అబలా సచ్చరిత్ర రత్నమాల/సరసవాణి

సరసవాణి

ఈ పండిత తన భర్తయగు మండన మిశ్రుడు శంకరాచార్యులవారితో వాదముచేసి యోడిపోగా దానాచార్యులతో వాదించెను. ఈమెకుగల యసమాన పాండిత్యమును సౌందర్యమును గని లోకు లీమెను సరస్వతి యవతారమని తలచిరి. అందువలన వారామెను ఉభయభారతి యని పిలుచుచుండిరి. ఈమె యాదిశంకరుల వారితో సమాకాలీను రాలయినందు వలన శంకరులవారి కాలనిర్ణయమే ఈమె కాలనిర్ణయమని వేరుగ జెప్పనక్కరలేదు. ఆది శంకరులవారు క్రీ.శ. 7 వ శతాబ్దమునం దుండిరని కొందరును, 8 వ శతాబ్దమునందుండిరని కొందరును 9 వ శతాబ్దమునందుండిరని కొందరును జెప్పుచున్నారు. కాని కొన్ని యాధారములవలన నాదిశంకరులవారు క్రీ.శ. 8వ శతాబ్దాంతమునను 9 వ శతాబ్దాదిని నుండినట్లు పండితు లనేకులు నిర్ణయించినారు.

శోణనది తీరమునందు విష్ణుశర్మయను బ్రాహ్మణునకు సరసవాణి యొక్కతయె కూతురు. అందువలన నతడామెను కడు గారాబముతో బెంచుచుండెను. తల్లిదండ్రులామెకు సకలవిద్యలను నేర్పిరి. సాంఖ్య, పాతంజల, వైశేషిక న్యాయ మీమాంసా, వేదాంతముల నెడి యారు శాస్త్రములును, వ్యాకరణాది షడంగములును, కావ్యనాటకములును ఇతరవిద్యలన్నియు నామె నేర్చెను. ఇందువలన లోకులామెను గని యద్భుత పడుచుండిరి. ఇట్లు విద్యాగుణ సంపన్నయగు నా చిన్నది వివాహ యోగ్యయయ్యెను. అప్పుడామె గుణవంతుడును, సురూప వంతుడును నగు విశ్వరూపా పరనామము గల మండనమిశ్రుని ఖ్యాతిని బ్రాహ్మణులవలన వినెను. మండన మిశ్రుడును సరసవాణియొక్క సద్గుణములు వినెను. అందువలనవారికి నుభయులకును నొకరి నొకరు చూడవలయునని యభిలాష జనించెను. కాని వారు తమతండ్రుల కాసంగతి దెలుపుటకు సిగ్గుపడి తమలో దామే కృశింపచుండిరి.

ఇట్లు కొన్నిదినములు గడచినపిదప తమపిల్ల లిట్లుకృశించుట కేమికారణమోయని వారి జననీజనకులు చింతించి యొకదినమునందు దాని కారణమును చెప్పక తప్పదని వారిని వారితల్లితండ్రులు బలవంత పరుపగా వారు నిజమయిన కారణమును దెల్పినవారైరి.

అందుపై హిమమిత్రుడు సరసవాణి తండ్రియొద్దకి కన్యకను విచారించుటకు బ్రాహ్మణుల నంపెను. వారికి విష్ణుశర్మ తగిన మర్యాదలు చేసి యాగమన కారణమడుగగా వారును తాము వచ్చినసంగతి నతని కెరిగించి పిల్లను మండనున కిమ్మని యడిగిరి. అందున కతడు తనభార్య నడిగి నిశ్చయించి చెప్పెదనని వారితో జెప్పి యామెనడుగగా నాయువతి యిట్లనియె.

"ధనము, కులము, శీలముగల వానికి బిల్ల నియ్యవలెనని శాస్త్రములయందును, వ్యవహారమునందును ప్రసిద్ధియే కదా? ఈ పిల్లడు దూరమున నుండువాడు. ఇతనికులశీలములు మనకు దెలియవు. కనుక నిందునగురించి యేమి చెప్పగలను" అందు కతడు మండనమిశ్రుని విద్యాప్రభావమును బొగడి ధనముకన్నను విద్యయే శ్రేష్ఠమనిచెప్పెను. అంత నా దంపతు లిరువురును కొమార్తె కా సంగతిని దెలిపి యామె మనోభావము నెరుగ దలచి యామెసన్నిధికరిగి యాసంగతి నెరుకపరచి నీ యభిప్రాయమేమని యడిగిరి. వారావార్త చెప్పిన తోడనే యా బాల కపరిమిత సంతోషము కలిగి యాసంతోషమున కామె. మనసునం దిముడుటకు జోటుచాలక రోమాంచ రూపమున బయటబడెను. దానివలననే యామె యభిప్రాయమును వారెరిగి యావచ్చిన బ్రాహ్మణులకు దోడు తా మొకబ్రాహ్మణుని వరుని జూచుటకును, లగ్నము నిశ్చయము చేయుటకును బంపిరి. నాటికి బదునాల్గవ దినసంబున దశమినాడు శుభచంద్రయుక్తమైన ముహూర్తమని వ్రాసి గణితమునందు బ్రవీణయైన సరసవాణి తమ బ్రాహ్మణుని చేతికిచ్చెను.

అంత నాబ్రాహ్మణులు మువ్వురు కొన్నిదినములకు మండునని గ్రామమునుండి యతని తండ్రికి శుభలేఖ నందిచ్చిరి. ఆయన దాని జదివికొని సంతసించి శుభదినమునందు బంధువర్గముతో దర్లి పోయి కొమారుని వివాహము చేసెను.

కూతు రత్తవారింటికరుగునపుడు సరసవాణి తల్లిదండ్రు లామె కిట్లు బోధించిరి. "ప్రియకుమారీ! నేటినుండియు నీకు నపూర్వమైనదశ ప్రాప్తమయినది. ఈ సుస్థితికి యోగ్యమై నటుల నీవు ప్రవర్తింపుము. బాల్యమునందలి క్రీడలు విడువుము. ఏలయనగా అట్టి నీయాటలు మాకు సంతోషజనకము లైనటుల నితరులకు గానేరవు. స్త్రీలు వివాహమున కన్న బూర్వము తల్లిదండ్రుల యాజ్ఞలో నుండవలయును. తదనంతరము వారికి బతియేగతి. కనుక నీవు పతియాజ్ఞలో నుండుము. ఇందువలననీకు నుభయ లోకములలో గీర్తిగలుగును. పతికంటెను మొదటలేచి స్నానము చేయుము. అతడు భోజనము చేయనిది భోజనము చేయకుము. పతి గ్రామాంతరము వెళ్ళిన యెడల అలంకారములను ధరియింపకుము. ఇటుల నరుంధత్యాది పతివ్రతలు నడిచినటుల నడుచుటయే నీకు భూషణము. పతి కోపగించినయెడల మారుమాటాడకుము. ఆయన కోపమునంతను నోర్చుకొనుము. ఇటుల జేసిన నతడు నీపై గోపమును వదలి ప్రేమింపగలడు. శాంతితో సాటి యేదియును లేదుసుమా. పతి యింట లేకుండినప్పుడు నతిథులెవరయిన వచ్చినయెడల వారిని దిన్నగా సన్మానించి యాదరించి పంపవలయును. అటుల జేయనిపక్షమున వారిలో నెవరయిన మహాత్ము లుండినయెడల గులదాహమగును. అత్తమామలను తల్లిదండ్రులవలె జూడుము. బావమరదులను నన్నదమ్ములవలె జూడుము. వీరికి గోపము వచ్చినయెడల నీకును నీభర్తకును నెంత యన్యోన్యప్రేమ ముండినను మీలో భేదము పుట్టింతురు."

ఇట్లు వారు గూతునకు బుద్ధులుగరపి యామె నత్తవారియింటి కనిపిరి. ఆ భార్యాభర్తలు తమనగరమునకు నరిగి గృహస్థాశ్రమమును జక్కగా నడుపుచుండిరి. ఇట్లు కొన్ని సంవత్సరములు గడచినపిదప నీదంపతుల విద్యాప్రావీణ్యము లోకమంతటను వెల్లడియైనందున శంకరులవారు వీరితో వాదించి గెలుపొంద నెంచి యాగ్రామమునకు వచ్చి నీళ్లు గొనిపోవుచున్న యువతులను మండనమిశ్రునిగృహ మెచటనని యడుగగా వారిట్లు చెప్పిరి:-

"ఎవని ద్వారమునందు బంజరమున నుంచబడిన ఆడు చిలుక వేదము స్వత: ప్రమాణమా పరత:ప్రమాణమా యని చర్చించుచుండునో యాగృహమే మండనమిశ్రుని దని తెలిసికొనుము."

"పూర్వకృత కర్మవలన, మన మిప్పుడు చేయుకార్యమునకు, ఫలము కలుగునా లేక పురుషప్రయత్నమువలన ఫలము కలుగునా యని యేద్వారములో బంజరస్థలయిన శుక యువతులు వాదించుచుండునో యదేగృహము మండనపండితునిది యను కొనుము."

"జగత్తు నిత్యమా యనిత్యమా యని యాడరామచిలుక ఏగృహముయొక్క సింహద్వారమునబంజరమందు ముచ్చటించు చుండునో యాగృహమే మండనునిది యనుకొనుము."

వారట్లు చెప్పగా శంకరులవా రచటి కరిగి మండనునిచే వాదభిక్ష గొనిరి. తరువాత సమస్తవిద్యాశారద యయిన సరసవాణిని సభకు నధిపతినిగా నేర్పరచి వారు వాదవివాదమునకు నుద్యుక్తులయిరి.

ఇట్లు కొన్ని దినములు వాదము జరిగినపిదప మండనుడు వాదమునందోడుట తటస్థ మయ్యెను. అప్పు డాతని ననుగ్ర హించి శంకరు లతనికి సన్యాస మియ్యదలపగా సరసవాణి శంకరులతో నిట్లనియె.

"ఓయతిశ్రేష్ఠ! నీయుద్దేశము నాకు దెలిసినది. నీవు నాపతిని గెలిచితివిగాన నతనిని నీశిష్యునిగా బరిగ్రహించుట యుక్తమే. కాని నీవింకను నాతనిని సంపూర్ణముగా నోడించలేదు. అతని యర్ఠశరీరిణినగు నన్ను గెలిచినగదా మీగెలుపు పూర్ణమగును. మీరు గొప్పపురుషు లయినప్పటికిని మీతో వాదము చేయవలయునని నాకు చాల నుత్కంఠ యున్నది."

శంకరులు - "వాదవివాదమునం దుత్కంథ గలదని నీవు చెప్పితివి కాని నీతో వాదము కానేరదు, గొప్పవారు స్త్రీలతో వాదము చేయరు."

సరసవాణి - "స్వమతమును స్థాపింప దలచువారు తమ మతమును ఖండించువారు పురుషులయినను, స్త్రీలయినను వారితో వాదము చేసి వారిని పరాజితులను చేయుట యత్యంతావశ్యకము. ఇందువలననే పూర్వము యాజ్ఞవల్క్యులవారు గార్గితోను, జనకుడు అబలయైన సులభతోను వాదముసల్పిరి. వారు యశోనిధులు కాకపోయిరా?"

ఇట్లు సరసవాణి చెప్పిన యుక్తివాదమువలనను, పూర్వోదాహరణములవలనను కుంఠితులయి శంకరులవారు సభయందు నామెతో వాదము చయుట కొప్పుకొనిరి.

పరస్పర జయోత్సుకు లయినట్టియు తమబుద్ధిచాతుర్యము వలనను రచియించిన శబ్దమనెడి యమృతముచే విను వారిని విస్మయ మొందించునట్టియు నా సరసవాణి శంకరులకు నత్యద్భుతముగా వాదము జరిగెను.

ఇట్లహోరాత్రములు పదియేడుదినములవరకును అసమానవిద్యావంతులగు సరసవాణి శంకరులకు ఘోరమయినవాదము జరిగి తుదకు సరసవాణి యడిగిన ప్రశ్న కుత్తరము చెప్పజాలక శంకరు లామెను నారు నెలల వ్యవధి యడిగిపోయి మరికొంత విద్య నభ్యసించి మరలవచ్చి యామెకు సమాధానము చెప్పెను. అందుపై మండనమిశ్రుడు సన్యసింపగా సరసవాణి దివి కరిగెను.

ఈ సరసవాణి చరితమువలన నామె కాలమునందలి హిందూసుందరులు గొప్ప విద్య నభ్యసింపుచుండి రనియును, వారు గొప్ప పండితులతో సహితము వాదవివాదములు చేయుచుండిరనియును దెలియబడుచున్నది. ఆ కాలమునందు నోరెరుగని పసిపాపలకు దల్లిదండ్రులు తమసమ్మతితో వివాహములు చేయు నాచారములేక కన్యావరులు యుక్తవయస్కు లయిన పిదప వారియనుమతి ననుసరించియే వివాహములు జరుగుచుండె ననియును స్పష్టముగా దెలియుచున్నది. అప్పటి సంఘ స్థితినిబట్టి చూడగా నప్పటి స్త్రీ లత్యంతోచ్చదశయం దుండినట్లు తేలుచున్నది. కాని ఆకాలమునం దట్టి యుచ్చపదవియందుండిన హిందూసుందరులు ప్రస్తుత మత్యంత హీనస్థితికివచ్చి తమ దుర్దశనే తెలిసికోజాలనంతటి యజ్ఞానిను లగుట మిగుల దు:ఖకరము. పూర్వకాలము నందలి స్త్రీలకును, ఈ కాలపు స్త్రీలకును గల తారతమ్యము సతీహితబోధినీ పత్రికోక్తమూగా నిం దుదాహహరించి యీ చరితము ముగించెదను. "ఈ భరతఖండమునం దిప్పుడున్న స్త్రీలస్థితికి పూర్వ కాలమునం దుండిన స్త్రీలస్థితికిని మిక్కిలి వ్యత్యాసము గలదు. పూర్వకాలమునందలి సుందరులు విద్యలయందును, కళల యందును, పాండిత్యము కలవారయి పురుషులకుపదేశము చేయ దగినంత మంచిదశయందుగూడ నుండుచువచ్చిరి. వేదము నందు వర్ణింపబడిన గార్గి, మైత్రేయి మొదలయినవారినే ఇందుకు నిదర్శనముగా జెప్పవచ్చును; ఆ కాలమునందలి స్రీలు వేద వేదార్థము లెరిగినవారని చూపుటకు శకుంతల మొదలయిన వారిని దృష్టాంతముగా గొనవచ్చును: యజ్ఞాదులయందును, వివాహాదులయందును స్త్రీలు పఠింపవలసిన మంత్రము లుండుటయె మన పూర్వులు స్త్రీలు భాషాపాండిత్యము కలవారయి మంత్రార్థముల నెరిగియుండవలెనని యుద్దేశించినట్లు స్పష్టమగు చున్నది. ఆ కాలమునందు స్త్రీలు పురుషులవలెనే గౌరవింపబడు చుండిరిగాని యిప్పటివలె గదులలో మూసిపెట్టబడుచుండలేదు. వారికట్టి స్వాతంత్ర్యములు పూర్వకాలమునందు గలిగి యున్నవని చూపుటకు సీత మొదలగు క్షత్రియస్త్రీలు సహితము భర్తలతో వచ్చి సభలలో సింహాసనములమీద గూరుచుండుచు వచ్చిన వార్తను సూచించుటకంటె విశేష మేమియు జెప్పనక్కర లేదు. ఇవియవి యని వేరుగ జెప్పనేల? ఆకాలమునందలి స్త్రీలకుండవలసిన స్వాతంత్ర్యములనన్నిటిని వారు గలిగి యుండిరనుటకు సందేహములేదు. వారికప్పుడున్న విద్యా ప్రభావమునుబట్టి వారట్టి గౌరవములకును స్వాతంత్ర్యములకును నర్హురాండ్రయి యుండిరి. మన పూర్వులు గృహిణీ ధర్మములను వివరించుచు భర్తకు భార్య మంత్రివలె నాలోచన చెప్పవలెననియు, తల్లివలె నుపచారము చేయవలెననియు, గురువువలె హితోపదేశము చేయవలెననియు, వైద్యునివలె శరీరారోగ్యమును కాపాడవలయుననియు చెప్పియున్నారు.

ఇటువంటి పనులను యుక్తముగా నిర్వహింప గలుగుటకు స్త్రీలెంతటి విద్యావతులుగా నుండవలయునో చెప్పుటకంటె నెవరికి వా రూహించుకొనుటయే సులభముగా నుండును. జ్ఞానమూలమయిన విద్యానిపేక్ష మేహేతువు చేతనో క్రమక్రమముగా మనదేశపు స్త్రీలను విడిచిపోయినది. ఆ విద్యాధనముతో నే వారికిగల సమస్తలాభములును, సమస్త స్వాతంత్ర్యములును క్రమక్రమముగా నశించుచు వచ్చినవి. కడపట స్త్రీలకు విద్య కావలయునా యని సంశయపడునంత దురవస్థ మనదేశమున కిప్పిడు పట్టినది. స్త్రీలు విద్యాహీనురాండ్రగుటచే మూడత్వములో మునిగియుండి సంసార భారమును చక్కగా నిర్వహించుటలో మునుపటివలె పురుషులకు సహాయురాండ్రు కాజాలకున్నారు. అందుచేత పురుషులకు స్త్రీలయందు పూర్వకాలమునందుండెడు గౌరవమంతయు తగ్గిపోయినది. ఏవిషయమునందయినను స్త్రీల నాలోచన యడుగుటయే యనర్థదాయకమని సామాన్యముగా పురుషులిప్పుడు భావించుచున్నారు. అందుచేత పురుషులనేకులు స్త్రీలయొక్క యభిప్రాయముగాని అంగీకారముగాని పొందకయే వారి వివాహమను మిషమీద నంగహీనులకును, వృద్ధులకునుగూడ గట్టిపెట్టుచున్నారు. మానవదేహమున కలంకారమయిన విద్యాభూషణము వారికి లేకుండ జేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలు బొమ్మలవలె చేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రగా జూడాక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీలవిషయమున జేసిన యిట్టి యన్యాయమువలన స్త్రీలను మూడురాండ్రనుగా జేసి చెడగొట్టుటయేకాక తామును వారి తోడిపాటుగా మూడ శిరోమణులయి చెడిపోవుచున్నారు. అందుచేత పురుషులలో గూడ నిజమయిన ఈశ్వరభక్తియు సద్వర్తనమును బోయి మూడభక్తియు, నీతిరాహిత్యమును వర్థిల్లుచున్నవి. దానినిబట్టి నిజమయిన సౌఖ్యమును సంతోషమును లేక యనేకులకు భూతలస్వర్గముగా నుండవలసిన గృహము మహారణ్యమువలె నగుచున్నది. ఏయింట జూచినను నైకమత్యమునకు మారుగా కలహములును, మనస్తాపములును పెరుగుచున్నవి. ఈస్థితి యంతయు పురుషుల లోపమువలనను స్వప్రయోజన పరత్వము వలనను గలుగుచున్నదేకాని స్త్రీల దోషమువలన నణుమాత్రము గాదు. ఏకాలమునందును ఏదేశమునందును తమ స్త్రీలను మంచిదశకు తీసికొనిరాక తాము బాగుపడిన పురుషులు లేరు. తాము బాగుపడదలచిన పక్షమున ముందుగా తమస్త్రీలను బాగుచేయవలెను. స్త్రీలబాగే పురుషులబాగు; స్త్రీలయోగే పురుషులయోగు. కాబట్టి పురుషులు తమ యోగక్షేమాభివృద్ధి నిమిత్తమే మూడురాండ్రయిన యిప్పటి స్త్రీలను తొంటి యుత్తమదశకు మరల దీసికొని వచ్చుటకై ప్రయత్నింపవలెను. స్త్రీల యభివృద్ధి నిమిత్తమయి యక్కడక్కడ నుత్తమపురుషులు చేయు ప్రయత్నములకు మూడతా పిశాచావేశముచేత స్త్రీలే ప్రతిబంధకారిణులగు చున్నారు. ఇంటివద్ద స్త్రీల సహాయమున్నగాని కులాచార మతాచార విషయములయందు పూర్వాచారములకు విరుద్ధములైన నూతన సదాచారములను నెలకొలుపుట పురుషులకు సాధ్యముకాదు. కాబట్టి పురుషులు తమస్త్రీలను మూడదశయందుంచియే దేశమున కేమో మహోపకారమును చేయుదుమన్న దురహంకారము విడిచి వారి తోడ్పాటును బొందియే సత్కార్యములను జేయ జూడవలెను. స్త్రీల సహామున్నప్పుడే పురుషులకు విజయముగలిగి లోకమునకు సత్యమైన యుపకారము కలుగును. సద్విషయములలో స్త్రీల తోడ్పాటును పొందదలచిన పక్షమున ముందుగా వారి నాశ్రయించియున్న మూడతాపిశాచము తొలగునట్లుగా వారిని విద్యావతులనుగాను, వివేకురాండ్రను గాను జేసి మనకు సరియైన తోడ్పాటు చేయుటకు వారిని శక్తురాండ్రను జేయవలెను


_______