ములం గుఱించియు, నేటి యాంధ్రవిద్యార్థి లోక మేమియు నెఱుంగదు. కొందఱకు పెద్దలకే, శాస్త్రులవారు గొప్పపండితులనుట తప్ప, వారేమి గ్రంథముల రచించినదియు తెలియదు. నేటి యాంధ్రవాఙ్మయమునందలి నూతన రచనావిధానముల కెన్నింటికో వారు మార్గదర్శకులై యుండ, తెలియని కొందఱు, ఇతరులు చూపిన మార్గములను వారనుకరించిరని సయితము వ్రాయసాగిరి. శాస్త్రులవారికి ప్రసన్నులుకాని కొందఱు నిరంతరముచేయు ప్రచారముచే, శాస్త్రులవారింగూర్చి దురభిప్రాయము లేర్పడుటకుసయిత మవకాశము కలుగుచున్నది. ఇట్టి సందర్భమున పలువురు శాస్త్రులవారి జీవిత విశేషముల నెఱుంగం దలంపుకొని యుండుటచే ఈ చిన్నిజీవితచరిత్రను కూర్చితిని ఇయ్యది సమగ్రముకాదు. అట్టిది వ్రాయుట గొప్పపని, కాలముపట్టును; అందులకు చాలకృషియు అపేక్షితము. శాస్త్రులవారికి వారిమిత్రులును, సమకాలిక పండితవర్యులును రచించిన జాబులలోని విశేషవృత్తాంతములనెల్ల ప్రకటింతునేని ఈ చరిత్ర బృహత్కథయంత పెరుగును, ముద్రించుటయు ఈ కాగితముల కాటకములో కష్టమగును కావున నేను నిరంతరము వారి శుశ్రూషలో వినుచుండిన విశేషములను, వారి ముద్రితాముద్రితగ్రంథములయందే అటనట చెదరియున్న వారి వ్రాతలను "ఒక్కచోటనె యొడగూర్ప నుత్సహించి" కేవలమొక జాపితాగా నీచరిత్రను వ్రాయుచున్నాడను.
- _________