గ్రామ్యము కూడదని సిద్ధాంతీకరించి శాస్త్రులవారిని నిబర్హణసేయుదురుగావలయు. శాస్త్రులవారు ఈసభకు దేశమందలి పండితులెల్ల రానందున ఈసభవారి సిద్ధాంతమునకు నెవ్వండును బద్ధుండుకానేరడనియు, చర్చించి యభిప్రాయముచెప్పు నధికారమేగాని బంధించు నధికారము ఈసభవారికి లేదనియు, అట్లు బద్ధులుకావలసినట్లు నిబంధన యేమియులేదనియు, ఆహూతులైవచ్చిన పండితులట్టినిబంధన కొడంబఱుపబడలేదనియు కావున తానెంతమాత్రమును ఈసభవారి సిద్ధాంతములకు ఒడంబడననియు పల్కిరి. అంతట కృష్ణమాచార్యులవారు 'ఈవిషయము కృతి విమర్శోపసంఘమువారికి తెలియును గాన మనము చర్చింపబనిలేదు.' అనిరి. 'వారిలోవైమత్యము తప్పించుటకై మనము చర్చించి సిద్ధాంతముందెలుపవలయును.' అని శాస్త్రులవారు నుడివిరి. అంతట వోట్లడిగిరి. ఇంతవివాదముపై కొందఱు ఈ విషయమును మఱునాడు ధ్వంసము చేయుదమని సంకల్పించి వోట్లిచ్చిరి....... పిమ్మట అగ్రాసనాధిపతిగారు ఆగ్రామ్యవిషయము చర్చించుటకు తనకు సమ్మతముకాదని నుడివిరి. అంతట అగ్రాసనాధిపతిగారికిష్టముగాని చర్చ యేల బలాత్కారముచేయవలయునని వేంకటరాయశాస్త్రులవారు తనవోటును ఉపసంహరించిరి. ఆవిషయము రేపు చర్చనీయము కాదని తీర్మానింపబడెను.......
వడ్డాది సుబ్బరాయడుగారు 'ఆంధ్రభాషకు లక్ష్యములుగా ప్రమాణగ్రంథములేవో తెలియవేని కృతివిమర్శోపసంఘసాంఘికులు విమర్శ యెట్లు చేయుదురు? ప్రమాణగ్రంథము లివియని యొక సిద్ధాంత మేర్పఱుపవలయును.' అని యుద్దేశించిరి. "ప్రమాణగ్రంథము లేవో తెలియరేని కృతివిమర్శోపసంఘసాంఘికులు గ్రంథవిమర్శ యెట్లుసేయుదురు? వారికావిషయము గ్రామ్యవిషయంబువోలె తెలిసియేయుండును, గాన నది యిట చర్చనీయము గాదు." అని శాస్త్రులవారు నిషేధించిరి. అదిత్యక్తమాయెను........
ఉపన్యాసక నియమనములో ....... వేంకటరాయశాస్త్రులవారికిని, పూండ్ల రామకృష్ణయ్యగారికిని తప్ప కడమయందరికిని ఉపన్యాసములు కుదిర్చిరి........