పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/219

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖడ్గతిక్కన

సంగ్రహ ఆంధ్ర


బ్రాహ్మణావళికి ధారలు పోసిన జలంబు
          సతతంబు ముంగిట జాలువాఱు
రిపుల కొసఁగిన పత్రికల పుత్రికలను
          బాయక కరణముల్ వ్రాయుచుంద్రు .

మానఘనుడైన తిక్కన మంత్రియింట
మదన సముడైన తిక్కన మంత్రియింట
మహిత యశుడైన తిక్కన మంత్రియింట
మంత్రిమణి యైన తిక్కన మంత్రియింట."

పరశు రాముని ప్రతాపము, ద్రోణా చార్యుని శౌర్యము, కృపాచార్యుని చతురత్వము, అశ్వత్థామ మగటిమి, ఖడ్గతిక్కనయందు మూర్తీభవించినవి.

పశువుల మేపు బీళ్ళ నిమిత్తమై కాటమరాజునకును మనుమసిద్ధి రాజునకును వివాదము పొసగి మహాయుద్ధము సంభవించినటుల కాటమరాజు కథవలన తెలియుచున్నది. ఈ కాటమరాజుకథ తెలుగుదేశములో, అందు ముఖ్యముగా గుంటూరు మండలములోను, నెల్లూరు మండలములోను కడుప్రసిద్ధమై గానము చేయబడు ద్విపద ప్రబంధము.

కాటమరాజు తండ్రి పెద్దిరాజు. పెద్దిరాజు తండ్రి వల్లు రాజు. ఈ వల్లురాజు నెల్లూరు మండలమునందలి కనిగిరి సీమలోని అలవలపాడునకు అధిపతి. వీరు ఆత్రేయ గోత్రోద్భవులగు యాదవుల సంతతికి చెందినవారు. దేశమున అనావృష్టి సంభవింప, వీరు తమ పసుల మందలను తోలుకొని, దక్షిణమునకు వచ్చి మనుమ మనుమసిద్ధి రాజుయొక్క పశువుల బీళ్లలో మేపుకొని పుల్లరి చెల్లింపకయే వెడలిపోయిరి. అన్నంభట్టు అను బ్రాహ్మణుడు రాయబారిగా మనుమసిద్ధిరాజుచే కాటమరాజు కడకు పంపబడెను. కాటమరాజు పుల్లరి చెల్లింపక తగవు పెట్టుకొనెను. అందులకు మనుమసిద్ధిరాజు కాటమరాజును శిక్షించుటకై, తిరునామాల తిప్పరాజు, శ్రీకంఠరాజు, పెదవేగి బొక్కరాజు, పెదవరదరాజు, అర్లుకొండ అచ్చిరాజు, ఆదివన్నె మాదిరాజు, గయికొండ గంగరాజు, ఉర్లకొండ సోమన్న, ఉదయాద్రి ఉమ్మయ్య, చెన్నపట్టణము చంద్ర శేఖరుడు, దేవముని వెంగళయ్య, పట్టుకోట బసవరాజు, కాళహస్తి పాప తిమ్మరాజు, వెలకంచి వెంగళపతిరాజు, ప్రభగిరి పట్టణము పద్మశేఖరుడు మొదలగు యోధుల తోడ్పాటుతో అప్రతిమానమైన ప్రతిభకలిగిన ఖడ్గతిక్కన సేనాధిపత్యము క్రింద సైన్యమును పంపెను.

పల్నాటి ప్రభువైన పద్మనాయడు పల్లికొండ ప్రభువైన చల్ల పిన్నమనాయడు, దొనకొండ అయితమరాజు, ఎఱ్ఱయ్య, భట్టావులరాజు, వల్లభన్న, నాచకూళ్ళ నాయడు. ముమ్మయ్యనాయడు, ఉత్తమరాజు మొదలగు యాదవనాయకులు కాటమరాజుకు సహాయముగా వచ్చిరి. పిన్నమనాయడు ఈ సైన్యమును నడపెను.

ఉభయ సైన్యములు పాలేటి యొడ్డున ఉన్న పంచ లింగాలకొండ కడ ఎదుర్కొన్నవి సర్వేపల్లి మిట్టమీద నెల్లూరి సైనికదళము విడిసెను

ఈ యుద్ధము ఎఱగడ్డ పాటిలో మాఘ బహుళ అమావాస్య, మంగళవారమునాడు జరిగినట్లు కాటమరాజు గ్రంథమువలన తెలియుచున్నది. స్థానిక చరిత్రములవలనగాని ఇతర శాసనములవలనగాని యుద్ధము జరిగిన కాలము నిర్ణయించుట కష్టము. గ్రంథములో తెలుపబడిన వారము, తిథి, మిగిలిన వాటితో సరిపోవుట లేదు.

పిచ్చుకపై బ్రహ్మాస్త్ర మేల యనియు, త్రుటిలో యాదవసేనను చెండాడ గలుగుదుననియు తలచి ఖడ్గతిక్కన కతిపయ సేనను మాత్రము వెంటగొని, తన నిశిత కరవాలమును ప్రచండముగ జళిపించుచు యాదవసేనను తాకెను. యుద్ధరంగమున ఎచ్చట చూచినను తానెయై వీరవిహారము గావించుటచే యాదవసేనా నికాయము వికావికలయ్యెను. అత్తరి చల్ల పిన్నమనాయడు తన సైన్యమును ఉసికొల్పుచు గొప్ప సేనానివహముతో వెనుకనుండి ఖడ్గతిక్కనను గవిసెను. భయంకరముగ తుములయుద్ధము సాగెను. గోవింద యనుచు నాగోపాల గణము అట్టహాసముతో రణక్రీడ సలిపెను.


"....................... ఏక తడవు
చలముకొని యెండలో సమసినరీతి
నాకులన్నియుఁ బండి యామఱ్ఱిమీద
వడిఁ జేసి సుడిగాలి సుడిసిన యపుడు
కారాకు డుల్లిన కై వడితోను
మడిసెను దిక్కన మంత్రి సైన్యమ్ము."

176