16-ప్రకరణము
మరల జ్యోతిష్మతీ ముద్రాక్షరశాల
శాస్త్రులవారు కాళిదాసుని మేఘసందేశమునకు పద ప్రయోజనికయను వ్యాఖ్యను రచించి 1902 సం. మే ప్రకటించిరి. ఇయ్యది మల్లినాథవ్యాఖ్యతోను పెక్కు ఆక్షేపములకు సమాధానములతోను, ఎల్లవారును ఉపాధ్యాయ నిరపేక్షముగా చదువుకొనుట కనుకూలముగా ముద్రింపబడి ఆంధ్రదేశమున ప్రచారమునందున్నది. ఇదేవిధముగా టీకలతో సంస్కృతాంధ్రగ్రంథములను ముద్రించుటకు అచ్చాపీసు లేనిచో జరుగదని, ఎట్లో ద్రవ్యముంగూర్చుకొని జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను తిరుగ 1908 సం. అక్టోబరు నెలలో ప్రారంభించిరి. ఒకవైపు అచ్చాపీసునుజరుపుచు నింకొకవైపు కళాశాలయుద్యోగమును నిర్వహించుచు రెండేండ్లు గడపి 1910 సం. కళాశాలనుండి విరమించుకొని అచ్చాపీసునే జరుపుకొనసాగిరి. ఈవిధముగా ప్రకటనంగావించిరి-
"హిందువులకెల్ల నైహికాముష్మిక సర్వశ్రేయ:ప్రదయగు సంస్కృతభాష వారిచేత ఈకాలమందు ఉపేక్షితప్రాయము తిరస్కృతప్రాయయునై జర్మనీ, ప్రాన్సు, ఇంగ్లండు, రష్యా, యునైటెడ్ స్టేట్స్, జపాను, లోనగు దేశాంతర ఖండాంతర ద్వీపాంతరములకు వలసపోయినవిషయము జగద్విదితముగదా. మనదేవతలభాషయు మనకర్మభాషయు మన 'యెల్ల