పుట:1857 ముస్లింలు.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పుస్తకం లోపల విషయానికి వెళ్ళేముందు 1857 కు సంబంధించిన సంఘటన లను ఎవరెవరు ఏ విధంగా వ్యాఖ్యానించారో రేఖామాత్రంగా చూద్దాం. 1857 అన్న వెంటనే 'సిపాయీల తిరుగుబాటు' అనే భావన మన మనోఫలకం పై మెదులుతుంది: ఆంగ్లేయుల కాలం నుండీ నేటిదాకా ఈ భావనే dominant భావనగా చలామణీ అవుతోంది. 1857 వాస్తవ స్వభావాన్ని గుర్తించినప్పుటికీ ఆంగ్లేయులు ఉద్దేశ్యపూర్వకంగా దీన్ని 'సిపాయీల తిరుగుబాటు' ('Sepoy Mutiny') అని ప్రచారం చేశారు: భారతీయులు కూడా ఈ భావాన్నే నమ్మాలని ఆశించారు. భారతీయులు ఇలా నమ్మడం వలసవాదుల రాజకీయాలకు ముఖ్యం. ఈ 'తిరుగుబాటు' అనే భావం 1857కు సంబంధించి అనేక యితర కోణాలపై మసిగుడ్డ కప్పుతుంది; పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరుగు పరుస్తుంది. ఒకవేళ సామాన్య ప్రజలు కూడా పాల్గొన్నారనే విషయం ముందుకొస్తే వారెందుకు పాల్గొన్నారన్న ప్రశ్న జనిస్తుంది. దీని ద్వారా వలసపాలకులు ప్రచారం చేసిన 'ఆంగ్లేయుల మెరుగైన పాలన' అనే పచ్చి అబద్దపు మురికి మఖౌటా చిరిగిపోయి వలసపాలకుల 'వాస్తవ రూపం' బయట పడుతుంది. వారి నైతిక ఆధిపత్యానికి గండి పడుతుంది. ఇది వలస పాలకులకు ఎంత మాత్రం రుచించని విషయం. అందుకే వాళ్ళు రచించిన పుస్తకాలన్నీ 1857 పోరాటాన్నీ 'సిపాయీల తిరుగుబాటు' గా తగ్గించి చెప్పే ప్రయత్నం చేశాయి. ఈ భావాన్నే నాటి పాఠ్యపుస్తకాల ద్వారా కూడా ప్రచారం చేశారు.
జాతీయవాద ప్రభావంతో (యిది వాస్తవంగా అగ్రవర్గ, అగ్రవర్ణ, 'జాతీయవాదం') వి.డి సావార్కర్‌ మెదలైనవారు 1857 పోరాటంలోకి 'జాతీయభావాన్ని' చొప్పించి దాన్ని 'ప్రథమ స్వాతంత్య్ర పోరాటం' గా వ్యాఖ్యానించి దాని స్వభావాన్ని, ప్రభావాన్నీ ఆకాశానికెత్తి చూపించారు. 'స్వతంత్ర' భారత ప్రభుత్వం కూడా దీన్ని 'ప్రథమస్వాతంత్య్ర పోరాటం' గానే నమ్మి మనల్ని కూడా నమ్మంటుంది. ఇలా చేయడం ద్వారా వలసపాలకులకు వ్యతిరేకంగా నూటా తొంభై సంవత్సరాలు పోరాడి స్వాతంత్య్రం సాధించిన 'ఘనత'ను ప్రచారం చేసుకుంటున్నది.
కానీ ఈ రెండూ వాదనలూ పూర్తిగా సత్యాలు కావన్న విషయాన్ని ఇటీవలి అనేక పరిశోధనలు బలమైన సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాయి. పోరాట నిర్ధిష్ట స్వభావాన్ని గూర్చి యింకా అనేక అనుమానాలున్నప్పటికీ పరిశోధనలన్నీ యిది కేవలం 'సిపాయీల తిరుగు బాటు' కాదన్న వాస్తవాన్ని నొక్కి చెబుతున్నాయి. ఎరిస్టోక్స్‌, రుద్రాంగ్ధు ముఖర్జీ లాంటి వారు పోరాటంలో సామాన్య ప్రజల భాగస్వామ్యాన్ని బలంగా నిరూపించారు. ప్రధానంగా