ప్రతాపరుద్రీయముంగాంచినంతన తెలుగు ప్రపంచమున చెప్పరాని యలజడియు ఆవేశమును జనించినవి. పాత్రోచితభాషావాదము బలపడినది. దేశమందు లెక్కలేని పండితులు ఆమోదించి శాస్త్రులవారికి జాబులును పత్రికలలో వ్యాసములును వ్రాసిరి. ద్వేషులు శాస్త్రులవారిమతమును కడతేర్పవలయునని పన్నాగములు పన్నందొడంగిరి.
పండితులు కొనియాడినవిధము
అముద్రితగ్రంథచింతామణ్యధిపతి శ్రీ పూండ్ల రామ కృష్ణయ్యగారు పెద్ద విమర్శను పదునొకండుపుటలలో ప్రకటించిరి. "ఈ ప్రతాపరుద్రీయనాటకము పాత్రల కుచితమగుసంభాషణ వాక్యములతో నిండి వినువారి వీనులకు విందై, యమృతంపుసోనలక్రందై వెలయుచున్నది... దీనివంటి యద్భుతనాటకమును మేము కని వినియెఱుంగము...ఇంతరసపుష్టి గలిగినట్టియు నింత ప్రౌడమగు నట్టియు నింత సలక్షణమైనట్టియు నాటకము వేఱొండుదానిని మేము చూడలేదనియు విన్నవించుచున్నారము."
కలావతిపత్రిక: ఇట్టి మంచినాటక మీ యాంధ్రభాషలో ఇంతవఱకు మఱియొకటి కానరాదు......
సత్వసాధని: ఇక్కవికి జాతీయ స్వాభావికజ్ఞాన పరిష్కరణప్రావీణ్యము సాక్షాత్కారము వర్ణనాంశములు వచ్చినచోట నైజప్రవర్తనము ననుసరించి వర్ణింపబడియున్నవి. ఆయాపాత్రములకు దగిన జాత్యాచారాది విషయములు వెలువడునట్లు భాషను ప్రయోగించియున్నారు. ఇది నాటకముగాన శ్రావణిక