబ్ధిదారులకు అందించబడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. 15.6 లక్షల గృహాల కొరకు మొదటి దశ నిర్మాణంలో 21.7 కోట్ల పనిదినాలు సృష్టించబడ్డాయని అంచనా వేయడం జరిగింది. ఇప్పటి వరకు భవన నిర్మాణ ఖర్చుతో సహా లబ్దిదారులకు 1,146.7 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2022-23 లో పేదలందరికి ఇళ్ల కోసం 4,791.69 కోట్ల రూపాయల కేటాయింపును గృహనిర్మాణ శాఖ కు ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

79. గృహనిర్మాణ శాఖ ద్వారా రుణాలు పొంది 2011 కి ముందు ఇళ్లు నిర్మించుకున్న లేదా ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల రుణాల మాఫీ కోసం మన ప్రభుత్వం 'వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని అమలు చేసింది. లబ్ధిదారులకు స్పష్టమైన టైటిల్ మరియు స్వాధీనపు హక్కుతో కూడిన పత్రాలను విడుదల చేయడం జరుగుతున్నది. ఇప్పటివరకు 8.56 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందారని ఈ గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

గ్రామీణాభివృద్ధి

“భారత దేశపు ఆత్మ గ్రామాలలో ఉంది” - మహాత్మా గాంధీ

80. స్వచ్ఛమైన మరియు ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని సృష్టించాలనే దృఢ సంకల్పంతో మన ప్రభుత్వం గ్రామీణ పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 'జగనన్న స్వచ్ఛ సంకల్పం - క్లీన్ ఆంధ్రప్రదేశ్' (CLAP) కార్యక్రమాన్ని - అక్టోబర్ 2, 2021న 'చెత్త రహిత-వ్యర్థ పదార్థాలు లేని దృశ్యపరంగా పరిశుభ్రమైన గ్రామాలను సాధించే లక్ష్యంతో 100 రోజుల పారిశుధ్య ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లో స్థిరమైన పారిశుధ్య పద్ధతులను పాటిస్తూ, గృహ వ్యర్థాలను సేకరిస్తూ, వాటిని వేరు చేస్తూ మరియు ప్రాసెసింగ్ చేస్తున్న 34,773 క్లాప్ మిత్రాలతో కూడిన 10,718 సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కేంద్రాలు ఉన్నాయి.

81. జగనన్న పల్లె వెలుగు ప్రాజెక్టు ద్వారా మెరుగైన వెలుతురు మరియు భద్రత కోసం మరియు శక్తి సామర్థ్యాన్ని నిర్ధారించడానికి కేంద్రీకృత నియంత్రణ మరియు నిర్వహణ వ్యవస్థ (CCMS) కు సంబంధించిన జంక్షన్ బాక్స్ ద్వారా అనుసంధానించబడిన 25.23 లక్షల ఎల్.ఈ.డీ. వీధి లైట్లను సంప్రదాయ వీధి లైట్ల స్థానంలో తిరిగి అమర్చడం ద్వారా 10,912 గ్రామ పంచాయితీలలో ఉన్న వీధి లైట్లు స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్ లకు మార్చబడ్డాయి.

82. 2021-22 లో, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 2,176 లక్షల పనిదినాలు కల్పించబడ్డాయి. ఈ పథకం క్రింద ఉపాధిని కోరిన వ్యక్తుల శాతంలో, ఉపాధిని పొందిన వ్యక్తుల శాతం 2019-20 లో 91.28% ఉండగా ఇది 2021-22 నాటికి 98% నికి పెరిగింది. 15 రోజులలోనే 99.41% చెల్లింపులు జరగడం గమనించదగిన విషయం. 2022-23 లో, ఈ పథకం క్రింద మూడు వేల లక్షల పని దినాలను కల్పించాలని మన ప్రభుత్వం భావిస్తోంది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం క్రింద 5,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

83. ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ మరియు నాబార్డ్ మద్దతు ఉన్న ప్రాజెక్ట్ అమలు ద్వారా మన ప్రభుత్వం అన్ని గ్రామీణ మరియు రోడ్డు అనుసంధానం లేని నివాస ప్రాంతాలకు అన్ని కాలాలను తట్టుకొనే BT మరియు CC రోడ్ కనెక్టివిటీని అందిస్తోంది మరియు గ్రామీణ రోడ్లను ఆధునీకరణ చేస్తోంది. 2021-22 లో 2,100 కి.మీ కంటే ఎక్కువ గ్రామీణ రోడ్లు ఈ ప్రాజెక్టుల క్రింద నిర్మించబడ్డాయి మరియు ఆధునీకరణ చేయబడ్డాయి.

84. ఒత్తిడితో కూడిన మరియు నాణ్యత లోపించిన 1249 నివాస ప్రాంతాలకు మంచినీటిని అందుబాటులోనికి తీసుకొని రావడానికి మన ప్రభుత్వం 3 త్రాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేసింది. చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మరియు కృష్ణా జిల్లాలలోని ఒత్తిడితో కూడిన మరియు నాణ్యత లోపించిన నివాస ప్రాంతాలకు కూడా నాణ్యమైన నీటిని అందుబాటులోనికి తీసుకురావడం జరుగుతుంది.

85. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రామీణాభివృద్ధికి 15,846.43 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.

పట్టణ అభివృద్ధి

86. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు సేవా స్థాయిలను మెరుగుపరచడం ద్వారా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు రక్షిత మంచినీటిని అందించడానికి మన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 86,356 మంచినీటి కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. 11వ ఎస్.డి.జి. అయిన 'సుస్థిర నగరాలు మరియు సంఘాలు’ క్రింద, 100% వార్డులలో ఇంటింటికీ చెత్త సేకరణ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ విధానంలో భాగంగా మునిసిపల్ వ్యర్థాలను తగ్గించడం, రీసైకిల్ చేయడం మరియు తిరిగి ఉ పయోగించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం 85 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ ను మంజూరు చేయగా 32 ప్రాజెక్ట్ కు ఇప్పటికే పని చేస్తున్నాయి. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న 93 పట్టణ స్థానిక సంస్థలలో 93 మురుగునీటి శుద్ధి ప్లాంట్ లను వచ్చే మూడేళ్లలో నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. 2019-20 లో ఉత్పత్తి చేయబడిన మొత్తం ప్రాసెస్ట్ మునిసిపల్ ఘన వ్యర్థ పదార్థాలు 48% ఉండగా 2021-22 లో ఇది 53.62% కి పెరిగింది. 2022-23లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 8,796.33 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పర్యావరణం మరియు అడవులు

“పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థ నిజంగా ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్నాయి.
పర్యావరణాన్ని పరిరక్షించలేకపోతే మనం మనుగడ సాధించలేము. - నోబెల్ గ్రహీత వంగరి మాతై


87. మన రాష్ట్రం సుసంపన్నమైన జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంది. దీనిని పెంపొందించు కోవడం మన అందరి బాధ్యత. రాష్ట్రంలో నమోదైన అటవీ ప్రాంతం మన రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 23%. జాతీయ అటవీ విధానం, 1988 కి అనుగుణంగా భౌగోళిక ప్రాంతంలో 33% పచ్చదనాన్ని మెరుగుపరచాలని మరియు పౌరులకు సుస్థిరమైన నివాస యెగ్య స్థలాన్ని సృష్టించాలని మన ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్య సాధనలో, ఈ సంవత్సరంలో, అన్ని ముఖ్య ప్రభుత్వ శాఖలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని, కాంపన్ సైటరీ ఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (CAMPA), మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), రాష్ట్ర అభివృద్ధి పథకాల మరియు కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి నిధులను సమకూర్చడం ద్వారా మరియు 9.39 కోట్ల మొక్కలు నాటడం ద్వారా జగనన్న పచ్చతోరణం క్రింద భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రయత్నం ఫలితంగా, ఇటీవల విడుదల చేసిన భారత దేశ అటవీ రాష్ట్ర నివేదిక 2021 ప్రకారం 647 చ.కి.మీ.ల మేర పచ్చదనాన్ని అదనంగా పెంచగలిగి భారతదేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయం.

88. స్మార్ట్, క్లీన్ మరియు హెల్త్ సిటీల కోసం పట్టణ మరియు పట్టణ శివారు ప్రాంతాలలో స్వచ్ఛమైన గాలి లభ్యతగల ప్రదేశాలను అందుబాటులోకి తేవడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నగరాలను అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి 'నగర వనం' పథకం అమలవుతోంది. 2022-23 లో పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక రంగాల విభాగానికి 685.36 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

నీటి వనరులు

89. మంచి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పారిశ్రామిక వృద్ధికి మరియు పర్యావరణ స్థిరత్వానికి కూడా నీరు ఎంతో కీలకం. నీతి ఆయోగ్, 6వ ఎస్.డి.జి. అయిన 'స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం' అనే అంశంలో ఆంధ్రప్రదేశ్ కు 4వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా, 'స్వచ్ఛమైన నీరు మరియు పారిశుధ్యం' కార్యక్రమానికి అనుగుణంగా, దాదాపు 97% పరిశ్రమలు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలను పాటిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సాగునీటి సౌకర్యాలు, త్రాగునీటి కల్పన, పరిశ్రమలకు భరోసా కల్పించేందుకు జలయజ్ఞం కింద చేపట్టిన భారీ ప్రాజెక్టులకు మన ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సమకాలీన సమాచారాన్ని ఈ గౌరవ సభకు అందించడం నాకు సంతోషంగా ఉంది.

90. పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది 2023 నాటికి దీనిని పూర్తి చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల పునరావాసంలో చురుకైన పురోగతితో పాటు పునరావాస మరియు పునర్నిర్మాణ కాలనీల నిర్మాణ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి.

91. వెలిగొండ ప్రాజెక్ట్ 1వ టన్నెల్ పూర్తయింది. నల్లమల సాగర్ రిజర్వాయర్ ఇప్పటికే పూర్తికాగా, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలోని కరువు పీడిత ప్రాంతాలకు వచ్చే ఖరీఫ్ లో రిజర్వాయర్ లో నీటిని నిల్వవుంచి అందించేందుకు పునరావాస మరియు పునర్నిర్మాణ పనులు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. పెన్నా డెల్టా వ్యవస్థ, కావలి కాలువ, కానుపూరు కాలువల క్రింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించేందుకు నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిపై ఉన్న సంగం మరియు నెల్లూరు బ్యారేజీలు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతానికి మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించడానికి, వంశధార ప్రాజెక్ట్ రెండవ ఫేజ్ లోని రెండవ స్టేజ్ మరియు వంశధార-నాగవళి అనుసంధాన ప్రక్రియను 2022 జూన్, నాటికి పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గండికోట రిజర్వాయర్‌కు అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు 2022 ఆగస్టు నాటికి అవుకు టన్నెల్ రెండవ దశను పూర్తి చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది.

92. అదనంగా, సెప్టెంబర్ 2020లో ప్రారంభించబడిన వై.ఎస్.ఆర్. జలకళ కార్యక్రమం క్రింద, మరింత సాగుకు యోగ్యమైన భూమిని సాగులోకి తీసుకురావడానికి అవసరమైన మరియు అర్హులైన రైతుల కోసం మన ప్రభుత్వం 9,187 బోర్ వెల్స్‌ను ఉచితంగా డ్రిల్ చేయించడం జరిగింది.

93. 2022-23 లో నీటి వనరుల అభివృద్ధికి 11,482.37 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు

94. చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు, ప్రజల జీవనోపాధికి మరియు మన 3వ మూల స్థంభానికి పునాదిగా నిలుస్తాయి. 8వ మరియు 9వ ఎస్.డి.జి.లు అయిన 'మర్యాద పూర్వకమైన పని' మరియు 'పరిశ్రమ, ఆవిష్కరణ మరియు మౌలిక సదుపాయాల' యొక్క అమలుకు ఇవి మూల కేంద్రాలుగా నిలుస్తాయి. మన రాష్ట్రం ఆహారం మరియు వ్యవసాయ ప్రాసెసింగ్, వస్త్ర మరియు స్పిన్నింగ్, సముద్ర ఉత్పత్తులు, ఖనిజ ఉత్పత్తులు, ఇనుము మరియు ఉక్కు సిమెంట్, గ్రానైట్, ఫెర్రో మిశ్రమాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్స్, డిఫెన్స్ మరియు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్, బయోటెక్, మరియు సూక్ష్మ వాణిజ్య రంగాలలో పెట్టుబడులకు భారీ అవకాశాలను కలిగి ఉంది. చిత్తూరు- నెల్లూరు ప్రాంతం దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ భారతదేశంలోని టాప్-10 తయారీ గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది.

95. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫ్రేమ్ వర్క్ క్రింద, అన్ని ఆమోదాలు 21 రోజుల్లో అందించబడతాయి. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల పనితీరును 2019-20లో 7వ ర్యాంక్ నుండి 2020-21లో ర్యాంక్ 4కి మెరుగుపరుచుకుంది, 2020-21లో ఎగుమతులు 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి, ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 13.8% వృద్ధి. జాతీయ ఎగుమతుల్లో రాష్ట్రం 5.8% సహకరిస్తుంది మరియు 2030 నాటికి ఎగుమతులను రెట్టింపు చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.

96. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2021 నాటికి మొత్తం 7,107 సూక్ష్మ, చిన్న మరియు రహా పరిశ్రమలు 2,099 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడ్డాయి. 46,811 మందికి ఉపాధి కల్పిస్తూ, జనవరి 31, 2022 వరకు 2,048 కోట్ల రూపాయల పెట్టుబడితో 11 మెగా ప్రాజెక్ట్ కు స్థాపించబడ్డాయి. ద్వారా 3,989 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అదనంగా, 93,116 మందికి ఉపాధి కల్పిస్తూ, 55 భారీ మరియు మెగా ప్రాజెక్టులు 44,097 కోట్ల రూపాయల పెట్టుబడితో వివిధ దశలలో ఉన్నాయి.

97. వై.ఎస్.ఆర్. నవోదయం ద్వారా, 7,976 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 1,78,919 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఖాతాలు MSME రుణాల స్కీమ్ యొక్క వన్ టైమ్ రీస్టక్చరింగ్ కింద సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి పునర్నిర్మించ బడ్డాయి. 2021-22 లో మన ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు మరియు సాధారణ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు మరియు వస్త్ర పరిశ్రమలను అందుబాటులోనికి తేవడానికి 671 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను విడుదల చేసింది.

98. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యవస్థాపకతా సంస్కృతిని పెంపొందించడం మరియు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం కోసం మన ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫేక్చరింగ్ పాలసీ 2021-2024' మరియు 'ఆంధ్రప్రదేశ్ ఐ.టి. పాలసీ 2021-2024' లను తీసుకువచ్చింది. E.M.C. 2.0 పథకం కింద భారత ప్రభుత్వంచే ప్రప్రథమంగా ఆమోదించబడిన వై.ఎస్.ఆర్. E.M.C. పథకం అనగా ఎలక్ట్రానిక్ మాన్యుఫేక్చరింగ్ క్లస్టర్ పథకాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 23, 2021న, కొప్పర్తిలో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం క్రింద 500 ఎకరాల విస్తీర్ణంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో, 25,000 వేల మంది కంటే ఎక్కువ మంది ఉపాధి అవకాశాలను అందించేందుకు 8,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పలు కంపెనీలు దాదాపు 660 కోట్ల రూపాయల సంచిత పెట్టుబడులతో సుమారు 9,000 పై చిలుకు మందికి ఉ పాధిని కల్పించేందుకు పలు కంపెనీలు ఇప్పటికే ఆసక్తి కనబరుస్తూ ముందుకు రావడం జరిగింది.

99. రానున్న 2 నుండి 5 సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడులతో 20,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఐ.టీ. రంగం క్రింద 10 పెట్టుబడి ప్రతిపాదనలు అధునాతన దశలో ఉన్నాయి. వీటికి అదనంగా, వచ్చే 3 సంవత్సరాలలో 4,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడితో 25,000 ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫేక్చరింగ్ (ESDM) సెక్టార్ క్రింద మరో 15 పెట్టుబడి ప్రతిపాదనలు ప్రారంభ దశలో ఉన్నాయి.

100. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గతంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేయడానికి మన రాష్ట్రం రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది ఆర్థిక చెల్లింపుల ముగింపు దశలో ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వంచే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందించబడిన మొదటి విమానాశ్రయంగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు వద్ద గల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నిలిచింది. కర్నూలు నుండి చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం నగరాలకు రాష్ట్రం విమాన సర్వీసులు నడపటం ప్రారంభించింది. కర్నూలు నుండి తిరుపతి, విజయవాడకు కొత్త మార్గాలను ప్రతిపాదించడం జరిగింది. చెన్నై-కడప-విజయవాడ మధ్య షెడ్యూల్డ్ విమాన సర్వీసులను ప్రారంభించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉ న్నాయి. ఇంకా, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, ఏరో స్పోర్ట్, నిర్వహణ మరియు మరమ్మత్తు సౌకర్యాలతో సహా 541 ఎకరాలలో ప్రతిపాదిత ఎయిర్ పోర్ట్ సిటీ కర్నూలు విమానాశ్రయంలో అభివృద్ధి దశలో ఉంది.

101. 2022-23లో పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2,755.17 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

రోడ్డు రవాణా మరియు మౌలిక సదుపాయాలు

102. జిల్లా కేంద్ర కార్యాలయాల నుండి మండల కేంద్ర కార్యాలయాలకు మరియు వివిధ మండల కేంద్ర కార్యాలయాల మధ్య డబుల్ లేస్ కనెక్టివిటీని అందించడం కోసం 'ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ మరియు రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్' మరియు 'ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్ట్' అనే రెండు ప్రాజెక్ట్ ను 6,400 కోట్ల రూపాయల ప్రతిపాదనతో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కింద 2,522 కి.మీ మేర రోడ్ల విస్తరణ మరియు 464 వంతెనల నిర్మాణం మరియు పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రతిపాదించ బడ్డాయి. ఇప్పటికే మొదటి దశ పనులకు మన ప్రభుత్వం పరిపాలనా అనుమతులను ఇచ్చింది.

103. 2వ దశ పనుల కోసం 1,268 కి.మీ రోడ్ల అభివృద్ధి ప్రక్రియలో భాగంగా 3,386 కోట్ల రూపాయల మొత్తానికి పరిపాలనా అనుమతులు పురోగతిలో ఉన్నాయి. కేంద్ర రహదారి నిధి క్రింద 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ 15.8 కోట్ల రూపాయల వ్యయంతో 125 కి. మీ. జాతీయ రహదారి విస్తరణ పనులను చేపట్టడం జరిగింది. రాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరంలో దీనిని 600 కి. మీ.కు పెంచడం మన ప్రభుత్వ లక్ష్యం. ఇందుకుగాను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 8,268 కి.మీ. మేర రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన జిల్లా రహదారుల పునరుద్ధరణకు మన ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతిని ఇవ్వడం జరిగింది.

104. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా, రోడ్డు భద్రతా పటిష్టత కార్యక్రమంలో మన రాష్ట్రం పాల్గొంటోంది. ఇందులో పోలీసు, రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ మరియు ఆరోగ్య శాఖలకు ముఖ్య పాత్రను ఇస్తూ, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింపు లక్ష్యంగా స్పష్టమైన పనితీరు సూచికలతో కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాము.

105. 2022-23 లో రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ కోసం 8,581.25 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరపు కేటాయింపుల కంటే 13% ఎక్కువ.

ఇంధనం

106. దాదాపు 21 లక్షల మంది షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ రాయితీ అందించబడుతోంది. అంతే కాకుండా, ధోబీ ఘాట్లకు, దారిద్ర్యరేఖకు దిగువన ఉ న్న రజక సంఘాలకు, చాలా వెనుకబడిన కుల సంఘాలకు, చేనేత కార్మికులకు, క్షౌరశాలలకు, బంగారు కవరింగ్ యూనిట్లకు మరియు ఇమిటేషన్ జ్యువెలరీ యూనిట్లకు కూడా రాయితీ విద్యుత్ ను మా ప్రభుత్వం అందజేస్తున్నది. 7వ ఎస్.డి.జి. అయిన 'సరసమైన, స్వచ్ఛ విద్యుత్ శక్తి అందించడం'లో భాగంగా, మన రాష్ట్రంలో విద్యుదీకరించబడిన గృహాల శాతం 2014-15లో 92.5% గా ఉంటే, 2021-22 నాటికి 100% కి పెరిగింది.

107. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినియోగించే శక్తిని లెక్కించడానికి మరియు నష్టాలను తగ్గించడానికి, అన్ని పంపిణీ ట్రాన్స్ ఫార్మర్లు మరియు ఫీడర్లకు మీటర్లు అందించబడతాయి. ప్రభుత్వం వ్యవసాయ ఫీడర్ విభజనను చేపట్టింది. దీనివలన అన్ని గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల నిరంతర 3-ఫేజ్ విద్యుత్ సరఫరాను ప్రభుత్వం అందిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

108. 2022-23 లో రైతులకు, ఆక్వా రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ రాయితీతో సహా ఇంధన శాఖకు 10,281 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

గృహ మంత్రిత్వం

109. పోలీసు శాఖను ఆధునీకరించే చర్యలలో భాగంగా, మన ప్రభుత్వం మెరుగైన సాంకేతికత, వాహనాలతోపాటు, నిఘా వ్యవస్థ కోసం, నేర నిర్థారణ నైపుణ్యాల అభివృద్ధి కోసం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. 'దిశ చట్టం' క్రింద మహిళా భద్రతలో భాగంగా, మహిళల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం అనేక చర్యలు తీసుకోబడుతున్నాయి. 2021 సంవత్సరానికి గానూ లైంగిక నేరాల ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ వ్యవస్థలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. విచారణ సమ్మతి రేటు అంటే లైంగిక నేరాలలో 60 రోజులలోపు పూర్తయిన దర్యాప్తు రేటు మన రాష్ట్రంలో 92.27% ఉంటే జాతీయ సగటు రేటు 40% మాత్రమే. 2022-23 లో గృహ మంత్రిత్వ శాఖకు 7,586.84 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ

110. పారిశ్రామిక శిక్షణా సంస్థలు మరియు అప్రెంటిస్ షిప్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో సాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల మరియు సామర్థ్యాన్ని పెంపొందించడంపై మన ప్రభుత్వం ఎంతో దృష్టి పెట్టింది. ఈ శిక్షణా విధానాన్ని నిర్వహించడం కోసం పారిశ్రామిక భాగస్వాములతో 44 అవగాహనా ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకున్నది. దీనిలో, విద్యార్థులు తమ కోర్సు వ్యవధిలోని సగం కాలాన్ని పరిశ్రమలో వృత్తి శిక్షణ పొందుతూ, నైపుణ్యాభివృద్ధి సాధించి, ఉపాధి కల్పన దిశగా అడుగు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమయిన పారిశ్రామిక విలువల పెంపుదల కొరకు నైపుణ్యాల అభివృద్ధి (హైవ్) ప్రాజెక్ట్ క్రింద 15 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఎంపిక చేయబడ్డాయి. ప్రతి పారిశ్రామిక శిక్షణా సంస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త కోర్సులను ప్రారంభించడం కోసం మరియు ఉపాధ్యాయుల శిక్షణ కోసం పనితీరు ఆధారిత గ్రాంట్లు అందచేయబడుతున్నాయి. రాయచోటి, ఆదోని, చాగలమర్రి, నరసరావుపేటలో అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా నాలుగు నూతన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది.

111. మన రాష్ట్రం సమృద్ధిగా పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉంది. పర్యాటక రంగం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కీలకమైన వృద్ధి సూచికలలో ఒకటి. అలాగే అది ఉపాధి కల్పనకు ముఖ్యమైన వనరు. పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు ప్రక్రియ దశలో ఉన్నాయి.

112. హస్తకళలను అభివృద్ధి చేయడానికి మరియు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం కళాకారుల సంఘానికి ప్రత్యక్ష మార్కెటింగ్ వేదికను అందించడానికి మన ప్రభుత్వం శిల్పారామం కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం పులివెందులలో ఉన్న శిల్పారామం పార్కును మరింత శక్తివంతమైన, ఆకర్షణీయమైన, పర్యాటక మరియు సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు, మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. గుంటూరులో నూతనంగా నిర్మిస్తున్న శిల్పారామం పార్కు నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఇదే తరహాలో, ఆదాయాన్ని పెంపొందించడానికి మరియు చేతివృత్తుల వారి స్వయం-సమృద్ధి కోసం తిరుపతి, విశాఖపట్నం మరియు కడపలలో ఇప్పటికే ఉన్న శిల్పారామం పార్కుల సమగ్ర అభివృద్ధిని మా ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది.

113. 2022-23 లో యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కోసం 290.31 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

పరిపాలన

114. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దార్శనిక నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజా సేవలను అందించడంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం యొక్క అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి, ఈ దిశగా అనేక చర్యలు చేపడుతోంది. ఒక కోటి మరియు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన వస్తువులు, సేవలు మరియు పనుల సేకరణకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానం తప్పనిసరి చేయడం జరిగింది. ఈ చర్య వలన రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 4,000 కోట్ల రూపాయలను ఆదా చేయగలిగింది. ఈ విధంగా ఆదా చేసిన మొత్తాన్ని పౌర-కేంద్రీకృత మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించడం జరిగింది.

115. సుపరిపాలన ఎలా నిర్వహించాలో మరియు సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా సంక్షేమాన్ని ఎలా సాధించవచ్చో నిరూపించడంలో మన రాష్ట్రం ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రత్యక్ష నగదు బదలీ పద్ధతి ద్వారా పథకాలను అమలు చేయడం వలన ప్రజలు తమ ప్రయోజనాలను పారదర్శకంగా సకాలంలో పొందగలుగు తున్నారు. 116. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా మన ప్రభుత్వం సుపరిపాలన దిశగా మరో అడుగు వేస్తోంది. ఈ చర్య ఫలితంగా వికేంద్రీకరణ మరియు సమర్థవంతమైన పరిపాలనను అందించే దిశగా కేంద్రీకృతమైన, సమ్మిళిత మరియు సుస్థిరమైన వృద్ధివైపు మన రాష్ట్రం దారి తీస్తుంది.

117. కోవిడ్-19 వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఉన్నప్పటికీ, మన ప్రభుత్వం 23% ఫిట్ మెంట్ తో ప్రభుత్వ ఉ ద్యోగులు మరియు పెన్షనర్లకు 11వ వేతన సవరణను అమలు చేసింది. 5 కరువు భత్యాల వాయిదాలను ఒకేసారి విడుదల చేయడం, పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచండం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కూడా అమలు చేయడం జరిగింది.

118. స్థానిక అవసరాలు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో సంక్షేమాన్ని పెంచడానికి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి మన ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి నిధి(ఎస్.డి.పి.ఎఫ్.) ని ఏర్పాటు చేస్తోంది. ఈ నిధి ద్వారా పౌరులు మరియు ఎన్నికైన ప్రతినిధులు గుర్తించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ, రాష్ట్రమంతటా అభివృద్ధిని సమానంగా విస్తరించేలా కార్యాచరణ చేపడుతుంది. ఇకపై రాష్ట్ర శాసనసభలోని ప్రతి సభ్యుడు మరియు సభ్యురాలి వద్ద 2 కోట్ల రూపాయల నిధి ఉంటుంది. 2022-23 లో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి నిధి (ఎస్.డి.పి.ఎఫ్.) కి 350 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

ఆర్థిక వృద్ధి సమీక్ష

2020-21 లెక్కలు

119. 2020 ఏప్రిల్ 01, నుండి 2021 మార్చి 31 వరకు గల ఆర్థిక సంవత్సరానికి గాను, ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారి అంతిమ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు 35,540 కోట్ల రూపాయలు గాను, ద్రవ్యలోటు 55,167 కోట్ల రూపాయలు గాను ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (G.S.D.P.) పై, రెవిన్యూ లోటు 3.6% గాను, ద్రవ్యలోటు 5.59% గాను ఉంది.

సవరించిన అంచనాలు 2021-22

120. సవరించిన అంచనాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 1,73,818 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 18,529 కోట్ల రూపాయలు. 2021-22 సం||లో రెవెన్యూ లోటు సుమారు 19,545 కోట్ల రూపాయలు కాగా, ఇదే కాలానికి ద్రవ్య లోటు 38,224 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 1.63% మరియు 3.18% గా ఉన్నాయి.

2022-23 బడ్జెట్ అంచనాలు

121. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ నేను 2,56,257 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,08,261 కోట్ల రూపాయలు, మూల ధన వ్యయం అంచనా 47,996 కోట్ల రూపాయలు. 2022-23 సం॥లో రెవెన్యూ లోటు 17,036 కోట్ల రూపాయలు, ద్రవ్య లోటు 48,724 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.) లో రెవెన్యూ లోటు 1.27% గాను మరియు ద్రవ్య లోటు 3.64% గాను ఉండవచ్చు.

122. గత మూడు సంవత్సరాలలో, మన ప్రభుత్వం నవరత్నాలు మరియు ఇతర మేనిఫెస్టో పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేగాక మన ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి వలన, సంస్థాగత బలోపేతం వలన మరియు సామాజిక చేరికల వలన, అన్ని ఎస్.డి.జి.లలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచేందుకు ముందుకు వెళోంది.

123. ఈ క్రమంలో, మన ప్రభుత్వం సామాన్యుల సంక్షేమం కోసం శ్రద్ధ తీసుకుంటూ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగాను మరియు వివక్ష లేకుండాను చేపట్టడం జరిగింది. ప్రయోజనాల పంపిణీ కోసం భారీ స్థాయిలో ప్రత్యక్ష నగదు బదలీ పద్ధతిని అమలు చేయడం ద్వారా బలమైన వికేంద్రీకృత పాలనను ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వం ఇంధన రంగంలో పారదర్శకంగాను మరియు తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులలో సౌరశక్తిని తయారీని ప్రోత్సహించింది. నాడు-నేడు కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం మరియు విద్యా రంగాలలో ప్రభావవంతమైన మార్పులు చేయబడ్డాయి. మా ప్రభుత్వం 1.34 లక్షల గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల నియమకాలను భారీ ఎత్తున పూర్తి చేసింది. ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇతర ఖాళీలు భర్తీ చేయబడుతున్నాయి. చివరగా, కోవిడ్-19 మహమ్మారిని అత్యంత ప్రభావవంతమైన రీతిలో అదుపు చేస్తూ, ప్రాణ నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించి, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మన ప్రభుత్వం అన్ని అభివృద్ధి ఆధారిత చర్యలను చేపట్టిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

124. విమర్శకులు మనం చేస్తున్న పనిని తప్పుగా చిత్రీకరిస్తూ మన మార్గంలో అనేక అడ్డంకులు సృష్టిస్తారు. అయినప్పటికీ, మడమ తిప్పకుండా, ప్రజల జీవితాలను రుగుపరిచే అత్యున్నత కర్తవ్యానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను సంస్కృత కవి కాళిదాసు రాసిన ఒక రచనతో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

“ప్రతి నిన్నా ఒక జ్ఞాపకం మాత్రమే,
అలాగే రేపు అనేది ఒక లక్ష్యం మాత్రమే,

ఈనాటి మన జీవన పురోగతి,
ప్రతి నిన్ననీ ఒక సంతోష జ్ఞాపకంగా మారుస్తుంది,
అలాగే, ప్రతి రేపటినీ కొత్త ఆశలతో లక్ష్యం వైపుగా నడిపిస్తుంది.
అందుకే, ఈ రోజు వర్తమానంలో ఆనందంగా జీవిద్దాం:
అలాంటి శుభోదయాలకు స్వాగతం పలుకుదాం!”

ఈ మాటలతో, గౌరవ శాసనసభ ఆమోదం కోసం నేను 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్. జై హింద్.

33

ANNEXURE – I

SECRETARIET DEPARTMENT WISE BUDGET ALLOCATION
Sl.No DEPARTMENT BE 2021­22 RE 2021­22 BE 2022­23
1 Agriculture Marketing & Co­Operation 11,210.80 10,179.36 11,387.69
2 Animal Husbandry, Dairy Development & Fisheries 1,511.28 1,342.81 1,568.83
3 Backward Classes Welfare 12,387.80 10,864.44 20,962.06
4 Environment, Forest, Science & Technology 806.47 428.59 685.36
5 Higher Education 1,973.16 2,031.24 2,014.30
6 Energy and Infrastructure 6,637.24 12,768.30 10,281.04
7 Secondary Education 24,624.22 23,269.48 27,706.66
8 Department of Economically Weaker Sections (EWS) Welfare 5,986.16 6,162.06 10,201.60
9 Food & Civil Supplies 3,695.89 2,167.48 3,719.24
10 Finance 58,786.01 54,320.78 58,583.61
11 General Administration 1,128.17 1,012.10 998.55
12 Gram Volunteers/Ward Volunteers and Villages /Wards 2,916.71 2,890.26 3,396.25
13 Health, Medical & Family Welfare 13,830.44 13,702.82 15,384.26
14 Home 7,039.18 7,063.64 7,586.84
15 Housing 4,715.02 3,786.47 4,791.69
16 Water Resources 13,237.78 8,428.23 11,482.37
17 Infrastructure And Investment Department 1,133.10 331.59 1,142.53
18 Industries and Commerce 2,540.24 1,906.08 2,755.17
19 Information Technology, Electronics & Communications 207.89 180.94 212.13
20 Labour and Employment 711.88 688.24 790.04
21 Law 776.91 721.85 924.03
22 Legislature 96.02 102.30 107.16
23 Municipal Administration and Urban Development 8,727.08 8,055.25 8,796.33
24 Minorities Welfare 1,434.00 1,242.96 2,063.15
25 Public Enterprises 1.56 1.04 1.67
26 Planning 510.89 391.99 615.33
27 Panchayat Raj and Rural Development 15,995.25 12,836.53 15,846.43
28 Revenue 5,869.40 3,555.66 5,306.94
29 Department of Real Time Governance 52.11 82.03 52.72
30 Skill Development, Entrepreneurship and Innovation 899.31 774.01 969.91
31 Social Welfare 8,156.63 7,343.99 12,728.26
32 Transport, Roads and Buildings 7,594.06 5,975.73 8,581.25
33 Women, Children, Disabled and Senior Citizens 4,301.52 3,255.90 4,322.86
34 Youth and Sports 285.09 242.42 290.31
Total 2,29,779.27 2,08,106.57 2,56,256.56

ANNEXURE – II

Sector Wise Budget Estimates 2022-23
SECTOR BE 2021­22 RE 2021­22 BE 2022­23
ECONOMIC SERVICES
Agriculture & Allied Services 13,517.87 1,942.26 13,630.10
Energy 6,637.24 12,768.30 10,281.04
General Eco Services 4,284.03 2,645.67 4,420.07
Industry & Minerals 2,540.24 1,906.08 2,755.17
Irrigation & Flood Control 13,237.78 8,428.23 11,482.37
Rural Development 16,221.32 13,187.45 17,109.06
Science Tech, Environment 10.68 8.50 11.78
Transport 8,657.74 6,246.33 9,617.15
ECONOMIC SERVICES Total 65,106.91 57,132.82 69,306.74
% of Total Budget 28.33 27.45 27.05
SOCIAL SERVICES
Art and Culture 22.57 19.07 20.67
General Education 26,994.91 25,594.30 30,077.20
Housing 4,715.02 3,786.47 4,791.69
I & P 278.82 239.95 261.65
Labor and Employment 936.26 832.36 1,033.86
Medical 13,830.44 13,702.82 15,384.26
Social Security & Welfare 4,313.72 3,262.81 4,331.85
Sports & Youth Services 138.05 103.01 140.48
Technical Education 324.60 370.46 413.50
Urban Development 8,727.08 8,055.25 8,796.33
Water Supply , Sanitation 2,690.64 2,539.34 2,133.63
Welfare 27,964.59 25,613.44 45,955.07
SOCIAL SERVICES Total 90,936.71 84,119.27 1,13,340.20
% of Total Budget 39.58 40.42 44.23
GENERAL SERVICES 73,735.66 66,854.47 73,609.63
% of Total Budget 32.09 32.13 28.72
Grand Total 2,29,779.27 2,08,106.57 2,56,256.56


ANNEXURE – III

Subplan Allocation
Sub Plan/Action Plans BE 2021­22 BE 2022­23
SC Sub­Plan 13,835 18,518
Tribal Sub Plan 5,318 6,145
BC Sub Plan 28,238 29,143
Minorities Action Plan 3,077 3,662
Kapu Welfare 3,306 3,532
EBC Welfare 3,743 6,669

DBT SCHEMES
Sl.No Item BE 21­22 RE 2021­22 BE 2022­23
1 YSR Pension Kanuka 17,000.00 16,752.45 18,000.90
2 YSR Rythu Bharosa 3,845.30 3,825.95 3,900.00
3 Jagananna Vidya Deevena 2,500.00 2,050.87 2,500.00
4 Jagananna Vasati Deevena (MTF) 2,223.15 1,088.75 2,083.32
5 YSR ­ PM Fasal Bima Yojana 1,800.00 1,738.93 1,802.04
6 Y.S.R Interest free loans to Self Help Groups 865.00 862.87 600.00
7 Y.S.R Interest free loans to Urban Self Help Groups 247.00 246.15 200.00
8 Y.S.R Interest free Loans to Farmers 500.00 375.87 500.00
9 YSR Kapu Nestham 500.00 479.44 500.00
10 YSR Jagananna Chedodu 300.00 287.12 300.00
11 YSR Vahana Mitra 285.00 256.06 260.00
12 YSR Nethanna Nestham 190.00 192.10 199.99
13 YSR Matsyakara Bharosa 120.00 120.05 120.49
14 Diesel Subsidy to Fishermen Boats 50.00 44.76 50.00
15 Exgratia to Farmers 20.00 15.35 20.00
16 Law Nestham 16.64 19.62 15.00
17 Jagananna Thodu 20.00 32.52 25.01
18 EBC Nestham 500.00 589.01 590.00
19 YSR Aasara* 6,429.14 6,400.00
20 YSR Cheyuta* 4,208.97 4,235.95
21 Amma Vodi 6,500.00
Grand Total 30,982.10 39,615.98 48,802.71
* YSR Aasara and YSR Chayutha in 2021-22 were implemented through APSDC

Expenditure Through Corporations
Items 2020­21 2021­22 BE 22­23
YSR Pension Kanuka 2,633.72 2,751.00 3,051.39
YSR Cheyuta 1,061.06 1,020.98 1,017.14
Jagananna Vidya Deevena 368.00 370.47 218.74
Jagananna Vasati Deevena 296.00 198.35 247.79
YSR Vahana Mitra 64.85 59.69 64.66
YSR Jagananna Chedodu 21.64 21.62 23.08
YSR Nethanna Nestham 2.01 1.61 2.07
YSR Matsyakara Bharosa 0.44 0.57 0.75
YSR Aasara 1,275.93 1,290.00 1,288.06
Ammavodi 1,219.11 ­ 1,284.37
Others 9.19 24.57 12.30
Total 6,951.95 5,738.86 7,210.34




AP Scheduled Tribe Corporation
Sl.No Items 2020­21 2021­22 BE 22­23
1 YSR Pension Kanuka 924.04 957.45 971.76
2 YSR Cheyuta 252.02 252.23 251.07
3 Jagananna Vasati Deevena 39.42 31.55 150.75
4 Jagananna Vidya Deevena 36.20 29.59 148.39
5 YSR Vahana Mitra 10.67 9.91 10.52
6 YSR Jagananna Chedodu 3.46 3.07 2.12
8 YSR Nethanna Nestham 0.64 0.55 0.65
9 YSR Matsyakara Bharosa 0.29 0.31 0.38
10 YSR Aasara 169.67 174.00 174.00
11 Ammavodi 395.27 ­ 416.43
12 Others 36.08 16.76 1.50
Total 1,867.76 1,475.40 2,127.58

AP State Backward Classes Corporations
Sl.No Items 2020­21 2021­22 BE 22­23
1 YSR Pension Kanuka 7,918.87 8,096.00 8,411.35
2 YSR Cheyuta 2,703.12 2,797.94 2,692.96
3 Jagananna Vidya Deevena 611.49 922.43 1,112.72
4 Jagananna Vasati Deevena 838.00 506.37 1,062.73
5 YSR Jagananna Chedodu 225.96 210.90 215.27
6 YSR Nethanna Nestham 169.49 155.10 184.65
7 YSR Vahana Mitra 123.49 134.39 129.17
8 YSR Matsyakara Bharosa 107.95 96.48 118.54
10 YSR Aasara 3,027.25 3,071.00 3,053.39
11 Ammavodi 3,192.40 ­ 2,975.65
12 Others 22.87 54.22 52.00
Total 18,940.89 16,044.83 20,008.42



AP KAPU Welfare Corporation
Sl.No Items 2020­21 2021­22 BE 22­23
1 YSR Pension Kanuka 1,068.02 1,083.59 1,096.88
2 YSR Kapu Nestham 491.02 459.64 500.00
3 Jagananna Vidya Deevena 231.01 204.63 360.78
4 Jagananna Vasati Deevena 86.92 96.36 231.57
5 YSR Vahana Mitra 31.14 26.40 35.68
6 YSR Jagananna Chedodu 16.63 15.47 20.41
7 YSR Nethanna Nestham 6.92 5.64 9.35
8 YSR Aasara 655.21 670.00 667.01
9 Ammavodi 579.00 ­ 609.99
Total 3,165.88 2,561.73 3,531.68



AP State Minorities Corporation
Sl.No Items 2020­21 2021­22 BE 22­23
1 YSR Pension Kanuka 667.83 632.79 634.90
2 YSR Cheyuta 422.38 122.91 122.45
3 Jagananna Vidya Deevena 211.86 117.15 173.15
4 Jagananna Vasati Deevena 84.00 64.83 70.00
5 YSR Jagananna Chedodu 18.33 16.64 17.86
6 YSR Vahana Mitra 38.46 4.21 4.50
7 YSR Nethanna Nestham 5.16 0.11 0.11
9 YSR Aasara 130.98 133.14 133.00
10 Ammavodi 457.00 ­ 458.73
11 Incentives to Imams and Mouzans 50.00 78.85 126.00
12 Others 5.32 6.72 9.80
Total 2,091.32 1,177.34 1,750.50

AP State Christian Corporation
Sl.No Items 2020­21 2021­22 BE 22­23
1 YSR Pension Kanuka 40.00 40.00 46.00
1 YSR Cheyuta 16.44 14.92 16.38
2 Jagananna Vidya Deevena 7.06 9.61 9.31
3 Jagananna Vasati Deevena 7.91 4.41 4.70
4 YSR Vahana Mitra 1.06 0.89 0.82
5 YSR Jagananna Chedodu 0.22 0.25 0.01
7 YSR Nethanna Nestham 0.02 0.02 0.03
8 YSR Aasara 13.33 13.00 13.68
9 Ammavodi 18.10 ­ 19.07
10 Others 2.64 0.68 3.40
Total 106.79 83.78 113.40



AP Brahmin Welfare Corporation Limited
Sl.No Items 2020­21 2021­22 BE 22­23
1 YSR Pension Kanuka 75.07 68.95 196.00
2 YSR Jagananna Chedodu 0.40 0.39 0.01
3 YSR Vahana Mitra 0.60 0.49 0.44
4 YSR Aasara 14.93 15.00 60.92
5 Ammavodi 26.65 ­ 38.09
6 EBC Nestham ­ 33.45 33.46
7 Jagananna Vasati Deevena 4.68 4.63 4.46
8 Jagananna Vidya Deevena 1.00 1.00 1.85
9 Archakas ­ ­ 120.00
Total 123.33 123.91 455.23

AP State Economically Backward Classes Corporations
Sl.No Items 2020­21 2021­22 BE 22­23
1 YSR Pension Kanuka 75.07 68.95 196.00
2 YSR Jagananna Chedodu 0.40 0.39 0.01
3 YSR Vahana Mitra 0.60 0.49 0.44
4 YSR Aasara 14.93 15.00 60.92
5 Ammavodi 26.65 ­ 38.09
6 EBC Nestham ­ 33.45 33.46
7 Jagananna Vasati Deevena 4.68 4.63 4.46
8 Jagananna Vidya Deevena 1.00 1.00 1.85
9 Archakas ­ ­ 120.00
Total 123.33 123.91 455.23
EBC Corporation / Scheme BE 22­23
Andhra Pradesh Reddy Welfare and Development Corporation 3,088.99
YSR Pension Kanuka 1,614.83
YSR Aasara ­ Loans to Women Cooperative Societies 498.29
Amma Vodi 311.55
EBC Nestham 274.66
Fees reimbursement (Jagananna Vidya Deevena) 221.58
Jagananna Vasati Deevena (MTF) 146.72
YSR Jagananna Chedodu 9.87
YSR Vahana Mitra 6.81
Jagananna Thodu 2.89
Economic Support ­ Backend Subsidy to Mobile Dispensing Units 1.79


EBC Corporation / Scheme BE 22­23
Andhra Pradesh Kamma Welfare and Development Corporation 1,899.74
YSR Pension Kanuka 988.59
YSR Aasara ­ Loans to Women Cooperative Societies 314.33
Amma Vodi 190.73
EBC Nestham 167.54
Fees reimbursement (Jagananna Vidya Deevena) 135.65
Jagananna Vasati Deevena (MTF) 89.82
YSR Jagananna Chedodu 6.04
YSR Vahana Mitra 4.17
Jagananna Thodu 1.77
Economic Support ­ Backend Subsidy to Mobile Dispensing Units 1.09

EBC Corporation / Scheme BE 22­23
Andhra Pradesh Arya Vysya Welfare and Development Corporation 915.49
YSR Pension Kanuka 462.95
YSR Aasara ­ Loans to Women Cooperative Societies 173.05
Amma Vodi 89.32
EBC Nestham 78.46
Fees reimbursement (Jagananna Vidya Deevena) 63.53
Jagananna Vasati Deevena (MTF) 42.06
YSR Jagananna Chedodu 2.83
YSR Vahana Mitra 1.95
Jagananna Thodu 0.83
Economic Support ­ Backend Subsidy to Mobile Dispensing Units 0.51
EBC Corporation / Scheme BE 22­23
Andhra Pradesh Kshatriya Welfare and Development Corporation 314.02
YSR Pension Kanuka 157.82
YSR Aasara ­ Loans to Women Cooperative Societies 60.92
Amma Vodi 30.45
EBC Nestham 26.75
Fees reimbursement (Jagananna Vidya Deevena) 21.66
Jagananna Vasati Deevena (MTF) 14.34
YSR Jagananna Chedodu 0.96
YSR Vahana Mitra 0.67
Jagananna Thodu 0.28
Economic Support ­ Backend Subsidy to Mobile Dispensing Units 0.17
EBC Corporation / Scheme BE 22­23
Andhra Pradesh EBC Welfare and Development Corporation 139.18
YSR Pension Kanuka 53.96
YSR Aasara ­ Loans to Women Cooperative Societies 48.70
Amma Vodi 10.41
EBC Nestham 9.14
Fees reimbursement (Jagananna Vidya Deevena) 7.40
Jagananna Vasati Deevena (MTF) 4.90
YSR Nethanna Nestham 3.13
YSR Matsyakara Bharosa 0.82
YSR Jagananna Chedodu 0.33
YSR Vahana Mitra 0.23
Jagananna Thodu 0.10
Economic Support ­ Backend Subsidy to Mobile Dispensing Units 0.06

Important Major and New Schemes - Agriculture
YSR Rythu Bharosa 3,900.00
YSR ­ PM Fasal Bima Yojana 1,802.04
Calamity Relief Fund 2,000.00
Rashtriya Krushi Vikasa Yojana (RKVY) 1,750.00
Krishionnati Yojana 760.00
Y.S.R Interest free Loans to Farmers 500.00
Supply of Seeds to Farmers 200.00
KFW Germany ­ Zero Based Natural Farming (ZBNF) 87.27
YSR ­ Agri Testing Labs 50.00
Storage, interest and other related costs of fertilizer buffers 40.00
Rythu Bharosa Kendralu 18.00
Price Stabilization Fund Rs. 3000 Cr. Recoupment 500.00
Agriculture Market Infrastructure Fund (AMIF) 100.00
Construction of Buildings for Andhra Pradesh Fisheries University 40.00
National Livestock Mission 100.00
Fodder and Feed Development 72.70
Livestock Loss Compensation 50.00
Pradhan Mantri Matsya Sampada Yojana ( PMMSY) 100.00
Construction of Fish Landing Centers / Jetties 100.00
Diesel Subsidy to Fishermen Boats 50.00


Medical Education Department
NHM (NUHM & NRHM) 2,462.03
Dr. YSR Aarogyasri Health Care Trust 2,000.00
Medical Buildings (NAADU­NEDU) 1,603.00
Medical Colleges 753.84
Establishment of new Medical College along with Hospital in Plain Areas 320.00
Dr YSR Aarogya Aasara ­ POP 300.00
Establishment of NewMedical Colleges 250.45
Establishment of Multi­Speciality Hospitals in Tribal Areas 170.00
Mobile Medical Units (104 Services) 140.22
Andhra Pradesh Emergency Response Services ­ 108 Ambulance Services 133.19
Increase of Seats in existing Government Medical Colleges (PMSSN) 100.00
NAADU NEEDU ­ Infrastructure facilities for Hospitals 500.00
NHM­Infrastcture Maintanence 695.88
Honorarium to Asha Workers 343.97
Family Welfare Centres 280.70
Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission (PMABHIM) 250.00

Food and Civil Supplies Department
Subsidy on Rice (Human Resources Development) 3,100.00
Door Delivery of Rice 200.02


Industries, Commerce and Export Promotion Department
Incentives for Industrial Promotion for Micro Small and Medium Enterprises (MSMEs) 450.00
Incentives for Industrial Promotion 411.62
ADB (Asian Development Bank) ­ Visakhapatnam­Chennai Industrial Corridor Development Program ­ APRDC Component 250.00
ADB (Asian Development Bank) ­ Visakhapatnam­Chennai Industrial Corridor Development Program ­ APIIC Component 236.86
Incentives to the S.C. Entrepreneurs for Industrial Promotion 175.00
ADB (Asian Development Bank) ­ Visakhapatnam­Chennai Industrial Corridor Development Program ­ APTRANSCO Component 125.00
Incentives to IT & Electronics Industries/ Organizations 60.00
YSR Bima 372.12


Women Development and Child Welfare Department
Saksham Anganwadi and Poshan 2.0 (ICDS ­ Anganwadi Services) 1,517.64
Saksham Anganwadi and POSHAN 2.0 (Supplementary Nutrition Programme) 1,200.00
YSR Sampoorna Poshana 901.56
YSR Sampoorna Poshana & Plus 201.82
Saksham Anganwadi and Poshan 2.0 (construction of anganwadi center buildings under mgnrega) 160.00
Saksham Anganwadi and Poshan 2.0 ( Poshan Abhiyan) 120.63
Mission Vatsalya (Child Protection Services and Child Welfare Services) 53.80


Minorities Welfare Department
Andhra Pradesh State Minorities Finance Corporation 988.98
YSR Pension Kanuka 634.91
Pradhan Mantri Jan Vikas Karyakaram 150.00
Incentives to Imams and Mouzans 126.00
Assistance to Andhra Pradesh Haj Committee 26.10

Rural Development Department
Mahatma Gandhi National Rural Employment Guarantee Act 5,000.00
Interest Free Loans to DWACRA Women (Vaddileni Runalu) 600.00
National Rural Livelihood Mission (NRLM) 389.06
Rural Water Supply Department
Jal Jeevan Mission (JJM)/National Rural Drinking Water Mission 1,149.93
Swachh Bharat Mission - Gramin 500.00

This work is available under the Creative Commons CC0 1.0 Universal Public Domain Dedication.

The person or the organisation responsible for this work, associated with this deed has dedicated the work to the public domain by waiving all of his or her rights to the work worldwide under copyright law, including all related and neighboring rights, to the extent allowed by law. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission.