పుట:1857 ముస్లింలు.pdf/189

ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

అయోధ్యలోని కుబేర్‌టీలా అనుచోట ఓ చింతచెట్టును ఉరికంబంగా ఉపయోగించి ఆ యోధులిద్దరిని ఒకేసారి ఆ చెట్టుకు వేలాడదీశారు. ఈ విధంగా ఆలయ పూజారి బాబా రామచరణ్‌ దాస్‌, మౌల్వీ అమీర్‌ అలీ మాతృభూమి విముక్తి కోసం పోరుబాటన సాగి ఒకే చింత చెట్టుకు జంటగా వేలాడరు. ఆ విధంగా పోరాటంలో మాత్రమే కాకుండా అమరత్వంలో కూడా ఐక్యతను ప్రదర్శించిన ఆ యోధులు చిరస్మరణీయులయ్యారు.

(Bharath Ke Pradhama Swathantrya Sangram Me Aaam logom Ki Hissedaari (Hindi) , Prof. Shamshul Islam, Nehru Yuva Kendra Sanghatana, New Delhi, 2007 )

హిందూ-ముస్లింల సమైక్య పాలన

ఈ వాతావరణం ఇలాగే కాకున్నా, మరోరూపంలో అవధ్‌ (అయోధ్య) రాజ్యం రాజధాని నగరం లక్నోలో కన్పించింది. అవద్ ను ఆక్రమించుకున్నఆంగ్లేయులను హిందూ-ముస్లిం యోధుల, స్వదేశీ పాలకుల, ప్రజల అండదడలతో తిరిగి స్వాధీనం చేసుకున్నబేగం హజరత్‌ మహల్‌ హిందూ-ముస్లింల మధ్య ఐక్యతాసాధనకు విశేషం కృషిసాగించారు. ఆమె అధికారపగ్గాలను చేపట్టగానే అన్ని సాంఫిుక జనసముదాయాలకు పాలనాధికారంలో భాగం కల్గించే విధంగా, సమిష్టి నిర్ణయాలకు అనుకూలంగా పాలనా వ్యవస్థను రూపొందించారు. బహిర్గత శత్రువును ఎదుర్కోడానికి ప్రాణాలు పణంగా పెట్టే సైనికులకు అధిక ప్రాధాన్యత కల్పించారు. స్వదేశీ పాలకులు, నమ్మకస్థులైన సైనిక అధికారులకు, తిరుగుబాటు వీరులకు, ప్రముఖులకు వారి వారి ప్రతిభా సామర్ధ్యాల ఆధారంగా పలు పాలనా విభాగాల బాధ్యాతలను అప్పగించారు.

ఈ సందార్బంగా మతం, కులం, ప్రాంతాల ప్రసక్తి లేకుండా, పౌర-సైనికాధికార ప్రముఖులైన ముమ్మూఖాన్‌, మహారాజ బాలకృష్ణ, బాబూ పూర్ణచంద్‌, మున్షీ గులాం హజరత్‌, మహమ్మద్‌ ఇబ్రహీం ఖాన్‌, రాజా లాలా సింహ్‌, రాణా జిజియా లాల్‌, రాజా మాన్‌సింగ్, రాజా దేశిబక్ష్‌ సింగ్, రాజా బేణిప్రసాద్‌ లాంటి వారితో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి రోజు సమావేశమయ్యేది. ప్రతి అంశాన్నీ కమిటీ సభ్యుల ఎదుట పెట్టి, చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటి అమలును బేగం స్వయంగా పర్యవేక్షించారు.

186