జ్యేష్ఠమాసముల యాంధ్ర భాషా సంజీవనీ సంచికలయందు మూడుజాబులు ప్రకటింపబడినవి ఆజాబులలో వ్రాయబడిన తిరస్కారమునకును ఛలాపలాపములకును, ప్రకటితపూర్వము లయిన నాజాబులలోనే పూర్ణముగా దత్తోత్తరములయ్యును మరల నడుగబడిన యాక్షేపములకునుమాని విద్వద్వరేణ్యుల చిత్తమువడయవేడి సుప్రసక్తములయిన విషయములకు మాత్రమే నానేర్చినకైవడి సమాథానములు వ్రాసెదను. ఇందలి గుణదోషనిర్ణయమునకై విద్యానికషపాషాణములయిన విద్వద్వరేణ్యులే ప్రమాణము"*
ఇప్పటికి వేంకటరాయశాస్త్రులవారు ఎవరికిని ద్వేష్యులై యుండలేదు. పూర్వము వీరేశలింగము పంతులవారి వితంతువాదముల కెదురువాదములు సల్పినప్పుడు శాస్త్రులవారి పాండిత్యము లోకమునకు విదితమాయెను. వారిరువురకును అభిప్రాయభేద మేర్పడినదేగాని దూషణగ్రంథములవఱకును పోలేదు. కాని వేంకటరత్నము పంతులవారుమాత్రము, తమగ్రంథముల యందలి దోషములను వెల్లడిచేసిన పూండ్ల రామకృష్ణయ్యగారి యాక్షేపములు సాధువులని వ్రాసినందున వేంకటరాయశాస్త్రులవారిని వారి పాత్రోచితభాషను ద్వేషింప నారంభించిరి; దూషించి వ్రాయసాగిరి. కాని వేంకటరాయశాస్త్రులవారు బదులుదూషింపక సవిమర్శకములైన సమాథానములవ్రాసిరి.
- ____________
- అముద్రిత. సం. 8. సంచి. 10