మును బయలుపఱుపక, ముఖవికాసము మాఱకయే 'అయ్యా, నాకొక సందేహమున్నదండీ' అని యడిగిరి.
ఆతడు 'చెప్పండి శాస్త్రులవారూ' అనెను.
శాస్త్రులవారు: ఆవేశ్య మనకంటిలో వేలుపెట్టి తిప్పుతుందా, లేక తనకన్నే తిప్పుకుంటుందా, అని అడిగిరి.
అచటనున్న వారందఱును గొల్లున నవ్వసాగిరి. ఆ రసజ్ఞుడు నివ్వెఱబోయి చూడసాగెను. శాస్త్రులవారు నవ్వలేదు, మొదట నెట్లుండిరో అట్లేయుండిరి. 'ఇదేమి, ఈశాస్త్రులు, ఇంత తెలియనివాడా!' అని ఆతని యాశ్చర్యము కాబోలు. కొంతసేపుండి, అందఱును నవ్వి ముగించినవెనుక ఇంకొకరు, శాస్త్రులవారు వేడుకచేయుచున్నారని ఎఱిగి 'అయ్యా, అది మనజోలికిరాదు, మనలను తాకదులెండి' అనిరి.
'ఆహా! అయితే పర్వాలేదు' అన్నారు శాస్త్రులవారు. అందఱును లేచినవెనుక ఆప్రస్తావము తెచ్చిన ఆయనను ఇతరులు 'శాస్త్రులవారు మంచివిషయ మేదో చెప్పుచుండగా ఇటువంటి పాడు ప్రస్తావము తేవచ్చునా? నీకు బుద్ధి చెప్పడానికి వారు హాస్యముచేసినారు. వారికి లోకవ్యవహారం నీకంటె బాగానేతెలుసును. ఇకమీద కుదురుగా ఉండు.' అనిరి. అది మొదలు అతడు అట్టిప్రస్తావములుమాని వారిముందు, గౌరవముగా ప్రవర్తించుచుండెను.
1886 సం. శాస్త్రులవారు ప్రక్రియాఛందస్సు, అలంకారసారసంగ్రహములను రచించి ప్రకటించిరి. కథాసరిత్సాగర