పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/221

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖడ్గతిక్కన

సంగ్రహ ఆంధ్ర


“పగఱకు వెన్నిచ్చినచో
నగఱే నిను మగతనంపు నాయకులందున్
ముగురాఁడువారమైతిమి
వగ పేటికి జలకమాడవచ్చిన చోటన్"

అని ఎకసక్కెమాడెను.

భోజనమునకు రాగా, తల్లి కొడుకునకు పప్పుకూరలతో భోజనము పెట్టి విస్తరిలో విరిగిన పాలు పోసెను. “విరిగిన పాలు నాకుఁ బోయంగ నేమి చిత్రంబు ?" అని తల్లి నాతడు అడుగగా, అందుల కా వీరమాత


"అరుణోదయము వేళ నదియెట్లొ కాని
యావులు బెయ్యలు నటు మేయఁబోయి
యరులతోఁ బోరాడి యటుమీద నీవు
విఱిగిన నినుఁ జూచి విఱిగెను బాలు
అసదృశముగ నరివీరులఁ
బసమీఱఁగ గెలువలేక పందక్రియ నీ
వసివైచి విఱిగివచ్చిన
బసులున్ విఱిగినవి, తిక్క! పాలున్ విఱిగెన్”

అని పల్కెనట. ఆత్మాభిమానియైన ఆ మహాయోధుడు తాను చేసిన పనికి పశ్చాత్తప్తుడై తండ్రిని చేరి


"ఓ తండ్రి ! వినవయ్య యొక విన్నపంబు
నాయొక్క కీర్తి యానందంబు నొంద
యదుబలంబులమీది కరుగుచున్నాఁడ
వారిని దునుమాడి వస్తినా మేలు
పోరాడి వారిచే పొలసితినై న
వీరస్వర్గము నలంకరింతు...”

అని తండ్రికి దండము పెట్టి రణరంగములోనికి దూకెను. ఆకలిగొనిన సింహము పగిది గర్జించు తిక్కనను జూచి, పిన్నమనేడు


“బుద్ధిచాలని యట్టి భూసురోత్తముఁడు
యుద్ధంబు సేయ నుద్యోగించినాడు
సర్వదా బ్రాహ్మఁడు చావకపోఁడు
బ్రహ్మహత్య మనకుఁ బాపుకోరాదు”

అని విచారించుచుండగా ప్రఖ్యాతిగల మంత్రి, ధీమంతుడు బ్రహ్మరుద్రయ్య


“బ్రాహ్మణు డాతఁడు శివబ్రాహ్మణుఁడ నేను
బ్రాహ్మణులము పోరు పాటింపగలము"

అని అందరు నివ్వెరపోయి చూచుచుండగా అతడు ముందునకు దూకెను. ఖడ్గతిక్కన అశ్వముపై నుండి యుద్ధము చేసెను. బ్రహ్మరుద్రయ్య వృషభము నెక్కి యుద్ధము చేసెను. పోరు ఘోరముగా జరిగెను. ఇరువురును సమానస్కంధులు. తిక్కన అగ్నిచందమున నలువైపుల ప్రజ్వరిల్ల సాగెను. మెరపువలె మెరయుచు పిడు గడచిన చందంబున ఒక్కవ్రేటుతో రుద్రయ్యను అవనిపై పడవైచెను. రుద్రయ్య క్రిందపడుచునే ఖడ్గము విసరెను. అది సూటిగా వచ్చి తిక్కనతల త్రుంచివైచెను. ఇరువురు సూర్యులు యుద్ధరంగమున అస్తమించిరి. తిక్కనసైనికులలో హతశేషులైనవారు ఈ క్రిందివిధముగా చెప్పుకొని యాక్రందించినారని యొక కవి చెప్పియున్నాడు.


సీ. "ధైర్యంబు నీమేనఁ దగిలియుండుటఁ జేసి
             చలియించి మందరాచలము తిరిగె,
    గాంభీర్యమెల్ల నీకడన యుండుటఁ జేసి
             కాకుత్సుచే వార్థి కట్టువడియె,
    జయలక్ష్మి నీయురస్థలినె యుండుటఁ జేసి
            హరిపోయి బలిదాన మడుగుకొనియె,
    నాకారమెల్ల నీయందె యుండుటఁజేసి
            మరుడు చిచ్చునఁబడి మడిసి చనియె

గీ. దిక్కదండనాథ దేవేంద్రపురికి నీ
    వరుగు టెఱిఁగి నగము తిరుగుటుడుగు
    నబ్ధి కట్టువిడుచు నచ్యుతు నొదమాను
    మరుఁడు మరలఁ గలుగు మగలరాజ.

సీ. నందిని బుత్తెంచె నిందు శేఖరుఁడు నీ
             వన్న యేతెమ్ము తారాద్రికడకు,
    గరుడుని బుత్తెంచె నరహరి రావయ్య
             వడిసిద్ధ తిక్క కైవల్యమునకు,
    హంసను బుత్తెంచె నజుఁడు నీకడకు ను
             భయకులమిత్ర రా బ్రహ్మసభకు,
    నైరావతముఁ బంపె నమరేంద్రుఁ డిప్పుడు
             దివమున కేతెమ్ము తిక్క యోధ

గీ. యనుచు వేఱువేఱ నర్థితోఁ బిలువంగ
    వారువీరుగూడ వచ్చివచ్చి
    దివ్యయోగియైన తిక్కనామాత్యుఁడు
    సూర్యమండలంబుఁ జొచ్చిపోయె."

178