నేనీచరిత్రను ముద్రించి, మావారైన శ్రీఅల్లాడి కృష్ణస్వామయ్యగారికి చూపి 'ఎవరైననుపెద్దలు నాయీప్రయత్నము నాంధ్రపండితావళికి ఎఱుకపఱుచుట మంచిది' అని విన్నవింపగా వారు వెంటనే 'శ్రీకట్టమంచి రామలింగారెడ్డిగారు శాస్త్రిగారి శిష్యులలో నగ్రగణ్యులు. పైగా నపారమైన గురుభక్తిగలవారును. వారే ఇందులకుతగినవారు.' అని సెలవిచ్చి, వారు వచ్చినంతనే నాకు వారిదర్శనము తామే చేయించి నాప్రయత్నముం గూర్చి వారికడ ప్రశంసించిరి. శ్రీ రెడ్డిగారు తమకు సహజాలంకారమైన ఆదరాభిమానములతో 'మాగురువుగారి గ్రంథమునకు కాదనగలనా' అని తక్షణమే నాపుస్తకమునకు ప్రశంసావాక్యముల వ్రాయుట కంగీకరించిరి.
శ్రీ రెడ్డిగారు తాతాగారి శిష్యులలో మొదటిశ్రేణిలోనివారు. తాము కళాశాలలో నాంధ్రవిద్యార్థులు; తాతగారు సంస్కృతోపాథ్యాయులు. ఐనను తాతగారిగుణములచే నాకృష్టులై అత్యంతమిత్రులును ప్రియశిష్యులును నైరి. విద్యార్థిదశయందే రెడ్డిగారియందు భావిప్రతిభాస్ఫోరకము లైన చిహ్నములు శ్రీతాతగారు కనిపట్టుచువచ్చిరి. వీరి 'ముసలమ్మ మరణము'నకు పరీక్షకులలో తాతగా రొకరు. వీరిరచనాపరిపాటి ఇతరరచనల నధ:కరించి మిన్నగానుండుటంగని వీరికే బహుమాన మిప్పించిరి. శ్రీ రెడ్డిగారు ఆధునికాంధ్రవచనరచనావిథాతలలో నొకరు. వీరి కీశక్తి నన్నయ చిన్నయల నారాధించుటచే వచ్చినది. ఆంధ్రభారతపఠనాసక్తి వీరికి హెచ్చు; అదియే