'నన్ను అవమానపరిచేవాడికి మూడుకళ్లు కావలెను. ఎవడయ్యా అంతటివాడు?' అని ఆరావుగారియింటికి శాస్త్రులవారు పోయిరి. ఆ రావుగారి జవాను గేటుకడ నడ్డెను. అంత వీరు కాగితముమీద తమపేరు వ్రాసిపంపిరి. ఆజవాను ఇటు చీటి పుచ్చుకొనిపోగా తాము అటు మఱియొకద్వారమున లోనికింబోయిరి. లోనికింబోగానే 'ఆహా! హా! శాస్త్రులవారా! రండి' అని కుర్చీ చూపి రావుగారు మర్యాదచేసినారు. ఆజవాను వీరిని చూడలేదు. చీటి చేతనుంచుకొని వ్రేలుడు మొగముతో నొకమూల అఘోరించుచుండెను. అచ్చట విధవావివాహముల వాదమువచ్చినది. పెద్దలొకరు "ఈ వాదాలన్ని కలిపి ఒక పుస్తకంగావ్రాయిస్తే బాగుంటుందండీ, వ్రాయించి ప్రకటించవలెను.' అనిరి. 'ఎవరిచేతవ్రాయిస్తాము?' అని యింకొకరడిగిరి. శాస్త్రులవారు 'అయ్యా అటువంటి దొకగ్రంథము సిద్ధముగా ఉంటే పనికిరాదా? మళ్లీ క్రొత్తగా వ్రాయించడమెందుకు.' అని యడిగిరి.
'ఆహా! పనికిరాకయేమి? బాగాపనికొస్తుందండి. అటువంటి దొకటిఉన్నదా అనే మాసందేహం!' అని ఆమొదట చెప్పినవారు పలికిరి.
'ఇదుగో' అని శాస్త్రులవారు తమజేబులోనుండి ఆవ్రాతపుస్తకమును తీసి చూపించినారు. వారందఱును ఒకరిచేతినుండి మఱియొకరు గ్రహించి కాగితములు త్రిప్పినారు. ఒకాయన ఇంకొకాయన చెవిలో నేదోచెప్పెను. 'పనికిరాదనిచెప్పు' అన్న మాటలుగా పెదవులకదలిక చే శాస్త్రులవారికి తెలిసినది. ఏలయన